Andhra Pradesh: ఈ దొంగోడి స్టైలే వేరు.. బట్టలన్నీ తీసేసి మరీ..
ABN , Publish Date - Dec 27 , 2024 | 03:05 PM
దొంగలందరి టార్గెట్.. దోపిడీనే. ఇళ్లలో చోరీ చేసినా.. పబ్లిక్ ట్రాన్స్పోర్టుల్లో చోరీలకు పాల్పడినా.. పెద్ద పెద్ద బ్యాంకులు కొల్లగొట్టినా.. టార్గెట్ మాత్రం డబ్బు, బంగారం, విలువైన వస్తువులే. దొంగలందరూ దొంగతనం చేస్తారు. కానీ, ఆ దొంగల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఒక్కోడు ఒక్కోరకంగా దోపిడీలకు పాల్పడుతుంటాడు. తాజాగా విజయవాడలో పట్టుబడిన దొంగ చోరీ చేసే విధానం తెలిస్తే అవాక్కవుతారు..

విజయవాడ, డిసెంబరు 27: నగ్నంగా ఇళ్లల్లో చొరబడి చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగను విజయవాడ సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఈ వివరాలను పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, క్రైమ్స్ డీసీపీ టి.తిరుమలేశ్వర్ రెడ్డి, ఏడీసీపీ ఎం.రాజారావుతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్లో గురువారం మీడియాకు వెల్లడించారు.
చిన్నతనం నుంచి దొంగతనాలు..
గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన కంచర్ల మోహనరావు ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో చిన్నతనంలోనే దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం కాకినాడ జిల్లా తుని మండలం మరువాడ గ్రామంలో భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు. గంజాయి, మద్యం తాగడానికి బానిసగా మారాడు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు గ్రామంలో అక్టోబరు 10వ తేదీన ఎంఎస్ అపార్ట్మెంట్లో ఉన్న కుటుంబం రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోయింది. ఉదయం నిద్ర లేచి చూసే సరికి కిటికీ నుంచి ప్రధాన ద్వారం తలుపు గడియను తీసి లోపలకు ప్రవేశించాడు. కప్బోర్డులో ఉన్న బంగారు ఆభరణాలు దొంగిలించాడు. దీంతో పాటు ఈ అపార్టుమెంట్కు వెనుక వైపు ఉన్న ఇంట్లో తాళాలు పగులగొట్టి చోరీ చేశాడు. దీనిపై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తును సీసీఎస్ ఇన్స్పెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ చేపట్టారు. చోరీలు జరిగిన ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా అందులో మోహనరావు ముఖం కనిపించింది. మోహనరావు వద్ద నుంచి రూ.28 లక్షల విలువ చేసే 343 గ్రాముల బంగారం ఆభరణాలు, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు.
నెల్లూరు నుంచి ఎస్. కోట వరకు..
మోహనరావు నెల్లూరులో ఉన్నట్టు పోలీసులకు ఉప్పందింది. దీంతో సీసీఎస్లోని ఒక బృందం అక్కడికి వెళ్లగా పరారయ్యాడు. తర్వాత కొన్ని రోజులకు అతను విజయవాడలో ఉన్నట్టు సమాచారం తెలిసింది. ఈ సమాచారం అందిన కొద్దిసేపటికి హనుమాన్ జంక్షన్లో ఉన్నట్టు మరో సమాచారం లభించింది. దీనితో నిందితుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నాడని అనుమానించి పీఎన్బీఎస్కు వెళ్లారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తే ఎస్.కోట వెళ్లే బస్సు ఎక్కినట్లు తెలిసింది. వెంటనే ఎస్.కోట డిపో మేనేజర్తో ఫోన్లో టచ్లోకి వెళ్లారు. పీఎన్బీఎస్ నుంచి ఎస్.కోటకు బయలుదేరిన బస్సుల డ్రైవర్ల నంబర్లను తీసుకున్నారు. మోహనరావు ఫొటోను వాట్సాప్లో పంపగా ఒక బస్సు డ్రైవర్ తన బస్సులో ఉన్నట్టు సమాచారం ఇచ్చాడు. విజయవాడ నుంచి ప్రత్యేక వాహనంలో లక్ష్మీనారాయణ టీం బయలుదేరి వెళ్లి రాజమండ్రిలోని దివాన్ చెరువు వద్ద కాపుగాచారు. ఎస్.కోట వెళ్తున్న బస్సును అపి.. అందులో ఉన్న నిందితుడిని పట్టుకుని విజయవాడకు తీసుకొచ్చారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. మొత్తం నేరాల చిట్టాను విప్పాడు కేటుగాడు. అయితే, నిందితుడు ఒకసారి చోరి చేసిన తర్వాత రెండేళ్ల వరకు చిక్కడని పోలీసులకు ఒక నమ్మకం. విజయవాడ పోలీసులకు చిక్కడానికి రెండు నెలల ముందు హైదరాబాద్లోని చర్లపల్లి జైలు నుంచి మోహనరావు విడుదలయ్యాడు.
