Share News

కొంగుచాపి అడుగుతున్నాం న్యాయం చేయండి

ABN , Publish Date - Apr 13 , 2024 | 05:41 AM

‘‘కొంగు చాపి అడుగుతున్నాం, మీ ఆడబిడ్డలం అడుగుతున్నాం.. మాకు న్యాయం చేయండి...

కొంగుచాపి అడుగుతున్నాం న్యాయం చేయండి

ఓవైపు వైఎస్‌ బిడ్డ.. ఇంకోవైపు వివేకాను చంపిన అవినాశ్‌

ఓవైపు న్యాయం, ధర్మం.. ఇంకోవైపు అధికారం, డబ్బు

ఎంపీగా ఎవరు కావాలో.. ఎవరివైపు ఉంటారో చెప్పండి

పులివెందుల వేదికగా షర్మిల, సునీత తీవ్ర భావోద్వేగం

వీధిలైట్లు ఆర్పి లింగాలలో వైసీపీ మూకల అల్లరి

దీటుగా ఎదుర్కొన్న షర్మిల, సునీత.. ప్రజల బ్రహ్మరథం

కడప, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): ‘‘కొంగు చాపి అడుగుతున్నాం, మీ ఆడబిడ్డలం అడుగుతున్నాం.. మాకు న్యాయం చేయండి. ఓ వైపు రాజశేఖర్‌రెడ్డి బిడ్డ నిలబడింది. రాజశేఖర్‌రెడ్డి తమ్ముడు వివేకాను హత్య చేయించిన అవినాశ్‌రెడ్డి ఇంకో వైపు నిలబడ్డాడు. మీకు ఎంపీగా రాజశేఖర్‌రెడ్డి బిడ్డ కావాలా... అవినాశ్‌ రెడ్డి కావాలా? తేల్చుకోండి’’ అని పీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ షర్మిల.... పులివెందుల నియోజకవర్గ ప్రజలను కోరారు. ఓ వైపు న్యాయం ధర్మం... ఇంకో వైపు అధికారం డబ్బు ఉన్నాయన్నారు. కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిల న్యాయ్‌యాత్ర పేరిట ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులోభాగంగా శుక్రవారం సొంత గడ్డ పులివెందుల నియోజకవర్గం పరిధిలోని వేంపల్లె, వేముల, లింగాల, సింహాద్రిపురం, పులివెందులలో ఆమె బస్సు యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పులివెందులలో ఆమె మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘‘పులివెందులలోని వెంకటేశ్వరస్వామి టెంపుల్‌ వద్ద బహిరంగసభకు మేం వస్తున్నామని చెప్పి లైట్లు తీసేశారంట. లైట్లు లేవంటే జగన్‌ ఫెయిల్‌ అయినట్లే. లైట్లు కావాలనే తీసివేశారు. అంటే అవినాశ్‌కు భయం పట్టుకున్నట్లు’’ అని వ్యాఖ్యానించారు. జగన్‌ జైలుకెళితే 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని గుర్తుచేశారు. ‘‘ఎండనక, వాననక, నా ఇంటిని, బిడ్డలను, నా కుటుంబాన్ని పక్కనబెట్టి పాదయాత్ర చేశాను. దాదాపు సంవత్సరంపాటు రోడ్డుపైనే బతుకుతూ పాదయాత్ర చేశాను. జగన్‌ సీఎం కాకముందు నేను చెల్లెను. ఆ తర్వాత నేను ఎవరో! సీఎం అయ్యాక కనీసం సునీతమ్మ విషయంలో కూడా న్యాయం చేయలేదు. జగన్‌ అధికారం అడ్డుపెట్టుకుని హంతకులను కాపాడుకుంటున్నారు. సీబీఐ అన్ని సాక్ష్యాలు బయటపెట్టింది, హత్య చేసింది అవినాశ్‌ కుటుంబమే అని చెప్పింది. అన్ని ఆధారాలు ఉన్నా కూడా సీబీఐ అవినాశ్‌ వెంట్రుక కూడా పీకలేకపోయింది. జనాలు నమ్మి ఓటు వేస్తే చేసేది ఇదేనా!’’ అని షర్మిల తీవ్రస్వరం వినిపించారు. జగన్‌ పులివెందుల పిల్లి అని, పిల్లిగా మారి బీజేపీకి బానిసగా మారారని దుయ్యబట్టారు.

