Share News

Pongal: కార్డుదారులందరికీ పొంగల్ కానుక.. నేడు ప్రారంభించనున్న సీఎం

ABN , Publish Date - Jan 10 , 2024 | 08:34 AM

పొంగల్‌ పండుగ సందర్భంగా రూ1,000 నగదుతో కూడిన కానుక పంపిణీని ఈనెల 10న బుధవారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ప్రారంభించనున్నారు.

Pongal: కార్డుదారులందరికీ పొంగల్ కానుక.. నేడు ప్రారంభించనున్న సీఎం

పెరంబూర్‌(చెన్నై): పొంగల్‌ పండుగ సందర్భంగా రూ1,000 నగదుతో కూడిన కానుక పంపిణీని ఈనెల 10న బుధవారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ప్రారంభించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, ఆస్తిపన్ను చెల్లించే వారు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, చక్కెరకార్డులు కలిగి సరుకులు పొందలేని వారికి సహా రూ.1,000 నగదు, కిలో పచ్చిబియ్యం, కిలోచక్కెర, చెరకు గడ అందజేయనున్నారు.

టోకెన్ల పంపిణీ...

పొంగల్‌ బహుమతుల కోసం రేషన్‌ దుకాణాల ముందు ప్రజల రద్దీని అడ్డుకొనేలా టోకెన్లు అందజేశారు. ఈనెల 7వ తేది నుంచి 9వరకు రేషన్‌ సిబ్బంది కార్డుదారుల ఇళ్లకే వెళ్లి టోకెన్లు అందించారు. సదరు కార్డుదారుడు ఏ రోజున, ఏ సమయాన రేషన్‌ దుకాణానికి వెళ్లి పొంగల్‌ బహుమతులు పొందవచ్చనే వివరాలు టోకెన్లలో ఉన్నాయి. టోకెన్లు పొందిన వారు బుధవారం నుంచి ఈనెల 14వ తేది పొంగల్‌ కానుకను పొందవచ్చు.

2.24 కోట్ల కార్డులు...

రాష్ట్రవ్యాప్తంగా 2.24 కోట్ల రేషన్‌ కార్డులుండగా, వాటిలో 4 లక్షల చక్కెర కార్డులు. ఇక, ప్రభుత్వ ఉద్యోగులు అని మరో 24 లక్షల కార్డులున్నాయి. ఈ కార్డులు కలిగిన వారు పొంగల్‌ కానులకు అనర్హులు. మిగిలిన 1.86 కోట్ల రేషన్‌ కార్డుదారులు పొంగల్‌ బహుమతులు అందుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, పలు వర్గాలు, పార్టీల నుంచి అందిన వినతులతో అన్నిరకాల కార్డుదారులకు రూ.1,000 నగదుతో కూడిన పొంగల్‌ బహుమతి అందించనున్నట్లు సీఎం స్టాలిన్‌ మంగళవారం ప్రకటించారు. ఈ పథకంలో అందించే సరుకుల కొనుగోలుకు తొలివిడతగా రాష్ట్రప్రభుత్వం ఈనెల 4వ తేది రూ.239 కోట్లు విడుదల చేయగా, సోమవారం మిగిలిన రూ.1,828 కోట్లు కేటాయించింది.

nani2.jpg

ప్రారంభించనున్న సీఎం..

పొంగల్‌ కానుకల పంపిణీని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ బుధవారం ప్రారంభించనున్నారు. ఆళ్వార్‌పేట శ్రీరాంనగర్‌లో ఉన్న రేషన్‌ దుకాణంలో జరిగే కార్యక్రమంలో సీఎం పాల్గొని, కార్డుదారులకు పొంగల్‌ కానుకలను అందించనుండగా, అనంతరం అన్ని రేషన్‌ దుకాణాల్లో రూ.1,000 నగదుతో కూడిన పొంగల్‌ కానుక ప్రారంభం కానుంది. అదే సమయంలో రేషన్‌ దుకాణాల వద్ద రద్దీ నియంత్రించేలా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.

Updated Date - Jan 10 , 2024 | 08:34 AM