Share News

India GDP: జపాన్, జర్మనీని అధిగమించి.. 2027 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

ABN , Publish Date - Feb 22 , 2024 | 05:16 PM

మరో నాలుగేళ్లలో భారత్ జీడీపీ (India GDP) 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని.. 2027 నాటికి జపాన్ (Japan), జర్మనీలను (Germany) అధిగమించి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ కంపెనీ ‘జెఫరీస్ గ్రూప్’ (Jefferies Group) తెలిపింది.

India GDP: జపాన్, జర్మనీని అధిగమించి.. 2027 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

మరో నాలుగేళ్లలో భారత్ జీడీపీ (India GDP) 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని.. 2027 నాటికి జపాన్ (Japan), జర్మనీలను (Germany) అధిగమించి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ కంపెనీ ‘జెఫరీస్ గ్రూప్’ (Jefferies Group) తెలిపింది. ఆర్థిక వృద్ధి రేటులో నిరంతర పెరుగుదల, అనుకూలమైన భౌగోళిక రాజకీయ పరిస్థితులు, మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుదల, సంస్కరణల విషయంలో వేస్తున్న అడుగులు, బలమైన కార్పొరేట్ సంస్కృతి వంటి పరిణామాల దృష్ట్యా.. 2027 నాటికి భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని జెఫరీస్ తన నివేదికలో పేర్కొంది.

గత 10 సంవత్సరాలుగా భారతదేశం 7% వార్షిక వృద్ధి రేటుతో అభివృద్ధి చెందుతోందని, 3.6 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థతో భారత్ తొమ్మిదో స్థానం నుంచి ఐదో స్థానానికి చేరుకుందని జెఫరీస్ తన నోట్‌లో రాసుకొచ్చింది. దివాలా చట్టం, GST అమలు, రియల్ ఎస్టేట్ నియంత్రణ చట్టం (RERA), పెద్ద నోట్ల రద్దు వంటి అనేక ప్రధాన సంస్కరణల ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ.. ఇండియా GDP వృద్ధి చెందిందని వెల్లడించింది. రాబోయే ఐదేళ్లలో భారత్ 6% వృద్ధి చెందుతుందని అంచనా వేయడంతో పాటు ఇతర పెద్ద ఆర్థిక వ్యవస్థల వృద్ధి రేట్లు క్షీణించవచ్చని జోస్యం చెప్పింది. అభివృద్ధి చెందిన దేశాలకు వ్యతిరేకంగా పెరుగుతున్న వృద్ధి రేటుని చూస్తుంటే.. ఈ దశాబ్దం ముగిసేలోపే GDP ర్యాంక్‌లలో భారత్ మూడో స్థానానికి చేరుకుంటుందని తాము విశ్వసిస్తున్నామని తెలిపింది.


అంతేకాదు.. గత 10 నుంచి 20 సంవత్సరాలుగా డాలర్ పరంగా భారతదేశ ఈక్విటీ మార్కెట్ 10-12 శాతం చొప్పున నిరంతరం వృద్ధి చెందుతోందని జెఫరీస్ తన నివేదికలో పేర్కొంది. వచ్చే ఐదు నుంచి ఏడు సంవత్సరాల్లో ఈ ఈక్విటీ మార్కెట్లు 8-10 శాతం డాలర్ల రాబడిని అందజేస్తాయని.. 2030 నాటికి భారతదేశ స్టాక్ మార్కెట్ మార్కెట్ క్యాప్ $10 ట్రిలియన్‌లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఈ సందర్భంగా.. జెఫరీస్‌కు చెందిన మహేష్ నందూర్కర్ మాట్లాడుతూ, సంస్కరణల దిశగా తీసుకున్న కొన్ని చర్యల కారణంగా భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. దేశీయ పెట్టుబడుల పెరుగుదల కారణంగా.. భారతీయ మార్కెట్లో అస్థిరత తగ్గిందన్నారు. విదేశీ పెట్టుబడిదారుల నుండి పెట్టుబడులు పెంచేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు.

‘‘మార్కెట్ క్యాప్ పరంగా భారత్ ఐదో అతిపెద్ద దేశం అయినప్పటికీ.. బ్లూమ్‌బెర్గ్ వరల్డ్ ఇండెక్స్‌లో (Bloomberg World Index) దాని ర్యాంకింగ్ కేవలం 2.0% పెరుగుదలతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ లెక్కన.. విదేశీ పెట్టుబడిదారులు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌లో పెట్టుబడిని పెంచడానికి విపరీతమైన అవకాశం ఉంది’’ అని జెఫరీస్ తన నోట్‌లో వెల్లడించింది. అటు.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కూడా తమ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే, భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచంలోని అనేక రేటింగ్ ఏజెన్సీలు, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు కూడా ఈ అంచనా వేయడం జరిగింది.

Updated Date - Feb 22 , 2024 | 05:16 PM