Share News

Kamala Haasan: పని చేయని నేతలపై కఠిన చర్యలు తప్పవు..

ABN , Publish Date - Jan 24 , 2024 | 01:47 PM

పార్టీకి సేవలందించడంలో బాగా వెనుకబడి, సోమరితనంతో ఉన్న నేతలపై కఠిన చర్యలు తీసుకుంటానని మక్కల్‌ నీదిమయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత కమలహాసన్‌(Kamala Haasan) హెచ్చరించారు.

Kamala Haasan: పని చేయని నేతలపై కఠిన చర్యలు తప్పవు..

- ఎంఎన్‌ఎం అధినేత కమలహాసన్‌ హెచ్చరిక

చెన్నై, (ఆంధ్రజ్యోతి): పార్టీకి సేవలందించడంలో బాగా వెనుకబడి, సోమరితనంతో ఉన్న నేతలపై కఠిన చర్యలు తీసుకుంటానని మక్కల్‌ నీదిమయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత కమలహాసన్‌(Kamala Haasan) హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆయా నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, జిల్లా శాఖ నాయకులు ప్రచారాన్ని ముమ్మరంగా ప్రారంభించాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం ఆళ్వార్‌పేటలో మక్కల్‌ నీది మయ్యం ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్య నిర్వాహక కమిటీ సమావేశంలో కమల్‌ ప్రసంగిస్తూ... లోక్‌సభ ఎన్నికల్లో ఏ కూటమిలో చేరాలనే విషయంపై త్వరలోనే తగు నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. అదే విధంగా నియోజకవర్గాల వారీగా బూత్‌కమిటీల ఏర్పాటుపై జిల్లా శాఖ నాయకులు దృష్టి సారించాలని దిశా నిర్దేశం చేశారు. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో ప్రచార వ్యూహాలపై పార్టీ ప్రముఖులతో చర్చించారు. ఈ సమావేశంలో ఎంఎన్‌ఎం ఉపాధ్యక్షులు మౌర్యా, తంగవేలు, ప్రధాన కార్యదర్శి అరుణాచలం, రాష్ట్ర కార్యదర్శులు సెంథిల్‌, ఆరుముగం, శివ ఇళంగో, స్నేహన్‌, శ్రీధర్‌, మురళీ అబ్బాస్‌, నటి శ్రీప్రియ, స్నేహా మోహన్‌దా్‌స, మైల్‌సామి, జాన్సన్‌, మయిల్‌వాహనన్‌ శ్రీపతి, గోపీనాథ్‌, అళగర్‌ ప్రేమ్‌, రంగనాధన్‌, అరుళ్‌రాజ్‌, నాగరాజ్‌, వైదీశ్వరన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 24 , 2024 | 01:47 PM