Kamal Nath: రాహుల్ మధ్యప్రదేశ్లో, కమల్, నకుల్నాథ్ ఢిల్లీలో...
ABN , Publish Date - Feb 17 , 2024 | 04:52 PM
మధ్యప్రదేశ్ కాంగ్రెస్కు గట్టి దెబ్బ తగిలే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో భాగంగా రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్లో శనివారం అడుగుపెట్టగా, కాంగ్రెస్ మాజీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్, ఆయన కుమారుడు, ఛింద్వారా ఎంపీ నకుల్ నాథ్ అనూహ్యంగా ఢిల్లీకి బయలుదేరారు. దీంతో వీరిద్దరూ బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు మరింత బలపడ్డాయి.
![Kamal Nath: రాహుల్ మధ్యప్రదేశ్లో, కమల్, నకుల్నాథ్ ఢిల్లీలో...](https://media.andhrajyothy.com/media/2024/20240215/kamal_f2dbbaa8d7.jpg)
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ కాంగ్రెస్కు గట్టి దెబ్బ తగిలే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో భాగంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో శనివారం అడుగుపెట్టగా, కాంగ్రెస్ మాజీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ (Kamal nath), ఆయన కుమారుడు, ఛింద్వారా ఎంపీ నకుల్ నాథ్ (Nakukl Nath) అనూహ్యంగా ఢిల్లీకి బయలుదేరారు. కమల్నాథ్, ఆయన కుమారుడు కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరనున్నారంటూ బలమైన ఊహాగానాల నేపథ్యంలో తండ్రీకొడుకులు ఇద్దరూ ఢిల్లీకి చేరుకోవడంతో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది.
కమల్నాథ్ నిర్ణయం వెనుక...
కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ ప్రస్థానం సాగిస్తున్న కమల్నాథ్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సీటును ఆశించారు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం అందుకు నిరాకరించింది. దిగ్విజయ్ సింగ్ విధేయుడైన అశోక్ సింగ్కు టిక్కెట్ ఇచ్చేందుకు మొగ్గుచూపింది. దీంతో నకుల్ నాథ్ తన ట్విట్టర్ బయో నుంచి కాంగ్రెస్ ట్యాగ్ తొలగించారు. ఆ వెంటనే తండ్రీకొడుకులిద్దరూ పార్టీ ఫిరాయించనున్నట్టు ఊహాగానాలు వెలువడ్డాయి. కమల్నాథ్ పార్టీకి విధేయుడని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ గట్టిగా చెబుతున్నప్పటికీ కమల్నాథ్ ద్వయం బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైనట్టు బీజేపీ వర్గాలు చెబుతుండటం ఉత్కంఠను పెంచుతోంది.