Share News

TDP Sankharavam: జగన్ పని అయిపోయిందని వాళ్లే చెబుతున్నారు..: నారా లోకేష్

ABN , Publish Date - Feb 12 , 2024 | 03:05 PM

25కు 25 మంది ఎంపీలను గెలిపిస్తే హోదా తీసుకువస్తామన్నారని, వైసీపీకి 31 మంది ఎంపీలను ఇస్తే ఏంచేశారని నారా లోకేష్ ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసం కేంద్రం ముందు మెడ వంచారని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డికి వైసీపీ ఎంపీలే ముఖం చాటేస్తున్నారని, జగన్ డిల్లీ వెళ్లితే 31మందిలో ఆరుగురు మాత్రమే ఆయన వెంట వెళ్లారని.. వారు బైబై జగన్ అని చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు.

TDP Sankharavam: జగన్ పని అయిపోయిందని వాళ్లే చెబుతున్నారు..: నారా లోకేష్

శ్రీకాకుళం జిల్లా: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంఖారావం సభ సోమవారం ఉదయం నరసన్నపేటలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీంతో నరసన్నపేట పసుపుమయంగా మారింది. యువనేతను కలిసేందుకు పెద్దఎత్తున సభ ప్రాంగణానికి మహిళలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ‘ఎత్తిన జెండా దించకుండా కాపుకాస్తున్న పసుపు సైన్యానికి నా నమస్కారాలు’.. అంటూ ప్రసంగం ప్రారంభించారు. ఉత్తరాంధ్ర అంటే విప్లవ్లం... శ్రీకాకుళం అంటే సింహం... మీరంతా సింహాల్లా కన్పిస్తున్నారు. రెండు నెలల్లో తాడేపల్లి గేట్లు పగలగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అర్థమవుతోందన్నారు. గరిమెళ్ల సత్యనారాయణ, సర్దార్ గౌతు లచ్చన్న, ఎర్రంనాయుడు పుట్టిన గడ్డ ఇదని, అరసవిల్లి సూర్యదేవాలయం ఉన్న భూమి శ్రీకాకుళం అని ఇక్కడ మాట్లాడటం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. సీఎం జగన్ రెడ్డి పని అయిపోయిందని వైసీపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారన్నారు.

25కు 25 మంది ఎంపీలను గెలిపిస్తే హోదా తీసుకువస్తామన్నారని, వైసీపీకి 31 మంది ఎంపీలను ఇస్తే ఏంచేశారని నారా లోకేష్ ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసం కేంద్రం ముందు మెడ వంచారని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డికి వైసీపీ ఎంపీలే ముఖం చాటేస్తున్నారని, జగన్ డిల్లీ వెళ్లితే 31మందిలో ఆరుగురు మాత్రమే ఆయన వెంట వెళ్లారని.. వారు బైబై జగన్ అని చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దుచేస్తానని చెప్పి, ఉద్యోగులను మాయచేసి జీపీఎస్ తెచ్చారని విమర్శించారు. ఉద్యోగులు కూడా బైబై జగన్ అంటున్నారన్నారు. ఇప్పుడు ఒక కొత్త పథకం తెచ్చారని, ఆ పథకం పేరు ఎమ్మెల్యేల ట్రాన్స్ ఫర్ అని, ఒకరి ఇంట్లో చెత్త ఇంకోచోట బంగారం అవుతుందా? ఇక్కడ పనికిరానివారు పక్క నియోజకవర్గంలో ఎలా పనికొస్తారు.. ఆరోజే జగన్ ఓటమి ఒప్పుకున్నారన్నారు.