షర్మిలను గెలిపిస్తే నా గొంతుక అవుతుంది : సునీత

గత ఎన్నికలకు ముందు వివేకానందరెడ్డిని దారుణంగా హత్యచేశారు. ఆ తర్వాత జగన్‌ సీఎం అయ్యారు. న్యాయం చేస్తానని హామీఇచ్చారు. అయినా కేసు తెగడంలేదు. అనుమానం వచ్చి సీబీఐకి పోదాం అన్నాను. అప్పుడు జగన్‌ సీబీఐకి వద్దు అన్నారు. ‘మనం సీబీఐకి పోతే అవినాశ్‌రెడ్డి బీజేపీలోకి పోతాడ’న్నారు. అప్పుడే సీబీఐకి పోవాలని నిర్ణయం తీసుకున్నా’’ అని వైఎస్‌ వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత వివరించారు. ‘‘వివేకాను చంపితే ఆయనకు కొడుకు లేడనుకున్నారు. ఉన్న ఒక ఆడదీ ఏం చేస్తుందనుకున్నారు. ఆడది అంటే అబల కాదు ఆదిపరాశక్తి. ఇది న్యాయపోరాటం, దోషులకు శిక్ష పడే దాకా సాగే పోరాటం. హత్య చేసినవారికి శిక్షపడాలి అనుకున్నాను. షర్మిలను గెలిపిస్తే నా గొంతుకగా పార్లమెంటుకు వెళుతుంది’’ అని సునీత వివరించారు.

వైసీపీలో భయం పట్టుకుంది

లింగాలలో బస్సుయాత్రలో షర్మిల మాట్లాడుతుండగా కొంతమంది వైసీపీ అల్లరి మూకలు జై జగన్‌ అంటూ అల్లరి చేశారు. రోడ్‌షోను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ‘‘మా సభలో వైసీపీ నాయకులు ఉంటే మాకు అభ్యంతరం లేదు. మీరు గొడవకు దిగుతున్నారంటే వైసీపీ ఓడిపోతుందని అవినాశ్‌కు భయం పట్టుకున్నట్టే’’నని తీవ్ర స్వరంతో షర్మిల అన్నారు. అయితే, రాజశేఖర్‌రెడ్డి బిడ్డను అడ్డుకుంటున్నామనేది మరిచిపోయినట్టు ఉన్నారని వ్యాఖ్యానించారు. కాగా, పులివెందుల పూలంగళ్ల వద్ద అందరి సమక్షంలో వివేకా హత్య గురించి పంచాయితీ పెట్టుకుంటామని.. వైసీపీ మూకలను ఉద్దేశించి సునీత సవాల్‌ చేశారు. కాగా, షర్మిల బస్సు యాత్రకు సొంత గడ్డ పులివెందులలో జనం అడుగడుగునా బ్రహ్మరఽథం పట్టారు. బస్సుయాత్రలో భాగంగా.. వివేకా హత్య, జగన్‌ వైఫల్యాలు ప్రస్తావిస్తూ ప్రధానంగా అవినాశ్‌ను అటాక్‌ చేస్తూ కడిగి పారేశారు. శుక్రవారం వివేకా ఇంట్లో షర్మిల, సునీత బస చేశారు. అనంతరం లింగాలకు వెళ్లారు. అక్కడ సభలో మాట్లాడారు.

Updated Date - Apr 13 , 2024 | 05:41 AM