Share News

TDP: గుడివాడ ‘రా కదలి రా’ బహిరంగ సభకు పోలీసుల ఆంక్షలు

ABN , Publish Date - Jan 18 , 2024 | 10:37 AM

కృష్ణాజిల్లా: గుడివాడలో తెలుగుదేశం నిర్వహించనున్న ‘రా కదలి రా’ బహిరంగ సభకు పోలీసులు ఆంక్షలు విధించారు. పట్టణంలోకి తెలుగుదేశం శ్రేణుల ర్యాలీలు రాకుండా పోలీసులు అడ్డగిస్తున్నారు. టీడీపీ శ్రేణుల వాహనాలను బైపాస్ రహదారుల మీదుగా దారి మళ్లిస్తున్నారు.

TDP: గుడివాడ ‘రా కదలి రా’ బహిరంగ సభకు పోలీసుల ఆంక్షలు

కృష్ణాజిల్లా: గుడివాడలో తెలుగుదేశం నిర్వహించనున్న ‘రా కదలి రా’ బహిరంగ సభకు పోలీసులు ఆంక్షలు విధించారు. పట్టణంలోకి తెలుగుదేశం శ్రేణుల ర్యాలీలు రాకుండా పోలీసులు అడ్డగిస్తున్నారు. టీడీపీ శ్రేణుల వాహనాలను బైపాస్ రహదారుల మీదుగా దారి మళ్లిస్తున్నారు. ఈ క్రమంలో గుడివాడ పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. నెహ్రూ చౌక్ సెంటర్, ఎన్టీఆర్ స్టేడియం పరిసరాల్లో తెలుగుదేశం జెండాలు, బ్యానర్లు కట్టనివ్వకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. పట్టణం ముఖ్య కూడళ్లలో భారీగా పోలీసులు మోహరించారు. దీంతో పోలీసులు తీరును టీడీపీ శ్రేణులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

‘రా కదలిరా’ పేరుతో గురువారం గుడివాడలో తెలుగుదేశం భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. మల్లాయిపాలెం వద్ద 20 ఎకరాల విస్తీర్ణంలో సభకు ఏర్పాట్లు చేయగా.. దాదాపు లక్ష మంది వస్తారని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అలాగే ఈరోజు నందమూరి తారక రామారావు వర్ధంతి కావడంతో ఆయన స్వగ్రామం నిమ్మకూరులో చంద్రబాబు నివాళులర్పించి.. ఆ తర్వాత గుడివాడ సభలో పాల్గొంటారు. అటు ఎమ్మెల్యే కొడాలి నాని కూడా గుడివాడలో ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు నిర్వహించనున్నారు.

ఈ నేపథ్యంలో గుడివాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టణంలో పోటా పోటీగా టీడీపీ, వైసీపీ నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ వర్ధంతిలో భాగంగా ఎన్టీఆర్ 2 ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో కొడాలి నాని ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. గుడివాడ పట్టణ వ్యాప్తంగా కొడాలి నాని.. వెనిగళ్ల రామ్మోహన్‌ ఫ్లెక్సీలు వెలసాయి. కవ్వింపు చర్యలకు పాల్పడితే తగిన రీతిలో బుద్ధి చెబుతామని వెనిగళ్ల రామ్మోహన్‌ హెచ్చరించారు.

Updated Date - Jan 18 , 2024 | 10:45 AM