Share News

PM Modi: మూడో సారి నేనే ప్రధాని.. మహిళలే ప్రాధాన్యతగా పథకాలు తెస్తామన్న మోదీ

ABN , Publish Date - Mar 11 , 2024 | 01:18 PM

ముచ్చటగా మూడోసారి కేంద్రంలో బీజేపీ(BJP) సర్కార్ అధికారంలోకి వస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో సశక్త్ నారీ - విక్షిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మూడోసారి తానే ప్రధానిగా బాధ్యతలు చేపడతానని.. మహిళలే ప్రాధాన్యతగా పథకాలు తీసుకొస్తామని స్పష్టం చేశారు.

PM Modi: మూడో సారి నేనే ప్రధాని.. మహిళలే ప్రాధాన్యతగా పథకాలు తెస్తామన్న మోదీ

ఢిల్లీ: ముచ్చటగా మూడోసారి కేంద్రంలో బీజేపీ(BJP) సర్కార్ అధికారంలోకి వస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో సశక్త్ నారీ - విక్షిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మూడోసారి తానే ప్రధానిగా బాధ్యతలు చేపడతానని.. మహిళలే ప్రాధాన్యతగా పథకాలు తీసుకొస్తామని స్పష్టం చేశారు.

"కాంగ్రెస్ హయాంలో మహిళల జీవితాలు దుర్భరంగా ఉండేవి. వారికి సాయం చేయడానికి బీజేపీ అన్నివిధాలా సహకరిస్తోంది. మరుగుదొడ్ల ఉపయోగం, శానిటరీ ప్యాడ్‌ల వాడకం, కలప, బొగ్గు వంటి వాటి వల్ల కలిగే దుష్పరిణామాలు, బ్యాంకు ఖాతాల ఆవశ్యకత వంటి అనేక విషయాలను మహిళలకు వివరించాను. ఇలా చేసినందుకు నన్ను కాంగ్రెస్ వంటి పార్టీలు ఎగతాళి చేసి, అవమానించాయి. వివిధ ప్రభుత్వ పథకాల కింద రూ.8 లక్షల కోట్లకుపైగా మహిళలకు పంపిణీ చేశాం. మహిళలకు చిన్నపాటి సాయం చేసినా వారు ఇతరులకు సాయం చేస్తారనేది నా అనుభవంలో తెలుసుకున్నాను. తమ కుటుంబాల కోసం ఆలోచించే రాజకీయ నాయకులు ఈ అంశాల గురించి ఎప్పుడూ అర్థం చేసుకోలేరు" అని మోదీ విమర్శించారు. 'సశక్త్ నారీ-విక్షిత్ భారత్' కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక బృందాలకు బ్యాంకు రుణాలుగా దాదాపు రూ.8,000 కోట్లను మోదీ పంపిణీ చేశారు.


దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళా లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. పనిలోని వివిధ అంశాలను అడిగి తెలుసుకున్నారు. వారి కృషి, సంకల్పాన్ని కొనియాడారు. 'దీనదయాళ్ అంత్యోదయ యోజన - జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్' మద్దతుతో విజయం సాధించిన మహిళలకు, ఇతర స్వయం సహాయక బృందాల అభ్యున్నతికి తోడ్పాటునందిస్తున్న 'లఖపతి దీదీ'లను కూడా మోదీ సత్కరించారు. 1,000 మంది మహిళలకు 'నమో డ్రోన్ దీదీస్' డ్రోన్‌లను అందజేశారు. SHGలకు రూ. 2,000 కోట్ల క్యాపిటలైజేషన్ సపోర్టు ఫండ్‌ను కూడా పంపిణీ చేశారు. 'నమో డ్రోన్ దీదీ', 'లఖపతి దీదీ' పథకాలు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల్లో ఆర్థిక సాధికారత, ఆర్థిక స్వయంప్రతిపత్తిని పెంపొందించే కార్యక్రమాలుగా పీఎంవో వివరించారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 11 , 2024 | 01:18 PM