Share News

Budget2024: మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేయనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్

ABN , Publish Date - Jan 29 , 2024 | 01:38 PM

యావత్ దేశం ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర కేంద్ర బడ్జెట్-2024 కోసం ఎదురుచూస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలావుండగా వరుసగా ఆరవసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక రికార్డును సొంతం చేసుకోనున్నారు

Budget2024: మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేయనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్

ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మధ్యంతర కేంద్ర బడ్జెట్-2024 కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ ఎలా ఉండబోతోంది?, ఏమేం ప్రకటనలు ఉండబోతున్నాయి? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక రికార్డును సొంతం చేసుకోబోతున్నారు. వరుసగా అత్యధికసార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన వ్యక్తిగా మాజీ ప్రధానమంత్రి మొరార్జి దేశాయ్ సరసన ఆమె నిలవబోతున్నారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌తో వరుసగా 6 సార్లు ప్రవేశపెట్టిన వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించబోతున్నారు.

సీతారామన్ తొలి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రిగా 2019 జూలైలో బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి వరుసగా 5 సార్లు సంపూర్ణ బడ్జెట్‌లను సమర్పించారు. ఈ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న మధ్యంతర లేదా వోట్-ఆన్-అకౌంట్ బడ్జెట్‌తో వరుసగా 6వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనతను దక్కించుకోనున్నారు. ఆర్థిక మంత్రులుగా వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పీ చిదంబరం, యశ్వంత్ సిన్హాలను సీతారామన్ అధిగమించనున్నారు.


ఇక మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 1959 నుంచి 1964 మధ్యకాలంలో 5 వార్షిక బడ్జెట్‌లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను లోక్‌సభకు సమర్పించారు. 2024-25 బడ్జెట్‌తో సీతారామన్ కూడా మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిలవనున్నారు. కాగా ప్రస్తుతం ప్రవేశపెట్టనున్నది ఓటు-ఆన్-ఖాతా లేదా మధ్యంతర బడ్జెట్. ఏప్రిల్-మే నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్దిష్ట వ్యయాల కోసం ఈ బడ్జెట్‌ను రూపొందిస్తారు.

కాగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా మధ్యంతర బడ్జెట్‌లో విధానపరమైన భారీ ప్రకటనలు ఉండకపోవచ్చునని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత నెలలో జరిగిన ఓ కార్యక్రమంలో సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. ఏదైనా ‘అద్భుత ప్రకటన’ ఉంటుందా అని ప్రశ్నించగా ఆమె తోసిపుచ్చారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఓటు-ఆన్-ఖాతా అని స్పష్టం చేశారు. మధ్యంతర బడ్జెట్‌లలో సాధారణ బడ్జెట్ల మాదిరిగా విధానపరమైన ప్రకటనలు ఉండకపోయినప్పటికీ అత్యవసర ఆర్థిక సమస్యలను ప్రభుత్వం నిర్వహించే విధంగా బడ్జెట్‌ను రూపొందిస్తారు. ఇక జూన్‌లో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జులైలో 2024-25కు సంబంధించిన తుది బడ్జెట్‌ను సమర్పించనుంది.

కాగా ఇందిరా గాంధీ తర్వాత కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రెండవ వ్యక్తిగా నిర్మలా సీతారామన్ నిలిచారు. కొవిడ్-19 మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థకు ఎదురైన సవాళ్లను పరిష్కరించడమే లక్ష్యంగా విధాన చర్యలను సీతారామన్ ప్రవేశపెట్టారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కూడా సీతారామన్ హయాంలోనే భారత ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. ఇండియా 2027-28 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందనే అంచనాలున్న విషయం తెలిసిందే.

మరిన్ని బడ్జెట్ 2024 వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 29 , 2024 | 02:09 PM