Share News

National : సంపన్నులపై 2 శాతం పన్ను

ABN , Publish Date - May 25 , 2024 | 05:51 AM

భారతదేశంలో పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలను అరికట్టటానికి రూ.10కోట్లకన్నా ఎక్కువ నికర సంపద ఉన్న అతి ధనవంతులపై 2ు వార్షిక పన్ను విధించాలని ప్రఖ్యాత ఆర్థికవేత్త థామస్‌పికెటీ తదితరులు సూచించారు. రూ.10కోట్లకు మించిన వారసత్వ సంపదపై 33ు పన్ను విధించాలన్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయం భారీగా పెరుగుతుందని,

National : సంపన్నులపై 2 శాతం పన్ను

  • రూ.10 కోట్లకుపైగా నికర సంపదపై ఏటా విధించాలి

  • వారసత్వ సంపదపై 33ు వేయాలి

  • థామస్‌ పికెటీ తదితర ఆర్థికవేత్తల సిఫార్సులు

న్యూఢిల్లీ, మే 24: భారతదేశంలో పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలను అరికట్టటానికి రూ.10కోట్లకన్నా ఎక్కువ నికర సంపద ఉన్న అతి ధనవంతులపై 2ు వార్షిక పన్ను విధించాలని ప్రఖ్యాత ఆర్థికవేత్త థామస్‌పికెటీ తదితరులు సూచించారు. రూ.10కోట్లకు మించిన వారసత్వ సంపదపై 33ు పన్ను విధించాలన్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయం భారీగా పెరుగుతుందని, అది జీడీపీలో 2.73ు ఉంటుందన్నారు. దీని నుంచి పేదలు, మధ్యతరగతి, నిమ్నకులాల వారికి సంపదను పునఃపంపిణీ చేయాలని సిఫార్సు చేశారు.

పలు ప్రజాసంక్షేమ రంగాలకు బడ్జెట్‌ను పెంచటానికి దీనిద్వారా వీలవుతుందని చెప్పారు. ఉదాహరణకు.. విద్యారంగానికి బడ్జెట్‌లో కనీసం 6ునిధులు కేటాయించాలని ప్రభుత్వమే తీసుకొచ్చిన నూతన విద్యా విధానం-2000 చెబుతోందని, కానీ గత 15ఏళ్లుగా ఆ రంగానికి జీడీపీలో 2.9శాతానికి మించి కేటాయించటంలేదని గుర్తుచేశారు. దేశంలోని 99.96 శాతం జనాభాపై పన్ను ప్రభావంలేకుండా, మిగిలిన అతి ధనవంతులపైనే పన్నువేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలన్నారు. ‘భారత్‌లో విపరీతంగా పెరిగిన అసమానతలను ఎదుర్కోవటానికి సంపద పన్ను ప్రతిపాదనలు’ అనే పేరుతో రూపొందించిన పరిశోధన పత్రంలో ఈ ప్రతిపాదనలు చేశారు. పారిస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌కు చెందిన థామస్‌ పికెటీ, అన్‌మోల్‌ సోమాంచి, హార్వర్డ్‌ కెనడీ స్కూల్‌కు చెందిన ల్యూకాస్‌ చాన్సల్‌, న్యూయార్క్‌ యూనివర్సిటీకి చెందిన నితిన్‌ కుమార్‌ భారతి సంయుక్తంగా ఈ పత్రాన్ని రూపొందించారు. వీరు ‘వరల్డ్‌ ఇనీక్వాలిటీ ల్యాబ్‌’ సంస్థలోనూ పని చేస్తున్నారు.

భారత్‌లో పన్ను ప్రతిపాదనలపై ప్రజాస్వామ్యబద్ధంగా, విస్తృతస్థాయిలో చర్చలు జరగాలని, అవన్నీ సంపద పునఃపంపిణీ, అసమానతలను రూపుమాపటం లక్ష్యంగా ఉండాలని వీరు పేర్కొన్నారు. దేశంలో అసమానతలపై ఇటీవలి కాలంలో చర్చలు బాగా పెరిగాయన్నారు. తాము మార్చి 20న విడుదల చేసిన ‘భారత్‌లో ఆదాయం, సంపద అసమానతలు, 1922-2023: శత కోటీశ్వరుల రాజ్యం’ పరిశోధన పత్రం కూడా దీనికి దోహదపడిందని గుర్తు చేశారు. కాగా భారత బిలియనీర్లు దాదాపుగా అందరూ అగ్ర కులాలకు చెందిన వారేనని తాజా పరిశోధన పత్రం సహ రచయిత అన్‌మోల్‌ సోమాంచి పేర్కొన్నారు. తాము ప్రతిపాదిస్తున్న పన్నును ప్రగతి పన్నుగా అభివర్ణించారు. ‘సమానత్వ, సుసంపన్న భారత్‌ను నిర్మాణానికి ప్రగతి పన్ను విధింపు, సమర్థవంతమైన పునఃపంపిణీ, సామాజిక రంగాల్లో సమగ్రస్థాయిలో పెట్టుబడులు అత్యవసరంగా చేపట్టాల్సిన పని’ అన్నారు.

Updated Date - May 25 , 2024 | 05:51 AM