బాబాయ్ వైఎస్ వివేకను చంపింది ఎవరు?.. పిన్ని తాళిబొట్లు తెంపింది ఎవరు?.. ఇది జగనాసుర రక్తచరిత్ర అని లోకేష్ అన్నారు. జగన్ సొంత తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి వివేకాను చంపారని, రేపో మాపో జగన్ రెడ్డి కూడా జైలుకు వెళతారని జోష్యం చెప్పారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు చంపారని చెప్పారు, చార్జిషీటులో వారి ఎంపీ అవినాష్ రెడ్డి పేరు ఉంది, రేపో మాపో జగన్ పేరు కూడా ఆ లిస్టులో చేరుతుందన్నారు. జగన్ తాగేది ప్రజల రక్తం. క్వార్టర్‌పై రూ.25 జే-ట్యాక్స్ కట్టించుకుంటున్నారు. ఇది నేరుగా జగన్ జేబులోకి వెళుతోందన్నారు. మద్యం ద్వారా ఏడాదికి రూ. 9 వేలకోట్లు చొప్పున అయిదేళ్లలో రూ. 45 వేల కోట్లు మింగేశారని ఆరోపించారు. మద్యం తయారు చేసేది, అమ్మేది జగన్ రెడ్డేనని, ఆయనను చూస్తే కటింగ్, ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తారన్నారు. ఆయన బ్లూ బటన్ నొక్కి రూ.10 ఎకౌంట్లలో వేస్తే .. రెడ్ బటన్ నొక్కి వంద లాగేస్తున్నారని, కరెంట్ ఛార్జీలు, చెత్త పన్ను, ఆర్టీసీ ఛార్జీలు పెంచి జనం జేబులు గుల్ల చేస్తున్నారని మండిపడ్డారు. అవకాశమిస్తే గాలిపైన కూడా పన్ను వేసే వ్యక్తి జగన్ రెడ్డి అని, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలను పీడిస్తున్నారని దుయ్యబట్టారు.

అన్న క్యాంటీన్లు, డ్రిప్ ఇరిగేషన్, చంద్రన్న బీమా వంటి 100 సంక్షేమ కార్యక్రమాలను జగన్ రెడ్డి రద్దు చేశారని, ఏపీకి సంక్షేమాన్ని పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అని, ఆనాడు కిలో రూ.2కే బియ్యం ఇచ్చారని, మహిళలకు ఆస్తి హక్కు కల్పించారని లోకేష్ కొనియాడారు. చంద్రబాబు దీపం కనెక్షన్లు ఇచ్చారని, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారని, కార్యకర్తలంతా గతంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వారికంటే మెరుగైన సంక్షేమం అందిస్తామని చెప్పాలని సూచించారు. తాను 3,132 కి.మీ. పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నానని, ఎటువంటి అనుమానం లేదని... వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమేనని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉద్యోగాలు వచ్చేవరకు నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని.. ప్రతి ఇంటికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణసౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పాఠశాలలకు వెళ్లే పిల్లలకు ఏడాదికి రూ.15వేలు ఇస్తామన్నారు.

ఉత్తరాంధ్రకు పట్టిన శని జగన్మోహన్ రెడ్డి. మూడు రాజధానుల పేరుతో విశాఖను నాశనం చేశారని, రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నారని నారా లోకేష్ విమర్శించారు. రైల్వే జోన్‌కు కావాల్సిన భూమి మాత్రం కేటాయించలేదని మండిపడ్డారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అయిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయనీయమని, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రను విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారని, వారు పందికొక్కుల్లా దోచుకుతింటున్నారని అన్నారు. రామతీర్థంలో శ్రీరాముడి తల తీసేస్తే ఇంతవరకు బాధ్యులపై చర్యలు లేవన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తామని చెప్పి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేదని ఆరోపించారు. వంశధార, తోటపల్లి, నాగావళి ప్రాజెక్టుల పెండింగ్ పనులు ఎక్కడవి అక్కడే ఉన్నాయన్నారు. మూతబడిన చక్కెర కర్మాగారాలను తెరిపిస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తడం లేదన్నారు.

