Share News

Maratha quota Stir: జనాలను రెచ్చగొట్టారంటూ మనోజ్ జారంగేపై కేసు

ABN , Publish Date - Feb 26 , 2024 | 08:47 PM

మరాఠా కోటా ఆందోళనలకు సారథ్యం వహించిన ఉద్యమ నేత మనోజ్ జారంగే‌పై కేసు నమోదైంది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాల్లో పలు చోట్ల రోడ్లను దిగ్బంధించాలంటూ ప్రజలను ఆయన రెచ్చగొట్టారని షిరూర్, అమల్నేర్ పోలీసు స్టేషన్లలో కేసు నమోదు చేశారు.

Maratha quota Stir: జనాలను రెచ్చగొట్టారంటూ మనోజ్ జారంగేపై కేసు

ముంబై: మరాఠా కోటా ఆందోళనలకు (Maratha quota Stir) సారథ్యం వహించిన ఉద్యమ నేత మనోజ్ జారంగే (Manoj Jarange)పై కేసు నమోదైంది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాల్లో పలు చోట్ల రోడ్లను దిగ్బంధించాలంటూ ప్రజలను ఆయన రెచ్చగొట్టారని షిరూర్, అమల్నేర్ పోలీసు స్టేషన్లలో కేసు నమోదు చేశారు. జారంగే ఇచ్చిన పిలుపుతో సామాన్య ప్రజానీకం రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలిగిందని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.


నన్ను చంపే ప్రయత్నం చేశారు..

కాగా, దీనికి ముందు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌పై జారంగే సంచలన ఆరోపణలు చేశారు. ఫడ్నవిస్ తనను చంపే ప్రయత్నం చేశారని అన్నారు. దీంతో ఒక్కసారిగా జారంగేపై విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు వ్యక్తులు తనపై తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారని, ఈ కుట్రల వెనుక ఫడ్నవిస్ ఉన్నారని, ఆయన తనను చంపాలని కోరుకుంటున్నారని, ఫడ్నవిస్ అధికార సాగర్ బంగ్లా వరకూ మార్చ్ చేయడానికి తాను సిద్ధమని జారంగే ప్రకటించారు. దీనిపై ఫడ్నవిస్‌ను అడిగినప్పుడు, ఆయన (జారంగే) ఏమి మాట్లాడారో తాను వినలేదని సమాధానమిచ్చారు.


సహనాన్ని పరీక్షించొద్దు...

ఫడ్నవిస్‌పై జారంగే చేసిన ఆరోపణలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సూటిగా స్పందించారు. తమ ప్రభుత్వ సహనాన్ని ఆయన (జారంగే) పరీక్షించరాదని అన్నారు. '' వాళ్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదేపదే ఆందోళనకు దిగడం సరికాదు. శాంతి భద్రతల సమస్య సృష్టించ కూడదు. సహజంగా శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే వాడే స్క్రిప్టు తరహాలో జారంగే ప్రసంగం ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించింది'' అని ఏక్‌నాథ్ షిండే వ్యాఖ్యానించారు.

Updated Date - Feb 26 , 2024 | 08:47 PM