Share News

Karnataka: వీళ్లు టీచర్లా, రాక్షసులా.. విద్యార్థులతో ఇలాంటి పనులు చేయిస్తారా?

ABN , Publish Date - Jan 30 , 2024 | 03:29 PM

పాఠశాలలు ఉన్నది ఎందుకు? పిల్లలకు చదువులు చెప్పించడానికి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి! కానీ.. కర్ణాటకలోని కొన్ని పాఠశాలలు మాత్రం విద్యార్థుల పట్ల మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాయి. విద్యాబుద్ధులు నేర్పించకుండా.. కూలీల తరహాలో వారితో పనులు చేయిస్తున్నాయి.

Karnataka: వీళ్లు టీచర్లా, రాక్షసులా.. విద్యార్థులతో ఇలాంటి పనులు చేయిస్తారా?

పాఠశాలలు ఉన్నది ఎందుకు? పిల్లలకు చదువులు చెప్పించడానికి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి! కానీ.. కర్ణాటకలోని కొన్ని పాఠశాలలు మాత్రం విద్యార్థుల పట్ల మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాయి. విద్యాబుద్ధులు నేర్పించకుండా.. కూలీల తరహాలో వారితో పనులు చేయిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితమే.. ఓ స్కూల్ ప్రిన్సిపాల్ విద్యార్థులతో పాఠశాలలోని బాత్రూంలు కడిగించడమే కాదు, తన ఇంటి పనులు కూడా చేయించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది మరువకముందే.. అలాంటిదే మరో ఇన్సిడెంట్ కర్ణాటకలో చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థినులు మరుగుదొడ్లను కడుగుతున్న వీడియో ఒకటి బయటపడింది. కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నెటిజన్లు ఆ పాఠశాల యాజమాన్యంపై దుమ్మెత్తిపోస్తున్నారు. చదువు చెప్తారన్న నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కూలుకి పంపితే.. ఇదా మీరు చేయించేదంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, పిల్లలతో ఇలాంటి పనులు చేయిస్తున్న టీచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి చేరడంతో.. ఒక బృందం రంగంలోకి దిగింది. ఆ పాఠశాలను సందర్శించి, అక్కడి పరిస్థితుల్ని సమీక్షించినట్లు తెలిసింది. అయితే.. ఆ స్కూల్ టీచర్లపై చర్యలు తీసుకున్నారా? లేదా? అనే విషయంపై ఇంకా సమాచారం అందాల్సి ఉంది. ఏదేమైనా.. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న దుర్భర పరిస్థితుల్ని ఎత్తిచూపుతోంది.

కాగా.. గతంలో కోలార్‌లోని యలవల్లి మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ స్కూల్‌లో, అలాగే బెంగళూరులోని అందరహళ్లి ప్రభుత్వ పాఠశాలలోనూ పిల్లలతో ఇలాంటి పనులు చేయించారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వడంతో.. అధికారులు రంగంలోకి దిగి తగిన చర్యలు తీసుకున్నారు. గతేడాది డిసెంబరులోనూ శివమొగ్గలో ఇలాంటిదే మరో సంఘటన వెలుగు చూసినప్పుడు.. కర్నాటక విద్యా శాఖ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని వెంటనే సస్పెండ్ చేసింది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా అప్పుడు సీరియస్‌గా స్పందించారు. ఇలాంటి పనులు చేయమని పిల్లలను బలవంతం చేస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Jan 30 , 2024 | 03:29 PM