Share News

UN: కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్య రాజ్య సమితి.. ఏమందంటే

ABN , Publish Date - Mar 29 , 2024 | 03:09 PM

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ని(Arvind Kejriwal) ఈడీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్న వేళ.. యూఎన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్.. ఎన్నికలు జరుగుతున్న ఏ దేశంలోనైనా.. ప్రజల రాజకీయ, పౌర హక్కులు సేఫ్‌గా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

UN: కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్య రాజ్య సమితి.. ఏమందంటే

యూఎన్: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ని(Arvind Kejriwal) ఈడీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్న వేళ.. యూఎన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్.. ఎన్నికలు జరుగుతున్న ఏ దేశంలోనైనా.. ప్రజల రాజకీయ, పౌర హక్కులు సేఫ్‌గా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు ఓటు వేసేందుకు అనువైన వాతావరణం కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని నొక్కి చెప్పారు.

సార్వత్రిక ఎన్నికల ముందు సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీ బ్యాంకు అకౌంట్లు స్తంభించిన వేళ భారత్‌లోని రాజకీయ పరిస్థితులను ప్రస్తావించగా డుజారిక్ పైవిధంగా స్పందించారు. ఈ విషయాలపై ఇటీవలే అమెరికా స్పందించింది. అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ.. “ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తరువాత చర్యలను నిశితంగా పరిశీలిస్తున్నాం. ఐటీ అధికారులు కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను స్తంభింపజేసినట్లు కూడా మాకు తెలుసు. ఈ సమస్యలకు న్యాయమైన, పారదర్శకమైన, చట్టపరమైన ప్రక్రియలను ప్రోత్సహిస్తాం" అని అన్నారు.


కౌంటర్ ఇచ్చిన భారత్..

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై అమెరికా విదేశాంగ శాఖ చేసిన కామెంట్స్‌కి వ్యతిరేకంగా భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటనలో కీలక వ్యాఖ్యలు చేసింది. అమెరికా వ్యాఖ్యలు ఆమోదించలేనివని, అసమంజసమైనవని పేర్కొంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఆ దేశ దౌత్యవేత్తకు భారత్ సమన్లు పంపింది. బుధవారం అమెరికా తాత్కాలిక డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బెనాను.. భారత విదేశీ వ్యవహారాల కార్యాలయానికి పిలిపించుకొని 40 నిమిషాల పాటు చర్చించింది.

"ఒక దేశానికి సంబంధించి ఎన్నికలు, చట్టపరమైన ప్రక్రియలపై ఆరోపణలు ఆమోదయోగ్యం కాదు. భారత్‌లో చట్టపరమైన ప్రక్రియలు చట్టబద్ధమైన పాలనతోనే నడుస్తాయి. ఇందులో ఏ దేశం జోక్యం అక్కర్లేదు" అని ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన నివేదికలను తమ ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోందని యూఎస్ తెలిపింది. ఈ కేసులో సమయానుకూల, పారదర్శక న్యాయ విచారణ జరుగుతుందని ఆశిస్తున్నామని అని అమెరికా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. అంతకు ముందు కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై జర్మనీ విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటన కూడా దుమారం రేపింది. కేజ్రీవాల్‌ విచారణ పారదర్శకంగా జరగాలంటూ జర్మనీ కామెంట్స్ చేసింది. దీనిపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని జర్మనీ దేశ రాయబారికి కూడా సమన్లు పంపింది. దేశ అంతర్గత విషయాల్లో ఇతరుల జోక్యం అవసరం లేదని భారత్ స్పష్టం చేసింది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 29 , 2024 | 03:09 PM