Share News

Israel-Hamas War: హమాస్‌కు ఇజ్రాయెల్ ఫైనల్ వార్నింగ్.. డెడ్‌లైన్‌లోపు ఆ పని చేయకపోతే..

ABN , Publish Date - Feb 19 , 2024 | 07:15 PM

ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై ఐదు నెలల పైనే అవుతోంది. తొలుత హమాస్ మెరుపుదాడులతో ఈ యుద్ధానికి బీజం వేయగా.. అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. హమాస్‌ని అంతమొందించాలన్న లక్ష్యంతో.. గాజాపై వైమానిక, భూతల దాడులతో విజృంభిస్తోంది.

Israel-Hamas War: హమాస్‌కు ఇజ్రాయెల్ ఫైనల్ వార్నింగ్.. డెడ్‌లైన్‌లోపు ఆ పని చేయకపోతే..

ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై ఐదు నెలల పైనే అవుతోంది. తొలుత హమాస్ మెరుపుదాడులతో ఈ యుద్ధానికి బీజం వేయగా.. అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. హమాస్‌ని అంతమొందించాలన్న లక్ష్యంతో.. గాజాపై వైమానిక, భూతల దాడులతో విజృంభిస్తోంది. సామాన్య ప్రజలు బలి అవుతున్నా.. తమ పంతం తమదే అన్నట్టు ఇరువర్గాల వాళ్లు పరస్పర దాడులు చేసుకుంటున్నారు. ఈ తరుణంలోనే తాజాగా హమాస్‌కి ఇజ్రాయెల్ ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. రంజాన్ ప్రారంభం నాటికి గాజాలో మిగిలున్న బందీలను విడుదల చేయకపోతే.. వచ్చే నెలలో రాఫాపై దీర్ఘకాలం పాటు భీకర దాడులు చేస్తామని హెచ్చరించింది.


‘‘ప్రపంచంతో పాటు హమాస్ నాయకులు కూడా తప్పక తెలుసుకోవాలి. ఒకవేళ రంజాన్ నాటికి హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలు తమతమ ఇళ్లల్లో ఉండకపోతే.. రాఫా సహా ప్రతి చోటా భీకరమైన దాడులు చేస్తాం’’ అని రిటైర్డ్ మిలిటరీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గాంట్జ్ ఆదివారం జెరూసలేంలో నిర్వహించిన అమెరికన్ యూదు నాయకుల సమావేశంలో అన్నారు. ఒక సమన్వయ పద్ధతిలో సాధ్యమైనంతవరకూ ప్రాణనష్టం లేకుండా ఈ దాడులు నిర్వహించేలా ప్రణాళికలు రచిస్తామని చెప్పారు. కొన్ని వారాల నుంచి కొనసాగుతున్న ‘కాల్పుల విమరణ ఒప్పందం’ చర్చలు విఫలమైన నేపథ్యంలో.. గాంట్జ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమావేశంలో.. బందీల ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా హమాస్‌పై పూర్తి విజయం సాధిస్తానని తాను చేసిన ప్రతిజ్ఞను ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు పునరుద్ధరించారు.

ఇదిలావుండగా.. ప్రస్తుతం హమాస్ చెరలో 130 మంది బందీలు ఉన్నారు. ఇజ్రాయెల్ మిత్రపక్షమైన అమెరికా ఈ బందీల విడుదలకు బదులుగా ఆరు వారాల కాల్పుల విరమణ సంధి కోసం ఒత్తిడి చేస్తోంది. అయితే.. ఈ చర్చలు మాత్రం సఫలం కావడం లేదు. కొన్ని వారాల నుంచి ఈ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు.. ఈ బందీలలో చాలామంది రాఫాలో ఉండొచ్చని, అక్కడే హమాస్ నాయకులు కూడా ఉండే అవకాశం ఉందని ఇజ్రాయెల్ తెలిపింది. అందుకే.. తమ బందీల విడుదల కోసం ఈసారి రాఫాని టార్గెట్ చేయాలని ఇజ్రాయెల్ చూస్తోంది. మరి.. ఈ చర్చల ఫలితం ఎలా తేలుతుందో ఏమో వేచి చూడాల్సిందే.

Updated Date - Feb 19 , 2024 | 07:15 PM