Share News

Shashi Tharoor: నా ఓట్లకు గండి కొడతారా? సీపీఐపై మండిపడిన శశిథరూర్

ABN , Publish Date - Mar 19 , 2024 | 05:10 PM

'ఇండియా' (I.N.D.I.A.) కూటమి భాగస్వామిగా ఉన్న లెఫ్ట్ పార్టీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మండిపడ్డారు. తిరువనంతపురం నుంచి పోటీ చేస్తున్న తనపై అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా ఓట్లను చీల్చేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. శశిథరూర్ తిరువనంతపురం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు.

Shashi Tharoor: నా ఓట్లకు గండి కొడతారా? సీపీఐపై మండిపడిన శశిథరూర్

తిరువనంతపురం: 'ఇండియా' (I.N.D.I.A.) కూటమి భాగస్వామిగా ఉన్న లెఫ్ట్ పార్టీ (CPI)‌పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) మండిపడ్డారు. తిరువనంతపురం (Thiruvananthapuram) నుంచి పోటీ చేస్తున్న తనపై అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా ఓట్లను చీల్చేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. శశిథరూర్ తిరువనంతపురం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. తాజాగా మరోసారి తిరువనంతపురం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.


''గత రెండు ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. విపక్ష పార్టీల ఐక్యత గురించి నిజంగానే వారికి (సీపీఐ) చిత్తశుద్ధి ఉంటే నా ఓట్లకు గండిపడేలా తమ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టారు? నాకు వ్యతిరేకంగా వారి ప్రచారం సాగుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా ఆ పార్టీ ప్రచారం చేసినట్టు నా చెవిన పడలేదు. మైనారిటీ ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు'' అని థరూర్ మంగళవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.


ఇదొక ఎత్తుగడ...

''థర్డ్ పార్టీగా ఉన్న బీజేపీకి మాత్రమే ఉపయోగపడే ఎత్తుగడ ఇది. సీపీఐను నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. మీరు మాట్లాడింది ఏమిటి? ఇక్కడ చేస్తున్నదేమిటి? కూటమి ధర్మానికి కట్టుబడి ఉండాలనే నేను వారికి చెప్పదలచుకున్నాను'' అని శశిథరూర్ అన్నారు. దీనికి ముందు ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదకగా చేసిన పోస్ట్‌లోనూ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. వయనాడ్‌లో రాహుల్‌గాంధీ అభ్యర్థిత్వానికి సమ్మతి తెలిపిన సీపీఐ.. తిరువనంతపురం మాత్రం బీజేపీ గేమ్ ఆడుతుండటం బాధాకరమని అన్నారు. తిరువనంతపురంలో తనకు వ్యతిరేకంగా సీపీఐ చేసే ప్రచారం వల్ల బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయన్నారు. వయనాడ్ విషయంలో కూటమి ధర్మం గురించి మాట్లాడుతూ, తిరువనంతపురంలో ఇందుకు భిన్నంగా లెప్ట్ పార్టీ ప్రవర్తించడం సరికాదని అన్నారు.


శశిథరూర్‌కు డి.రాజా కౌంటర్..

కాగా, శశిథరూర్ వ్యాఖ్యలను సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా తిప్పికొట్టారు. శశిథరూర్ వంటి బాగా చదువుకున్న వ్యక్తి కేరళ చరిత్రను సరిగా అర్ధం చేసుకోవాలని అన్నారు. మతతత్వ, ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ తమదని, అనేక మంది కాంగ్రెస్ నేతలు సొంత పార్టీని వీడి బీజేపీలో చేరారని ఆయన గుర్తు చేశారు. 20 లోక్‌సభ స్థానాలున్న కేరళలో ఏప్రిల్ 26న ఎన్నికలు జరుగనున్నాయి.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 19 , 2024 | 05:10 PM