Mumbai: ఓటర్లను అవమానపరిచేలా రాహుల్ వ్యాఖ్యలు.. ఈవీఎం మిషన్ల వివాదంపై కోహ్లీ కౌంటర్
ABN , Publish Date - Mar 18 , 2024 | 11:37 AM
లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (EVM) సమగ్రతను ప్రశ్నిస్తూ ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత నళిన్ కోహ్లీ సోమవారం మండిపడ్డారు.
![Mumbai: ఓటర్లను అవమానపరిచేలా రాహుల్ వ్యాఖ్యలు.. ఈవీఎం మిషన్ల వివాదంపై కోహ్లీ కౌంటర్](https://media.andhrajyothy.com/media/2024/20240313/rahul_7e0d06c678.jpg)
ముంబై: లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (EVM) సమగ్రతను ప్రశ్నిస్తూ ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత నళిన్ కోహ్లీ సోమవారం మండిపడ్డారు.ఈ ఆరోపణలతో ఓటర్లను అవమానించడమేనని ఆయన విమర్శించారు.
నళిన్ కోహ్లి మాట్లాడుతూ.. 'ఈ తరహా ఆరోపణలు చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ భారత ఓటర్లను అవమానిస్తున్నారు. దేశ భవితవ్యాన్ని నిర్దేశించేది ఓటర్లే. 2014, 2019లో ప్రధాని మోదీని ఆశీర్వదించిన వారు, ఆయనను మూడోసారి ప్రధాని చేయాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే నరేంద్ర మోదీ దేశాన్ని తన కుటుంబంగా భావిస్తారు. ఓటర్లు కాంగ్రెస్ని విశ్వసించట్లేదని భావించి.. ఆ నెపాన్ని ఈవీఎంలపై వేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈవీఎం పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించారు. అలాంటప్పుడు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి కాంగ్రెస్ గెలిచిందనుకోవచ్చా' అని కోహ్లీ ప్రశ్నించారు.