నరసన్నపేట నియోజకవర్గానికి రూ.1200 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశామని, ఉద్దానం కిడ్నీ పేషంట్లకు డయాలసిస్ ఏర్పాటు చేసింది తెలుగుదేశమని, అన్ని గ్రామాల్లో తాగునీరు అందించేందుకు కృషి చేశామని, మేం పనులు ప్రారంభిస్తే వాటిని నిలిపివేసిన దద్దమ్మ ప్రభుత్వం జగన్ రెడ్డిదని లోకేష్ విమర్శించారు. మన హయాంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేశామని, 2019లో ఒక్క అవకాశం పేరుతో వచ్చి నాశనం చేశారన్నారు. ధర్మాన కృష్ణదాస్‌ను భారీ మెజార్టీతో గెలిపించారు. నియోజకవర్గానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేశారా? అని ప్రశ్నించారు. ఆయన పేరులో ధర్మాన ఉందిగానీ.. ఆయన చేసే పనులన్నీ అధర్మమేనన్నారు. అంగన్ వాడీ పోస్టులు, షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా అడ్డగోలుగా అమ్ముకుంటున్నారని, సొంత పార్టీ కార్యకర్తలపైనే తిరిగి కేసులు పెడుతున్నారన్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు కబ్జా చేయాలనే ఆలోచన తప్ప ఏనాడూ నియోజకవర్గం గురించి ఆలోచించలేదన్నారు. పట్టణంలో ఎర్రన్నాయుడు పేరుతో పార్క్ నిర్మిస్తే అధర్మ కృష్ణదాస్ జేసీబీ తీసుకెళ్లి ధ్వంసం చేశారన్నారు. టీడీపీ కార్యకర్తకు చెందిన వెంకటేశ్వరరావు షాపింగ్ కాంప్లెక్స్‌ను ఏకపక్షంగా తొలగించారని మండిపడ్డారు. గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసినా.. ఆ స్థాయిలో నియోజకవర్గ అభివృద్ధి జరగలేదుని విమర్శించారు. ఒక్క రోడ్డు వేయలేదని.. ఒక్క ఇల్లు కూడా కట్టలేదని.. ఒక్క ప్రాజెక్టు పూర్తిచేయని అసమర్థుడు ఈ అధర్మాన కృష్ణదాస్ అని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి బొంతు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులన్నీ పూరిచేస్తామని వంశధార ప్రాజెక్టు పనులు కూడా పూర్తిచేస్తామని, పెండింగ్‌లో ఉన్న ధారా వంతెన బ్రిడ్జి పనులు కూడా పూర్తిచేస్తామని లోకేష్ స్పష్టం చేశారు.

కామేశ్వరపేట వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కావాలని పెద్దలు కోరారని, ఖచ్చితంగా పూర్తిచేసే బాధ్యత తీసుకుంటామని లోకేష్ అన్నారు. శ్రీముఖలింగ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా తాను తీసుకుంటానన్నారు. టీడీపీకి కార్యకర్తలే బలమని, ఎంతోమంది పార్టీ మారినా కార్యకర్తలకు అండగా నిలిచారన్నారు. కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశామని, ప్రమాదంలో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు రూ.100 కోట్లు ఇచ్చి అండగా నిలచామన్నారు. చంద్రబాబుని తప్పుడు కేసుల్లో ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారన్నారు. చంద్రబాబు ఏనాడూ అవినీతి చేయలేదని, నిప్పులా బతికారన్నారు. అవినీతి ఆరోపణలపై జగన్ రెడ్డికి సవాల్ విసురుతున్నా... బహిరంగచర్చకు సిద్ధమా? అంటూ సవాల్ చేశారు.

చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేస్తే పవన్ కల్యాణ్ మనకు అండగా నిలబడ్డారని, ఆనాడే సైకోను తరిమికొట్టాలని పవనన్న పిలుపునిచ్చారని లోకేష్ అన్నారు. హలో ఏపీ-బైబై వైసీపీ అని పవనన్న పిలుపునిచ్చారని.. ఎటువంటి అపోహలకు తావులేకుండా ఇరుపార్టీల కార్యకర్తలు ఉమ్మడి అభ్యర్థుల విజయానికి కృషిచేయాలని పిలుపిచ్చారు. పార్టీ కార్యకర్తల బాధ్యత తాను తీసుకుంటానని... ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని స్పష్టం చేశారు. రెండు నెలలు ఆగితే.. నిలిచిపోయిన సంక్షేమ కార్యక్రమాలన్నీ మత్స్యకారులకు అందజేస్తామన్నారు. మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్, కోల్డ్ స్టోరేజ్‌లు కడతామని మత్య్సకారులకు హామీ ఇస్తున్నామని నారా లోకేష్ స్పష్టం చేశారు.

Updated Date - Feb 12 , 2024 | 03:05 PM