Janasena: పార్టీ నిధికి రూ.10 కోట్లు విరాళమిచ్చిన జనసేనాని
ABN , Publish Date - Mar 26 , 2024 | 09:33 PM
జనసేన బలోపేతం కోసం తన స్వార్జితం నుంచి రూ.10 కోట్లను ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) విరాళంగా ఇచ్చారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జనసేన నేత నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారికి పవన్ కళ్యాణ్ చెక్కులు అందజేశారు.
అమరావతి: జనసేన బలోపేతం కోసం తన స్వార్జితం నుంచి రూ.10 కోట్లను ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) విరాళంగా ఇచ్చారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జనసేన నేత నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారికి పవన్ కళ్యాణ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... పార్టీ నిర్వహణకు మొదటి నుంచీ తన కష్టార్జితంలో కొంత మొత్తం ఇస్తున్నానని తెలిపారు.సామాజిక సేవలకు, అధ్యాత్మిక కార్యక్రమాలకు, కోట్లలో విరాళాలు అందజేశానని చెప్పారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల కోసం రూ. ఐదు కోట్లు కేటాయించినట్లు తెలిపారు. స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడపించడానికి మోతీలాల్ నెహ్రూ వంటి గొప్ప నాయకులు తమ స్వార్జితాన్ని ఉద్యమానికి విరాళంగా ఇచ్చేవారని చెప్పారు. ఆ రోజుల్లో తమ సొంత డబ్బును వెచ్చించిన తీరు గొప్పదని అన్నారు.
ఓ సదాశయం కోసం, రాష్ట్ర భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. జనసేన సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి తన వంతుగా కృషిచేస్తున్నానని అన్నారు. ఇప్పుడు ఎన్నికల ప్రచార ఖర్చుల నిమిత్తం రూ.10 కోట్లను అందజేస్తున్నానని తెలిపారు. ఇది పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఓ బెల్దారీ మేస్త్రి రూ.లక్ష విరాళం అందించారని తెలిపారు. అలాగే పింఛను నుంచి వచ్చే సొమ్ములో కొంత భాగం పార్టీకి తమ వంతుగా పంపుతున్న సగటు మనుషులెందరో ఉన్నారని చెప్పారు. వారంతా ఎన్నో ఆశలతో, ఆశయాలతో నిర్మించిన పార్టీ కోసం తమ వంతు సాయం అందిస్తున్నారని తెలిపారు. అలాంటి వారి స్ఫూర్తితోనేను సినిమాల ద్వారా వచ్చిన తన కష్టార్జితాన్ని, ప్రభుత్వానికి పన్నులు కట్టిన తర్వాత తన దగ్గర ఉన్న డబ్బును పార్టీ కోసం అందించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఎన్నికల వేళ ఈ డబ్బు పార్టీకి ఎంతగానో ఉపయోగప డుతుందని భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.