Share News

Rajya Sabha Elections: బీజేపీకి షాక్.. క్రాస్ ఓటింగ్ చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యే

ABN , Publish Date - Feb 27 , 2024 | 04:24 PM

రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. కర్ణాటక లో కాంగ్రెస్‌కు అనుకూలంగా బీజేపీ ఎమ్మెల్యే ఎస్‌టీ సోమశేఖర్ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. ఈ విషయాన్ని కర్ణాటక బీజేపీ చీఫ్ విప్ దొద్దనగౌడ జి.పాటిల్ మంగళవారంనాడు ధ్రువీకరించారు.

Rajya Sabha Elections: బీజేపీకి షాక్.. క్రాస్ ఓటింగ్ చేసిన ఆ పార్టీ ఎమ్మెల్యే

బెంగళూరు: రాజ్యసభ ఎన్నికల్లో (Rajya Sabha Elections) క్రాస్ ఓటింగ్ ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్టు ప్రచారం జరుగుతుండగా, కర్ణాటక (Karnataka)లో ఇందుకు భిన్నంగా కాంగ్రెస్‌కు అనుకూలంగా బీజేపీ ఎమ్మెల్యే ఎస్‌టీ సోమశేఖర్ (ST Somasekhar) క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. ఈ విషయాన్ని కర్ణాటక బీజేపీ చీఫ్ విప్ దొద్దనగౌడ జి.పాటిల్ మంగళవారంనాడు ధ్రువీకరించారు. దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్‌ పార్టీలో క్రాస్ ఓటింగ్‌కు అవకాశాలే లేవన్నారు.


''వాళ్లు (బీజేపీ) ఎమ్మెల్యేలను చెక్కుచెదరకుండా జాగ్రత్త పెట్టుకోవచ్చు. బీజేపీలో మాత్రమే క్రాస్ ఓటింగ్ సాధ్యమవుతుంది, కాంగ్రెస్‌లో కాదు'' అని సిద్ధరామయ్య తెలిపారు. కర్ణాటక నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు మంగళవారంనాడు ఓటింగ్ జరుగుతోంది. కాంగ్రెస్‌కు చెందిన అజయ్ మాకెన్, సైయద్ నసీర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్, బీజేపీ అభ్యర్థి ఎన్.బాండగే, జేడీ(ఎస్) అభ్యర్థి కుపేంద్ర రెడ్డి పోటీ చేస్తున్నారు.


క్రాస్ ఓటింగ్ నిజమే...

ఎస్‌టీ సోమశేఖర్ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టు ధ్రువీకరణ అయిందని, దీనిపై చర్చించి చర్యలు తీసుకుంటామని దొద్దనగూడ జి.పాటిల్ మీడియాకు తెలిపారు. కాగా, ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందు సోమశేఖర్ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గానికి నీళ్లు, ఇతర సౌకర్యాల కల్పనకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చి, ధీమా కల్పించిన వారికే తాను ఓటు వేస్తానని చెప్పారు.

Updated Date - Feb 27 , 2024 | 08:53 PM