Share News

Train Runs Withour Driver: చిక్‌చిక్ రైలు.. దూరం దూరం జరగండి... బెంబేలెత్తించిన గూడ్సు మిస్టరీ..?

ABN , Publish Date - Feb 26 , 2024 | 07:11 PM

ఒకటి కాదు, రెండు కాదు, జమ్మూకశ్మీర్ నుంచి పంజాబ్ వరకూ ఏకంగా 70 కిలోమీటర్లు డ్రైవర్ లేకుండా గూడ్సు రైలు దూసుకెళ్లి జనం గుండెల్లో గుబులెత్తించింది. రాళ్ల లోడుతో వెళ్తూ 5 రైల్వే స్టేషన్లను దాటేసింది. అదృష్టం బాగుండి ఆ మార్గంలో ఇతర రైళ్లు కానీ, క్రాసింగ్‌లు కానీ లేకపోవడం, పట్టాలు తప్పకుండా ప్రయాణించడంతో భారీ ప్రమాదమే తప్పింది. దీంతో రైల్వే శాఖ అధికారులు తేలిగ్గా ఊపిరిపీల్చుకున్నారు. తక్షణమే దర్యాప్తు చేపట్టారు.

Train Runs Withour Driver: చిక్‌చిక్ రైలు.. దూరం దూరం జరగండి... బెంబేలెత్తించిన గూడ్సు మిస్టరీ..?

ఛండీగఢ్: ఒకటి కాదు, రెండు కాదు, జమ్మూకశ్మీర్ నుంచి పంజాబ్ వరకూ ఏకంగా 70 కిలోమీటర్లు డ్రైవర్ లేకుండా గూడ్సు రైలు దూసుకెళ్లి జనం గుండెల్లో గుబులెత్తించింది. రాళ్ల లోడుతో వెళ్తూ 5 రైల్వే స్టేషన్లను దాటేసింది. అదృష్టం బాగుండి ఆ మార్గంలో ఇతర రైళ్లు కానీ, క్రాసింగ్‌లు కానీ లేకపోవడం, పట్టాలు తప్పకుండా ప్రయాణించడంతో భారీ ప్రమాదమే తప్పింది. దీంతో రైల్వే శాఖ అధికారులు తేలిగ్గా ఊపిరిపీల్చుకున్నారు. తక్షణమే దర్యాప్తు చేపట్టారు.


ఆదివారం ఉదయం 7.25 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకూ 53 వాగన్లతో 14806R నెంబర్ గూడ్సు రైలు జమ్మూకశ్మీర్‌లోని కథువా నుంచి పంజాబ్‌లోని హోషియార్‌పూర్ వరకూ ప్రయాణించింది. ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది.


ఎవరూ లేకుండా ఎలా కదిలింది?

ప్రాథమిక సమాచారం ప్రకారం, డ్రైవర్ ఛేంజ్ కోసం జమ్మూకశ్మీర్ రైల్వే స్టేషన్‌లో తొలుత రైలు ఆపారు. ఇంజన్ నుంచి డ్రైవర్ దిగిపోయాడు. జమ్మూ-జలంధర్ సెక్షన్‌పై ట్రాక్ జాలువారినట్టు ఉండటంతో రాళ్ల లోడుతో ఉన్న గూడ్సు రైలు ముందుకు కదిలిపోయినట్టు నార్త్ రైల్వే ప్రతినిధి ఒకరు తెలిపారు. రైలు ముందుకు దూసుకువెళ్లిన సమయంలో లోకో పైలట్ కానీ, అసిస్టెంట్ లోకో పైలట్ కానీ అందులో లేదు. దీంతో 70 కిలోమీటర్లు రైలు దూసుకువెళ్లింది. వెంటనే రైలును ఆపాలని అధికారులు ప్రయత్నించి చిట్టచివరకు బస్సీ రైల్వే స్టేషన్ సమీపంలో ఆపారు. రైలును ఆపేందుకు పట్టాలపై చెక్కలు, ఇసుక బస్తాలు వంటివి అడ్డుపెట్టారు.


టీ కోసం వెళ్లిన డ్రైవర్లు

ఇంజన్‌ను వదిలి డ్రైవర్లు టీ కోసం వెళ్లినట్టు పేరు చెప్పడానికి నిరాకరించిన కథువా స్టేషన్ అధికారి ఒకరు వెల్లడించినట్టు ఒక ప్రముఖ పత్రిక తెలిపింది. డ్యూటీ ఛేంజ్ సమయంలో నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన చోటుచేసుకున్నట్టు మరో అధికారి వెల్లడించారు. డ్రైవర్ లేకుండా దూసుకువెళ్లిన గూడ్సు రైలు కారణంగా మూడు ప్యాసింజర్ రైళ్ల రాకపోకల్లో జాప్యం జరిగినట్టు చెబుతున్నారు. కాగా, ఈ ఘటనకు ఇతమిత్ధమైన కారణం ఏమిటనే దానిపై దర్యాప్తు ప్రారంభించామని, ప్రాథమిక సమాచారం ప్రకారం పంజాబ్ వైపు పట్టాలు జాలువారినట్టు ఉండటంతో డ్రైవర్, అతని అసిస్టెంట్ లేకుండానే రైలు రోల్ అయినట్టు కనిపిస్తోందని జమ్మూ డివిజనల్ ట్రాఫిక్ మేనేజర్ ప్రతీక్ శ్రీవాత్సవ తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే కచ్చితమైన కారణం తెలుస్తుందన్నారు.

Updated Date - Feb 26 , 2024 | 07:11 PM