Share News

Budget 2024: భారీ అంచనాలతో మధ్యంతర బడ్జెట్.. సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన నిర్మలా సీతారామన్..

ABN , Publish Date - Feb 01 , 2024 | 10:37 AM

Union Budget 2024: ఇవాళ పార్లమెంట్‌లో మధ్యంత బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ బడ్జెట్‌లో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ బడ్జెట్‌లో ఎలాంటి తాయిలాలు ప్రకటిస్తారా? అని ఆశగా చూస్తున్నారు. పారిశ్రామిక వేత్తలు మొదలుకొని.. సామాన్య ప్రజలందరి వరకు బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నారు.

Budget 2024: భారీ అంచనాలతో మధ్యంతర బడ్జెట్.. సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన నిర్మలా సీతారామన్..
Interim Budget 2024

Union Budget 2024: ఇవాళ పార్లమెంట్‌లో మధ్యంత బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ బడ్జెట్‌లో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ బడ్జెట్‌లో ఎలాంటి తాయిలాలు ప్రకటిస్తారా? అని ఆశగా చూస్తున్నారు. పారిశ్రామిక వేత్తలు మొదలుకొని.. సామాన్య ప్రజలందరి వరకు బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆదాయపు పన్ను స్లాబ్‌లలో మార్పులు, పన్నుల్లో రాయితీలు, ధరల తగ్గింపు వంటి అంశాలు ఉంటాయని ఆశిస్తున్నారు. అయితే, ఈ మధ్యంతర బడ్జెట్‌లో ఎలాంటి కీలక ప్రకటనలు ఉండబోవని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కానీ, ఎన్నికల సంవత్సరం కావడంతో.. కచ్చితంగా ప్రజాకర్షక అంశాలను బడ్జెట్‌లో ప్రకటిస్తారని అంచనా వేస్తున్నారు ఆర్థిక, రాజకీయ నిపుణులు.

కాగా, మధ్యంతర బడ్జెట్‌‌తో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయనున్నారు. ఈ బడ్జెట్‌‌కు సంబంధించి టాప్ 10 పాయింట్స్ వివరాలు ఓసారి చూద్దాం..

1. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేస్తూ ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరో బడ్జెట్‌ను సమర్పించనున్నారు. దేశాయ్ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో 1959 నుంచి 1964 మధ్య ఐదు వార్షిక బడ్జెట్‌లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు.

2. ఆర్థిక మంత్రి 2020లో అత్యంత సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం రికార్డ్ క్రియేట్ చేశారు. 2 గంటల 42 నిమిషాలు ప్రసంగించి రికార్డ్ నెలకొల్పారు.

3. ఏప్రిల్‌లో గానీ, మే నెలలో గానీ లోక్‌సభ ఎన్నికలు జరగనున్నందున ఆర్థిక మంత్రి సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ఆ తరువాత పూర్తిస్థాయి బడ్జెట్‌ను సమర్పించనుంది.

4. బుధవారం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ.. మూడోసారి కూడా తమ ప్రభుత్వమే వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల తరువాత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమే మళ్లీ పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందన్నారు.

5. ఎన్నికల సంవత్సరం కావడంతో వివిధ వర్గాల ప్రజలను సంతోష పెట్టడం, ద్రవ్య లోటును అదుపులో ఉంచే సవాళ్ల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ సర్కార్ సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

6. మధ్యంతర బడ్జెట్‌ కావడంతో ఇందులో పెద్ద విధాన పరమైన మార్పులు, పెద్ద పెద్ద ప్రకటనలు చేయకపోవచ్చనే టాక్ కూడా నడుస్తోంది. అయినప్పటికీ.. ఎన్నికల సంవత్సరం కావడంతో అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.

7. ఆదాయపు పన్ను స్లాబ్‌లలో మార్పు, పన్ను పరిమితి, సెక్షన్ 80సి, 80డి కింద పన్ను మినహాయింపులు, వేతన జీవులకు పన్ను మినహాయింపుల వంటి ప్రకటనల కోసం సామాన్యులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

8. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSME) కోసం నియంత్రణ విధానాలను సులభతరం చేయడానికి, సమ్మతి భారాలను తగ్గించడానికి, రుణాలకు ఎక్కువ ప్రాప్యతను అందించడానికి ప్రభుత్వం కొత్త విధానాలను తీసుకువస్తుందని అంచనా వేస్తున్నారు.

9. బుధవారం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ 140 కోట్ల మంది దేశప్రజల కలలను నెరవేర్చే హామీతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని పేర్కొన్నారు. దీంతో బడ్జెట్‌‌పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

10. రాష్ట్రపతి ప్రసంగంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం రాష్ట్రపతికి ఎన్నికల ప్రసంగం రాసిచ్చిందని, ఆదాయ అసమానత, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యలను పరిష్కరించలేదని ధ్వజమెత్తారు.

Updated Date - Feb 01 , 2024 | 11:19 AM