PM Modi: 4న చెన్నై నగరానికి ప్రధాని నరేంద్రమోదీ
ABN , Publish Date - Feb 25 , 2024 | 11:40 AM
ప్రధాని నరేంద్రమోదీ మార్చి 4వ తేదీ నగరానికి రానున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయన రాష్ట్రంలో విస్తృతంగా ప్రచార సభల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.
![PM Modi: 4న చెన్నై నగరానికి ప్రధాని నరేంద్రమోదీ](https://media.andhrajyothy.com/media/2024/20240224/nani1_b148840c87.jpg)
చెన్నై: ప్రధాని నరేంద్రమోదీ మార్చి 4వ తేదీ నగరానికి రానున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయన రాష్ట్రంలో విస్తృతంగా ప్రచార సభల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 27, 28 తేదీలలో పల్లడం, మదురై, తూత్తుకుడి, తిరునల్వేలి నగరాల్లో సుడిగాలి పర్యటన జరిపి పలు సభల్లో మోదీ పాల్గొననున్నారు. 27న పల్లడంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలై పాదయాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం మదురైలో ఏర్పాటయ్యే కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి మదురైలో బసచేస్తారు. ఆ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులతో ఆయన భేటీ అవుతారు. మరుసటి రోజు తూత్తుకుడి హార్బర్ ప్రాంగణంలో ఏర్పాటయ్యే ప్రభుత్వ కార్యక్రమంలో, కులశేఖరపట్టణం రాకెట్ ప్రయోగ కేంద్రం శంకుస్థాపనలో ఆయన పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం తిరునల్వేలిలో ఏర్పాటయ్యే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఆ నేపథ్యంలో మార్చి నాలుగున బీజేపీ కూటమి ఎన్నికల ప్రచార సభలో పాల్గొనే నిమిత్తం ఆయన చెన్నై రానున్నారు. నగరంలో ఏర్పాటయ్యే పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రధాని పాల్గొనే సభకు అనువైన రెండు ప్రాంతాల్లో ఒక దానిని ఎంపిక చేసేందుకు ప్రధాని భద్రతాదళం ఉన్నతాధికారులు రెండు మూడు రోజుల్లో నగరానికి చేరుకోనున్నారు. ప్రస్తుతం రాయపేట వైఎంసీఏ మైదానం, పల్లావరం ప్రాంతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రధాని మోదీ నగరంలో పాల్గొనే బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాదిమంది పార్టీ శ్రేణులను తరలించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకులు అప్పుడే ప్రయత్నాలు కూడా ప్రారంభించారు.