Share News

Kavitha: కవితను అరెస్ట్‌ చేసిన సీబీఐ

ABN , Publish Date - Apr 12 , 2024 | 10:01 AM

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్‌ అయ్యి.. తిహాడ్‌ జైలులో ఉన్న కవితను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గురువారం అరెస్టు చేసింది. ఈ విషయాన్ని గురువారం మధ్యాహ్నం ఆమె భర్త అనిల్‌కు తెలిపింది.

Kavitha: కవితను అరెస్ట్‌ చేసిన సీబీఐ

  • సవాల్‌ చేస్తూ కోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు

  • కనీస సమాచారం లేకుండా అరెస్టు చేశారని వాదన

  • ఎలాంటి ఊరటా ఇవ్వలేమని చెప్పిన న్యాయమూర్తి

  • నేడు ఉదయం పదిగంటలకు ప్రత్యేక కోర్టులో విచారణ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్‌ అయ్యి.. తిహాడ్‌ జైలులో ఉన్న కవితను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గురువారం అరెస్టు చేసింది. ఈ విషయాన్ని గురువారం మధ్యాహ్నం ఆమె భర్త అనిల్‌కు తెలిపింది. ఆమె అరెస్టును సవాల్‌ చేస్తూ.. కవిత తరఫున న్యాయవాది మోహిత్‌రావు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులోని ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం 4.55 నిమిషాలకు ఆ పిటిషన్‌.. ప్రత్యేక న్యాయమూర్తి మనోజ్‌ కుమార్‌ ముందుకు వచ్చింది. కవిత తరఫున సీనియర్‌ న్యాయవాది నితేష్‌ రాణా వర్చువల్‌గా వాదనలు వినిపించారు. ఆమెను అరెస్టు చేసే క్రమంలో సీబీఐ కనీస ప్రమాణాలు పాటించలేదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు ఉన్నా.. సీబీఐ వాటిని పాటించలేదని తెలిపారు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి మనోజ్‌కుమార్‌.. ‘పిటిషన్‌పై వాదనలు వినాలా? వద్దా?’ అనే దానిపై ఇంకా నిర్ణయమే జరగలేదని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి తన వద్ద ఎలాంటి సమాచారమూ లేదని తెలిపారు. ‘‘మీకేమైనా సమాచారం ఉందా?’’ అని సీబీఐ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను న్యాయమూర్తి ప్రశ్నించగా.. తనకూ ఎలాంటి సమాచారం లేదని ఆయన బదులిచ్చారు. దీంతో.. అసలు సీబీఐ అరెస్టు చేసిందని మీరెలా చెబుతున్నారని కవిత తరఫు న్యాయవాదిని జడ్జి ప్రశ్నించారు. కవితను అరెస్టు చేసినట్టు ఆమె భర్త అనిల్‌కు సీబీఐ సమాచారం అందించిందని మోహిత్‌ రావు తెలిపారు. అయితే.. అత్యవసర కేసులను మాత్రమే తాము విచారిస్తామని, కాబట్టి ఈ విషయంలో కవితకు ఎటువంటి ఊరట ఇవ్వలేమని న్యాయమూర్తి స్పష్టం చేశా రు. ‘‘ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన సమాచారం మా దగ్గర లేదు. దీనిపై గతంలో ఎప్పుడూ మా దగ్గర వాదనలు జరగలేదు. ఈరోజు సెలవు కదా? అత్యవసరమైన కేసులను మాత్రమే విచారిస్తాం. సుప్రీంకోర్టు, హైకోర్టులు ఏమైనా అత్యవసర ఆదేశాలు ఇస్తే అమలుచేస్తాం. అయినా.. ఇది అత్యవసరంగా విచారించాల్సిన కేసు కాదనేది మా అభిప్రాయం. కాబట్టి ఈ కేసులో ఎలాంటి ఊరటా ఇవ్వలేం.’’ అని తేల్చిచెప్పారు. దీంతో.. తమ పిటిషన్‌ను రెగ్యులర్‌ కోర్టులో శుక్రవారమైనా విచారించాలని మోహిత రావు విజ్ఞప్తి చేశారు. దీనికి న్యాయమూర్తి.. ఈ కేసుపై రెగ్యులర్‌గా విచారణ జరుగుతున్న సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి కావేరి భవేజా కోర్టులోనే శుక్రవారం ఉదయం 10 గంటలకు వాదనలు వినిపించాలని సూచించారు. పిటిషన్‌ను ఆ న్యాయస్థానానికి బదిలీ చేస్తున్నట్టు తెలిపారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను తొలుత విచారించింది సీబీఐ అధికారులే. ఆ తర్వాతే ఈడీ రంగంలోకి దిగింది. కవితకు సీబీఐ 2022 డిసెంబరు 2న నోటీసులు పంపింది. డిసెంబర్‌ 11న హైదరాబాద్‌లోని కవిత ఇంట్లోనే ఆమెను తొలిసారి విచారించింది. అప్పుడు కవితను సాక్షిగా మాత్రమే సీబీఐ పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 23న.. ఆమెను నిందితురాలిగా చేరుస్తూ సీబీఐ చార్టిషీట్‌ దాఖలు చేసింది. ఈ ఏడాది మార్చి 15న కవితను హైదరాబాద్‌లో ఈడీ అరెస్టు చేసింది. 16న ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. తర్వాత 10 రోజులపాటు కవితను ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించింది. 26న న్యాయస్థానం కవితకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో ఆమెను తిహాడ్‌ జైలుకు తరలించారు. కవిత 17 రోజులుగా తిహాడ్‌ జైలులోనే ఉన్నారు.

తిహాడ్‌ జైలులో ఉన్న కవిత నుంచి మరింత సమాచారం రాబట్టడానికి విచారించడానికి కోర్టు అనుమతి కోరిన సీబీఐ... దానిపై విచారణ జరుగుతుండగానే తీహాడ్‌ జైలకు వెళ్లి శనివారమే విచారించింది. తాజాగా ఆమెను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది.

Updated Date - Apr 12 , 2024 | 10:01 AM