Share News

Nirmala Sitaraman: బీజేపీయేతర రాష్ట్రాలపై వివక్ష అబద్ధం: నిర్మలా సీతారామన్

ABN , Publish Date - Feb 05 , 2024 | 04:53 PM

'పన్నుల వాటా, రాష్ట్రాల మధ్య పంపిణీ' అనే అంశంపై పార్లమెంటులో సోమవారంనాడు చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. బీజేపీయేతర ప్రభుత్వాల పట్ల 'వివక్ష' చూపుతున్నారంటూ అధీర్ రంజన్ చౌదరి ఆరోపించారు. ఇందులో వాస్తవం లేదని నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు.

Nirmala Sitaraman: బీజేపీయేతర రాష్ట్రాలపై వివక్ష అబద్ధం: నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: 'పన్నుల వాటా, రాష్ట్రాల మధ్య పంపిణీ' అనే అంశంపై పార్లమెంటులో సోమవారంనాడు చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman), కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury) మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. బీజేపీయేతర ప్రభుత్వాల పట్ల..మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు బకాయిలు, కేటాయింపుల విషయంలో 'వివక్ష' చూపుతున్నారంటూ అధీర్ రంజన్ చౌదరి ఆరోపించారు. అధీర్ మాటల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని నిర్మలా సీతారామన్ ఖండించారు. ఆయన మాటలు రాజకీయ కోణంలో ఉన్నాయని తప్పుపట్టారు.


''పన్నుల వాటా, రాష్ట్రాల మధ్య పంపిణీ ఫైనాన్స్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగానే ఉంటాయి. రాష్ట్రానికి ఒక రకంగా నిబంధనలు మార్చే హక్కు నాకు లేదు. కొన్ని రాష్ట్రాలు రాజ‌కీయ రంగు పులుముతూ ఆయా రాష్ట్రాల ప‌ట్ల వివ‌క్ష క‌న‌బ‌రుస్తున్నామ‌ని ఆరోపించడం సరికాదు'' అని నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు.


చర్చ సందర్భంగా అధీర్ రంజన్ జోక్యం చేసుకుంటూ, రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందడానికి కర్ణాటక తాజా ఉదాహరణ అని అన్నారు. దీనిపై కర్ణాటక మంత్రివర్గమంతా ఆందోళన చెందుతున్నారని చెప్పారు. కొద్ది నెలల క్రితం వరకూ అంతా సవ్యంగానే ఉందని, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సమస్య మొదలైందని ఆరోపించారు. దీనిపై నిర్మలా సీతారామన్ స్పందిస్తూ, ఎస్‌జీఎస్‌టీ 100 శాతం రాష్ట్రాలకు వెళుతుందని, ఇది ఆటోమేటిక్ ప్రొవిజన్ అని చెప్పారు. ఐజీఎస్‌టీ అనేది అంతర్‌రాష్ట్ర పేమెంట్లనీ, పీరియాడికల్‌గా సమీక్ష ఉంటుందని చెప్పారు. సీజీఎస్‌టీ అనేది ఫైనాన్స్ కమిషన్ డివైడ్ చేస్తుందన్నారు. తనంతతాను ఇష్టానుసారంగా ఎలాంటి మార్పులు చేర్పులు చేయడానికి కుదరదని, ఒక రాష్ట్రాన్ని ఇష్టపడటం, మరో రాష్ట్రానికి వ్యతిరేకంగా వ్యవహరించడం తమ పార్టీ రాజకీయాలకు కూడా విరుద్ధమని చెప్పారు. ఇందులో తన పాత్ర ఎంతమాత్రం లేదన్నారు. ప్రతి ఆర్థిక మంత్రి చేసినట్టుగానే 100 శాతం ఆర్థిక కమిషన్ సిఫారసులను తాను పాటిస్తానని, దీన్ని ఎలాంటి భయం, పక్షపాతం లేకుండా తాము చేపడతామని చెప్పారు. "ఫైనాన్స్ కమిషన్ చెప్పకుండా నేను చేయడానికి ఏమీ లేదు. దయజేసి నేను ఏదో వివక్ష చూపుతున్నానని ఊహించుకోవద్దు. ఫైనాన్స్ కమిషన్‌తో మాట్లాడండి'' అంటూ నిర్మలా సీతారామన్ తన చర్చను ముగించారు.

Updated Date - Feb 05 , 2024 | 04:53 PM