Share News

Qatar: భారత దౌత్య విజయం.. ఖతర్ జైలు నుంచి విడుదలైన నేవీ మాజీ అధికారులు

ABN , Publish Date - Feb 12 , 2024 | 09:11 AM

గూఢచర్యం(Espionage) ఆరోపణలపై ఖతార్‌(Qatar)లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఎనిమిది మంది భారతీయ నావికాదళ మాజీ అధికారులకు విముక్తి లభించింది. భారత ప్రయత్నాలు ఫలించడంతో ఖతర్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని విడుదల చేసినట్లు ప్రభుత్వం సోమవారం తెలిపింది.

Qatar: భారత దౌత్య విజయం.. ఖతర్ జైలు నుంచి విడుదలైన నేవీ మాజీ అధికారులు

ఢిల్లీ: గూఢచర్యం(Espionage) ఆరోపణలపై ఖతార్‌(Qatar)లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఎనిమిది మంది భారతీయ నావికాదళ మాజీ అధికారులకు విముక్తి లభించింది. భారత ప్రయత్నాలు ఫలించడంతో ఖతర్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని విడుదల చేసినట్లు ప్రభుత్వం సోమవారం తెలిపింది. వీరు 18 నెలలపాటు శిక్ష అనుభవించారు. "ఖతార్‌లో బంధీలుగా మారిన భారతీయ పౌరులను విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నాం.

వారిలో ఇప్పటికే ఏడుగురు భారత్ చేరుకున్నారు. ఖతార్ ప్రభుత్వానికి ధన్యవాదాలు" అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కెప్టెన్ సౌరభ్ వశిష్ఠ, కెప్టెన్ నవ్‌తేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగునాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తాలు భారత్‌కు తిరిగొచ్చిన వారిలో ఉన్నారు


జరిగిందిదే..

భారత్ కు చెందిన 8 మంది నౌకాదళ మాజీ అధికారులు అల్ దహ్రా(Al Dahra) సంస్థలో పని చేస్తున్నారు. ఖతర్ సాయుధ దళాలకు శిక్షణ, ఇతర సేవలు అందించే ఈ సంస్థను ఒమన్ కు చెందిన ఓ మాజీ వైమానిక దళాధికారి నిర్వహిస్తున్నారు. భారత్ కు చెందిన 8 మందిని ఖతర్ అధికారులు ఆగస్టు 2022లో బంధించారు. సబ్ మెరైన్(Submarine) కార్యక్రమాల్లో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో వీరిని బంధించినట్లు అధికారులు తెలిపారు.

కస్టడీలో ఉండగానే పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. నిర్బంధాన్ని పొడిగిస్తూ పోయిన కోర్టు.. చివరకు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన భారత ప్రభుత్వం కోర్టులో అప్పీలు దాఖలు చేసింది. అనంతరం, న్యాయస్థానం నేవీ మాజీ అధికారుల మరణ శిక్షను జైలు శిక్షగా తగ్గించింది. తాజాగా వారందరినీ విడుదల చేసింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 12 , 2024 | 09:16 AM