వంటిపై దుస్తుల్లేకుండా చోరీలు..
మోహనరావును విచారించే క్రమంలో పోలీసులకు అనేక కొత్త విషయాలు తెలిశాయి. ముందుగా నేరం చేయాలనుకున్న ప్రదేశంలో రెండు, మూడు రెక్కీలు నిర్వహిస్తాడు. చోరీ చేయాలనుకున్న ఇంటికి పక్కనే ఖాళీ స్థలం ఉంటేనే దాన్ని ఎంచుకుంటాడు. దొంగతనం చేయడానికి బయలుదేరినప్పుడు ఆ ఇంటికి సమీపంలో పాడుబడిన భవనంలోకి గానీ, తుప్పల్లోకి గానీ వెళ్తాడు. అక్కడ మొత్తం దుస్తులను తీసేస్తాడు. ఆ తర్వాత గోడ దూకి ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అనుకున్న పని సజావుగా జరిగిన తర్వాత మళ్లీ దుస్తులు ధరించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొంత దూరం వచ్చిన తర్వాత ఉపయోగించిన ఫోన్, సిమ్ కార్డులను పడేస్తాడు. రూ.1000 విలువ చేసే ఫోన్లు మాత్రమే ఉపయోగిస్తాడు. ఇలా కాజేసిన సొత్తును రెండు, మూడు చోట్ల విక్రయించేస్తాడు. ఈ సొమ్మును తీసుకుని తునికి వెళ్తాడు. నేరుగా ఇంటికి వెళ్లకుండా తన బావమరిదికి కబురుపెడతాడు. భార్య, పిల్లలను లాడ్జికి రప్పించుకుంటాడు. డబ్బును ఆమెకు ఇస్తాడు. తునికి సమీపంలో రూ.50 లక్షలతో భారీ భవనాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. కందర్ల మోహనరావుపై రాష్ట్రంతో పాటు తెలంగాణలోనూ అనేక కేసులు ఉన్నాయి. విశాఖపట్నం, కాకినాడ, పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజమండ్రి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, హైదరాబాద్లో సుమారుగా 40 కేసులు ఉన్నాయి.
నన్ను ఎలా పట్టుకున్నారో చెప్పండి ప్లీజ్..
ఏదైనా నేరంలో చిక్కినప్పుడు నిందితులను పోలీసులు ప్రశ్నిస్తారు. కానీ, ఇక్కడ సీన్ రివర్స్గా ఉంది. సీసీఎస్ పోలీసులను మాత్రం నిందితుడు మోహనరావు ప్రశ్నించాడు. తనను ఎలా పట్టుకున్నారో చెప్పాలని పలుమార్లు అడిగాడు. మోహనరావు చోరీ చేసిన తర్వాత పోలీసులకు చిక్కడానికి రెండేళ్లకు పైగా సమయం పడుతుంది. కానీ, చర్లపల్లి జైలు నుంచి బయటకు రాగానే సీసీఎస్ పోలీసులకు చిక్కడంతో ఈ ప్రశ్న వేసినట్టు తెలిసింది.