Share News

BJP: నెహ్రూ సరసన మోదీ!

ABN , Publish Date - Jun 08 , 2024 | 03:23 AM

వరుసగా మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన నెహ్రూ రికార్డును మోదీ సమం చేశారు. కాంగ్రెసేతర పక్షాల నుంచి ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్న తొలి వ్యక్తి మోదీనే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో తొలిసారి లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఫలితాల తర్వాత నెహ్రూ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1957, 62 సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రె్‌సను ఆయన విజయపథాన నడిపించి ప్రధాని అయ్యారు. నెహ్రూ కుమార్తె ఇందిరకు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు.

BJP: నెహ్రూ సరసన మోదీ!

  • వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నిక!

  • కాంగ్రెసేతర పక్షాల నుంచి తొలి వ్యక్తిగా ఘనత

న్యూఢిల్లీ, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): వరుసగా మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన నెహ్రూ రికార్డును మోదీ సమం చేశారు. కాంగ్రెసేతర పక్షాల నుంచి ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్న తొలి వ్యక్తి మోదీనే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో తొలిసారి లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఫలితాల తర్వాత నెహ్రూ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1957, 62 సార్వత్రిక ఎన్నికల్లోనూ కాంగ్రె్‌సను ఆయన విజయపథాన నడిపించి ప్రధాని అయ్యారు. నెహ్రూ కుమార్తె ఇందిరకు కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు.

ఇందిర నాలుగు పర్యాయాలు ప్రధానిగా పనిచేసినా వరుసగా సార్వత్రిక ఎన్నికలలో గెలవలేదు. దేశంలో కాంగ్రెసేతర పక్షాలు బలంగా లేకపోవడంతో నెహ్రూ రికార్డును ఎవరూ అందుకోలేకపోయారు. బీజేపీ వరుసగా 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలవడం.. మూడోసారి కూడా మోదీనే ప్రధాని బాధ్యతలు చేపట్టనుండటంతో నెహ్రూ సరసన నిలవనున్నారు. అయితే 1952లో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా అత్యధిక కాలం ప్రధానిగా చేసిన రికార్డు మాత్రం ఇందిరా గాంధీ పేరిటే ఉంది.

ఆమె 15 ఏళ్ల 350 రోజులు ప్రధాని పదవిలో ఉన్నారు. ఇందిర రికార్డును మోదీ సాధించాలంటే ఈ పదవీ కాలం పూర్తిచేసుకొని, మరోసారి బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని మధ్యతరగతి కుటుంబంలో 1950లో మోదీ జన్మించారు. హీరాబెన్‌, దామోదర్‌ దాస్‌ మోదీ దంపతులకు ఆయన మూడో సంతానం. విద్యార్థి దశలోనే ఆర్‌ఎ్‌సఎ్‌సలో చేరి స్వయంసేవక్‌గా పనిచేశారు.

ఆ సమయంలోనే రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు. అతికొద్దికాలంలోనే బీజేపీ అగ్రనాయకత్వం దృష్టిని ఆకర్షించారు. మోదీని ఎల్‌కే ఆడ్వాణీ ప్రోత్సహించారు. 1990లో ఆడ్వాణీ రథయాత్రలో మోదీ పాల్గొన్నారు. 1992లో మురళీ మనోహర్‌ జోషి చేపట్టిన కన్యాకుమారి-కశ్మీర్‌ ఏక్తా యాత్రకు మోదీ జాతీయ ఇన్‌చార్జిగా పనిచేశారు. 2001లో గుజరాత్‌ సీఎం అయ్యారు.

గోద్రా అల్లర్ల సమయంలో మోదీ తీరుపై తీవ్రవిమర్శలొచ్చాయి. సీఎం పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్లు ఎన్డీయే మిత్రపక్షాల నుంచి సైతం వచ్చాయి. అయినప్పటికీ 2014 మేలో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టేవరకు గుజరాత్‌ సీఎంగా పనిచేశారు. తన హాయాంలో వరుసగా మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికలలో పార్టీని మోదీ గెలిపించారు.

Updated Date - Jun 08 , 2024 | 03:24 AM