Share News

Encounter: 29 మంది నక్సల్స్‌ మృతి.. మావోయిస్టు చరిత్రలోనే భారీ ఎన్‌కౌంటర్..!

ABN , Publish Date - Apr 17 , 2024 | 03:14 AM

దండకారణ్యం మరోమారు నెత్తురోడింది. ఒకప్పుడు గూగుల్‌ మూడోకంటికి కూడా అందని విధంగా.. నక్సల్స్‌కు కంచుకోటగా ఉన్న అబూజ్‌మడ్‌లో మంగళవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు

Encounter: 29 మంది నక్సల్స్‌ మృతి.. మావోయిస్టు చరిత్రలోనే భారీ ఎన్‌కౌంటర్..!
Maoist Encounter

  • నక్సల్స్‌ చరిత్రలోనే భారీ ప్రాణనష్టం!

  • మృతుల్లో డీవీసీఎం నేత శంకర్‌రావు..

  • ఆయన భార్య సుమన కూడా!

  • శంకర్‌రావుపై రూ.10 లక్షల రివార్డు..

  • ఆయన స్వస్థలం భూపాలపల్లి జిల్లా

  • మావోయిస్టులు వినోద్‌ బావ్డే, లలిత, మాధవి, రాజు మృతదేహాల గుర్తింపు

  • వీరిపైనా 10 లక్షల రివార్డులు..

  • నక్సల్స్‌ కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు గాయాలు

  • హెలికాప్టర్‌లో రాయ్‌పూర్‌ ఆస్పత్రికి..

  • ఆపరేషన్‌కు తెలుగు అధికారి నేతృత్వం

  • ఏకే 47, ఎస్‌ఎల్‌ఆర్‌, ఇన్సాస్‌ తుపాకులు సీజ్‌..

  • ఎన్నికల్లో విధ్వంసానికి కుట్రలు

  • సకాలంలో సమాచారం, కూంబింగ్‌..

  • మృతదేహాలను ఇంకా తరలించాల్సి ఉంది

  • భారీ ఎన్‌కౌంటర్‌ వివరాలు వెల్లడించిన కాంకేర్‌ సీనియర్‌ ఎస్పీ కల్యాణ్‌

  • నెల వ్యవధిలో 54 మంది నక్సల్స్‌..

  • గడిచిన మూడున్నర నెలల్లో 79 మంది మృతి

చర్ల, ఏప్రిల్‌ 16: దండకారణ్యం మరోమారు నెత్తురోడింది. ఒకప్పుడు గూగుల్‌ మూడోకంటికి కూడా అందని విధంగా.. నక్సల్స్‌కు కంచుకోటగా ఉన్న అబూజ్‌మడ్‌లో మంగళవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు చెందిన సిరిపెల్లి సుధాకర్‌ అలియాస్‌ శంకర్‌రావు ఉన్నారు. ఆయన భార్య, ఆదిలాబాద్‌ జిల్లా హత్నూర్‌కు చెందిన దాసర్వర్‌ సుమన అలియాస్‌ రజిత కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. బస్తర్‌ రేంజ్‌ ఐజీ పి.సుందర్‌కుమార్‌, కాంకేర్‌ సీనియర్‌ ఎస్పీ ఐ.కళ్యాణ్‌ ఎలిసెల కథనం ప్రకారం.. ఈ నెల 19న మొదటి దశ లోక్‌సభ పోలింగ్‌లో భాగంగా బస్తర్‌ రీజియన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశ ఎన్నికల్లో భాగంగా కాంకేర్‌లో ఈ నెల 26న ఎన్నికలు జరగనున్నాయి.


ఈ ప్రాంతాల్లో ఎన్నికలను బహిష్కరించాలని కొన్ని రోజులుగా మావోయిస్టులు కరపత్రాలు, లేఖలను విడుదల చేస్తున్నారు. సోమవారం దండకారణ్యంలో బంద్‌కు పిలుపునిచ్చారు. ఎన్నికల రోజు కుట్రలు పన్నారనే సమాచారంతో చోటాబేటియా ఠాణా పరిధిలోని బినాగూడ, చోటాబేటియా అడవుల్లో సోమవారం నుంచి బీఎ్‌సఎఫ్‌, డీఆర్జీ బలగాలతో కూంబింగ్‌ ప్రారంభించినట్లు ఈ ఆపరేషన్‌ను ముందుండి నడిపించిన సీనియర్‌ ఎస్పీ కల్యాణ్‌(తెలుగు అధికారి) తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 1.30 సమయంలో అబుజ్‌మడ్‌ ప్రాంతంలో పోలీసులపైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో.. పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. ‘‘సాయంత్రం 5.30 వరకు.. సుమారు 4 గంటల పాటు ఇరువైపులా కాల్పులు కొనసాగాయి. మావోయిస్టుల వైపు కాల్పులు ఆగిపోవడంతో.. మా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో.. మొత్తం 29 మంది మావోయిస్టుల మృతదేహాలను కనుగొన్నాం’’ అని ఆయన వివరించారు.

