TDP: అందుకే సభను బహిష్కరించాం..: టీడీపీ
ABN , Publish Date - Feb 05 , 2024 | 12:58 PM
అసెంబ్లీలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం తప్పుల తడకగా ఉందని అందుకే సభను బాహీష్కరించి బయటకు వచ్చామని, గోబెల్స్ ప్రచారంతో 36 పేజీల ప్రసంగాన్ని మసిపూసి మారేడుకాయ చేశారని తెలుగుదేశం శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. పసుపు కండువాలు వేసుకుని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వచ్చారు. గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అబద్దాలు వినలేకపోతున్నామంటూ టీడీపీ సభ్యులు సమావేశాల నుంచి బయటకు వచ్చేశారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం మొదలైనప్పటి నుంచి పలు అంశాలపై టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలుపుతూనే ఉన్నారు. ముందుగా జగనన్న విద్యా దీవెన క్రింద పూర్తి రీయింబర్స్మెంట్ ఇచ్చామని గవర్నర్ చెప్పగా.. పూర్తి రీయింబర్స్మెంట్ అంతా అబద్దమంటూ తెలుగుదేశం సభ్యులు నిరసన తెలిపారు.
బయటకు వచ్చిన అనంతరం టీడీపీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ముందుగా తెలుగుదేశం శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉందని అందుకే సభను బాహీష్కరించి బయటకు వచ్చామన్నారు. గోబెల్స్ ప్రచారంతో 36 పేజీల ప్రసంగాన్ని మసిపూసి మారేడుకాయ చేశారని.. ప్రభుత్వ అబద్దాలు చదవటానికి గవర్నర్ కూడా చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. ఐదేళ్ల ప్రభుత్వ వైఫల్యాలకు గవర్నర్ ప్రసంగం అద్దం పడుతోందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
తెలుగుదేశం శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. జగన్ పాదయాత్రలో చెప్పిన అబద్దాలు లాంటివే అసెంబ్లీలో గవర్నర్ చేతా పలికించారన్నారు. అబద్దాలను కూడా నిస్సిగ్గుగా చెప్పటం జగన్మోహన్ రెడ్డికే చెల్లిందన్నారు. ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజల్ని మోసగించటానికి గవర్నర్ను కూడా వాడుకోవడం దుర్మార్గమన్నారు. నచ్చిన సమయానికి అసెంబ్లీ నడుపాతం అన్నట్లు 15 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభించారన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఏసీని కూడా బాహీష్కరించామని రామానాయుడు తెలిపారు.
ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా స్వామ్యాన్ని నవ్వులపాలు చేసేలా గవర్నర్ ప్రసంగాన్ని ముఖ్యమంత్రి తయారు చేయించారని విమర్శించారు. నాడు - నేడు పులివెందులలో అమలైనట్లు ముఖ్యమంత్రి చూపించగలరా? అని సవాల్ చేస్తున్నానన్నారు. కరవు మండలాల ప్రకటన అవమానంగా భావించి సొంత ప్రాంతానికి ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ఎమ్మెల్సీ బీటీ నాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ వ్యవస్థను కూడా దుర్వినియోగం చేశారన్నారు. గవర్నర్తో ముఖ్యమంత్రి భయంకరమైన అబద్ధాలు చెప్పించారని ఆయన మండిపడ్డారు.