Biggest Lottery: 28 ఏళ్ల యువకుడికి జాక్పాట్.. రూ.795 కోట్ల లాటరీ కైవసం
ABN , Publish Date - Feb 22 , 2024 | 07:48 AM
ఎవరికైనా ఆకస్మాత్తుగా రూ.700 కోట్ల మనీ జాక్పాట్ వస్తే ఎలా ఉంటుంది. ఆ అనుభవం మాములుగా ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే అలాంటివి జరిగినప్పుడు నిద్ర కూడా సరిగా పట్టదని చెప్పవచ్చు. ఇలాంటి సంఘటనే ఓ 28 ఏళ్ల యువ వ్యాపారికి జరిగింది. అతను ఏకంగా రూ.795 కోట్ల లాటరీని గెల్చుకున్నాడు.
చైనా(china)లోని ఓ 28 ఏళ్ల యువ వ్యాపారి ఆ దేశంలోనే అత్యధిక విలువైన 680 మిలియన్ యువాన్ (యుఎస్డి 96 మిలియన్) రూ.795.84 కోట్ల లాటరీ జాక్పాట్ను గెలుచుకున్నాడు. ఇది ఇప్పటివరకు దేశంలోనే అతిపెద్దది(Biggest Lottery) కావడం విశేషం. ప్రభుత్వ మద్దతు గల ఆర్గనైజర్ చైనా వెల్ఫేర్ లాటరీ వెబ్సైట్ ప్రకారం విజేత నైరుతి చైనాలోని గుయిజౌ ప్రావిన్స్కు చెందినవాడు. హాంకాంగ్కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ మంగళవారం ఈ మేరకు వెల్లడించింది.
అతను ఒక్కొక్కటి రెండు యువాన్ల (USD 28 సెంట్లు) చొప్పున 133 టిక్కెట్లను కొనుగోలు చేశాడు. ప్రతిసారీ ఏడు నంబర్లతో కూడిన ఒకే గ్రూప్పై బెట్టింగ్ చేశారని పేర్కొన్నారు. అతని ప్రతి టిక్కెట్కు 5.16 మిలియన్ యువాన్ (USD 725,000) బహుమతి లభించిందని అక్కడి మీడియా తెలిపింది. అయితే విజేత పేరు వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదు.
అయితే తాను గెలిచినట్లు తెలియగానే తనకు నిద్ర పట్టడం లేదని గెల్చిన యువకుడు(young man) ఉద్వేగానికి లోనయ్యాడు. మొదట తాను నమ్మలేదని అన్నారు. చాలాసార్లు ధృవీకరించుకోవడానికి పరిశీలించుకున్నట్లు తెలిపారు. పందెం వేయడానికి తన సొంత అదృష్ట సంఖ్యలను ఎంచుకున్నట్లు అతను చెప్పాడు. చాలా కాలంగా ఈ బొమ్మల సెట్పై పందెం వేస్తున్నట్లు వెల్లడించారు. ఆ విజేత ఫిబ్రవరి 7న ప్రైజ్ మనీని తీసుకోవడానికి వచ్చారని ప్రావిన్షియల్ వెల్ఫేర్ లాటరీ సెంటర్ అధికారి ఒకరు తెలిపారు. ఇక వ్యక్తిగత ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం అతను తన లాటరీ ఆదాయంలో ఐదవ వంతు పన్ను చెల్లించాల్సి ఉంటుందని నివేదిక తెలిపింది.