వీరిలో శంకర్‌రావు, సుమన, లలిత, వినోద్‌బావ్డే, మాధవి, లలిత, రాజు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనాస్థలి నుంచి ఒక ఏకే-47, ఒక ఎస్‌ఎల్‌ఆర్‌, ఇన్సాస్‌, పాయింట్‌-303 రైఫిళ్లు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నక్సల్స్‌ కాల్పుల్లో బీఎ్‌సఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌ చౌదరి మోకాలికి, డీఆర్జీ కానిస్టేబుల్‌ సూర్యకాంత్‌ రెండు తొడల్లో తూటాలు దూసుకుపోయాయి. వారిద్దరినీ మెరుగైన వైద్యం కోసం హెలికాప్టర్‌లో రాయ్‌పూర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు వెల్లడించారు. ‘‘మాకు ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. ఈ ఎన్‌కౌంటర్‌లో 50 మంది దాకా నక్సల్స్‌ పాల్గొన్నారు. ఘటనాస్థలి నుంచి పరారైన వారి కోసం అడవుల్లో కూంబింగ్‌ ముమ్మరం చేశాం. చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను బేస్‌క్యాం్‌పనకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో మృతదేహాల తరలింపు ఆలస్యమవుతోంది’’ అని బస్తర్‌ రీజియన్‌ ఐజీ పి.సుందర్‌రాజ్‌ విలేకరులకు తెలిపారు.


తొలిసారి భారీ ప్రాణనష్టం..

నక్సల్స్‌ చరిత్రలోనే ఇది అతి భారీ ప్రాణనష్టంగా తెలంగాణకు చెందిన గ్రేహౌండ్స్‌ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ఎక్కడ భారీ ఎన్‌కౌంటర్‌ జరిగినా.. గ్రేహౌండ్స్‌ ఉనికి ఉండేదని, మంగళవారం నాటి కాల్పుల్లో బీఎ్‌సఎఫ్‌, డీఆర్జీ మాత్రమే పాల్గొన్నట్లు వివరించాయి. ‘‘2016లో ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు చనిపోయారు. అంతకు ముందు గడ్చిరోలిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది నక్సల్స్‌ మృతిచెందారు’’ అని పేర్కొన్నాయి. ఛత్తీ్‌సగఢ్‌లో 2008లో జరిగిన ఎన్‌కౌంటర్‌ తర్వాత ఇదే అతిపెద్దదని సీఆర్పీఎఫ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన సిరిపెల్లి సుధాకర్‌ అలియాస్‌ శంకర్‌రావు స్వస్థలం జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగ గ్రామం. స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలోనే.. పీపుల్స్‌వార్‌ గ్రూప్‌(ప్రస్తుతం మావోయిస్టు పార్టీ) సిద్ధాంతాలకు ఆకర్షితుడై.. సానుభూతిపరుడిగా పనిచేసేవారు. ఆయన తల్లిదండ్రులు సిరిపెల్లి ఓదెలు, రాజపోచమ్మ. ఓదెలు 15 ఏళ్ల క్రితం మృతిచెందారు. ఎన్‌కౌంటర్‌లో శంకర్‌రావు మృతిచెందినట్లు తెలిసిన రాజపోచమ్మ కన్నీరుమున్నీరవుతున్నారు. చల్లగరిగలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ ఏడాది 79 మంది మృతి..

ఈ ఏడాది మావోయిస్టులకు ప్రతికూలంగా ఉన్నట్లు తాజా ఘటనలు చెబుతున్నాయి. మంగళవారం నాటి ఘటనతో కలిపి.. ఈ మూడున్నర నెలల్లో మహారాష్ట్ర-ఛత్తీ్‌సగఢ్‌, మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో 79 మంది మావోయిస్టులు చనిపోయారు. గడిచిన నెల వ్యవధిలోనే నక్సల్స్‌ తరఫున భారీ ప్రాణనష్టం(54 మంది) నమోదైంది. దండకారణ్యంలో మావోయిస్టులను గుర్తించేందుకు డీఆర్జీ, బీఎ్‌సఎఫ్‌, సీఆర్పీఎఫ్‌ బలగాలకు చెందిన 80 వేల మంది జవాన్లు జల్లెడపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని సంఘటనలు చోటుచేసుకునే ప్రమాదముందని ఆదివాసీలు బిక్కుబిక్కుమంటున్నారు.


భద్రత బలగాలకు అమిత్‌ షా అభినందన..

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 16: ఛత్తీ్‌సగఢ్‌లో మంగళవారం నక్సలైట్లకు వ్యతిరేకంగా విజయవంతమైన ఆపరేషన్‌ నిర్వహించినందుకు భద్రత బలగాలను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అభినందించారు. నక్సలైట్ల సమస్య నుంచి ఛత్తీ్‌సగఢ్‌ను, దేశాన్ని విముక్తి చేసేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

సుమన మృతిపై అధికారిక ప్రకటన చేయని పోలీసులు..

ఆదిలాబాద్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): ఛత్తీ్‌సగడ్‌ ఎన్‌కౌంటర్‌లో ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన మావోయిస్టు దళ సభ్యురాలు, శంకర్‌రావు భార్య దాసర్వర్‌ సుమన అలియాస్‌ రజిత మృతిచెందినట్లు తెలుస్తోంది. అయితే.. జిల్లా పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. బజార్‌హత్నూర్‌ మండలం డేడ్రా గ్రామానికి చెందిన సుమన 30 ఏళ్ల క్రితం నక్సల్స్‌ ఉద్యమం పట్ల ఆకర్షితురాలయ్యారు. అలా అజ్ఞాతంలోకి వెళ్లిన ఆమె మళ్లీ స్వస్థలానికి తిరిగి రాలేదని తెలుస్తోంది. సుమనపై రూ.5 లక్షల రివార్డు ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 17 , 2024 | 07:20 AM