Share News

Ayutthaya: ఇది థాయ్‌లాండ్ అయోధ్య.. అప్పుడు ధ్వంసమై మళ్లీ ఇప్పుడు..

ABN , Publish Date - Jan 19 , 2024 | 08:32 PM

మన భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌లో ఎలాగైతే అయోధ్య నగరం ఉందో.. అలాగే థాయ్‌లాండ్‌లోనూ ‘అయుత్తయ’ పేరుతో ఓ అయోధ్య ఉంది. భౌగోళికంగా ఈ రెండు పట్టణాలు 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. అక్కడ కూడా రామనామం వినిపిస్తుంది. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్నారన్న విషయం తెలిసి.. అయుత్తయ నుంచి మట్టి పంపించారు.

Ayutthaya: ఇది థాయ్‌లాండ్ అయోధ్య.. అప్పుడు ధ్వంసమై మళ్లీ ఇప్పుడు..

మన భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌లో ఎలాగైతే అయోధ్య నగరం ఉందో.. అలాగే థాయ్‌లాండ్‌లోనూ ‘అయుత్తయ’ పేరుతో ఓ అయోధ్య ఉంది. భౌగోళికంగా ఈ రెండు పట్టణాలు 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. అక్కడ కూడా రామనామం వినిపిస్తుంది. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్నారన్న విషయం తెలిసి.. అయుత్తయ నుంచి మట్టి పంపించారు. అంతేకాదు.. థాయ్‌లాండ్‌లోని మూడు సరస్సులైన చావో ఫ్రయా, లోప్ బురి, పా సక్ నుంచి కూడా నీళ్లు అందాయి.

ఇప్పుడు జనవరి 22వ తేదీన రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగబోతుండటంతో.. అక్కడున్న రామభక్తులు భారీఎత్తున వేడుకలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. బ్యాంకాక్‌కు చెందిన విశ్వహిందూ పరిషత్ (VHP) సభ్యుడు తెలిపిన వివరాల ప్రకారం.. ‘ప్రాణ్ ప్రతిష్ఠ‘ వేడుక ప్రత్యక్ష ప్రసారం కోసం అయుత్తయ, థాయ్‌లాండ్‌లోని ఇతర నగరాల్లో ఉన్న హిందూ దేవాలయాల్లో భారీ స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని దేవాలయాల్లో దీపాలు కూడా వెలిగించనున్నారు.


అయుత్తయ చరిత్ర

చావో ఫ్రయా నది ఒడ్డున ఉన్న పురాతన నగరం.. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ఉంది. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య పేరు మీదుగా ఈ ప్రాంతానికి అయుత్తయ అనే పేరు పెట్టారు. మొదటి పాలకుడైన రామతిబోడి రాజు.. ఈ ప్రాంత సంస్కృతిపై రామాయణం ప్రభావాన్ని చూపిస్తూ, ఈ నగరానికి ఆ పేరు పెట్టాడు. ఆ తర్వాత వచ్చిన తదుపరి రాజులు సైతం ‘రాముడు’ అనే పేరుని స్వీకరించారు. బౌద్ధ మత ప్రచారకులచే ఆగ్నేయాసియాకు పరిచయమైన రామాయణాన్ని థాయ్ వర్షన్‌లోకి ‘రామకియన్’ పేరుతో అనువదించారు.

నిజానికి.. ఈ అయుత్తయ అధికారిక పేరు ‘ఫ్రా నఖోన్ సి అయుతయ’. ఇది 1350లో స్థాపించబడింది. దీనిని సియామీ రాజు యు థోంగ్ స్థాపించాడు. ఇది సియామీ రాజ్యానికి రెండవ రాజధానిగా ఉంది. ఇది 14-18 శతాబ్దాల మధ్య అభివృద్ధి చెందింది. ఆ సమయంలో ఇది ప్రపంచంలోని అతిపెద్ద కాస్మోపాలిటన్ పట్టణ ప్రాంతాలలో ఒకటిగా ఉంది. అంతేకాదు.. వాణిజ్య కేంద్రంగానూ అభివృద్ధి చెందింది. అయితే.. 1767లో బర్మీస్ సైన్యం ఈ నగరంపై దాడి చేసి ధ్వంసం చేసింది. అప్పటి నుంచి ఇది ఒక పురావస్తు ప్రదేశంగానే మిగిలిపోయింది.

థాయిలాండ్‌లోని భారతీయ ప్రొఫెసర్ సురేష్ పాల్ గిరి ప్రకారం.. బర్మీస్ సైనికులు ఈ నగరాన్ని ఆక్రమించినప్పుడు ఒక కొత్త రాజు దీనిని పరిపాలించాడు. తనని తాను రాముడిగా పిలుచుకున్న ఆ రాజు.. స్థానిక భాషలో రామాయణాన్ని రాశాడు. దానిని ఒక నేషనల్ ఎపిక్‌గా మలిచాడు. తాను బౌద్ధుడు అయినప్పటికీ.. తనని తాను రాముడిగా చెప్పుకొని, తన రాచరిక ప్రమాణాల్ని స్థాపించాడు. ఇప్పుడు బ్యాంకాక్‌గా పిలువబడే నగరాన్ని సైతం ఇతడే నిర్మించాడు. అతని రాజకుటుంబం కూడా రాముడిని ఆదరించారు.

ఇదిలావుండగా.. అయోధ్యలోని రామమందిరం మొదటి దశ పూర్తి కావొస్తోంది. జనవరి 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని జరగనుండగా.. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి దేశంలోని రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు, ఇతర ప్రముఖులు కలుపుకొని.. 10 వేల మంది వరకు హాజరు కాబోతున్నారు. అటు.. అయుత్తయలో ఉన్న రామభక్తులు సైతం, ఈ వేడుకల్ని అక్కడ ఘనంగా నిర్వహించేలా ప్రణాళకిలు చేపట్టారు.

Updated Date - Jan 19 , 2024 | 08:53 PM