Share News

YS Sharmila: జగన్‌ బీజేపీ నాయకుడే!

ABN , Publish Date - Feb 29 , 2024 | 04:34 AM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బీజేపీ నాయకుడేనని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి స్పష్టం చేశారు. వైసీపీని అందరూ బీజేపీకి ‘బీ’ టీంగా చిత్రిస్తున్నారని.. కానీ బీజేపీలోనే వైసీపీ ఉందని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానంటూ నరేంద్ర మోదీ తిరుపతి బహిరంగ సభలో హామీ ఇచ్చిన చోటే.. శుక్రవారం ప్ర

YS Sharmila: జగన్‌ బీజేపీ నాయకుడే!

  • రేపు తిరుపతిలో హోదా డిక్లరేషన్‌ సభ

  • రాష్ట్రం పాతికేళ్లు వెనక్కి: షర్మిల

అమరావతి, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (YS Sharmila) బీజేపీ నాయకుడేనని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి స్పష్టం చేశారు. వైసీపీని అందరూ బీజేపీకి ‘బీ’ టీంగా చిత్రిస్తున్నారని.. కానీ బీజేపీలోనే వైసీపీ ఉందని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానంటూ నరేంద్ర మోదీ తిరుపతి బహిరంగ సభలో హామీ ఇచ్చిన చోటే.. శుక్రవారం ప్రత్యేక హోదా డిక్లరేషన్‌ పేరిట బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం విజయవాడలో పీసీసీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. హోదా సాధించకపోవడం వల్ల రాష్ట్రం పాతికేళ్లు వెనక్కి పోయిందన్నారు. ఉద్యోగాల భర్తీ ఇదే తరహాలో కొనసాగితే.. రాష్ట్రంలో యువత కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాతోనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని.. ఇది రాష్ట్రానికి సంజీవని వంటిదని చెప్పారు. రాజకీయం కోసం ప్రతిపక్షంలో ఉండగా జగన్‌ దీనిని వాడుకున్నారని, దీక్షలు కూడా చేశారని.. మూకుమ్మడిగా లోక్‌సభ సభ్యులు రాజీనామా చేస్తే కేంద్రం దిగివచ్చి ప్రత్యేక హోదా ఎందుకివ్వదంటూ ప్రశ్నించారని గుర్తుచేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఒక్క ఎంపీతోనైనా రాజీనామా చేయించారా అని ప్రశ్నించారు. చంద్రబాబు, జగన్‌ తమ రాజకీయ లబ్ధి కోసం ప్రజా హక్కు హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టేశారని ఆరోపించారు.

‘2014లో ఢిల్లీని తలపించే రాజధాని నిర్మాణం చేస్తానని మోదీ హామీ ఇచ్చారు. ఆ హామీ ఏమైంది? హోదా ఇచ్చాక ఉత్తరాఖండ్‌లో 2,000 పరిశ్రమలు వచ్చాయి. ఇక్కడ జగన్‌ వచ్చాక పట్టుమని పది పరిశ్రమలైనా వచ్చాయా? రాష్ట్రంలో 972 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. వాటి ఆధారిత పరిశ్రమలు వచ్చాయా? రాష్ట్రాన్ని హార్డ్‌వేర్‌ హబ్‌ చేస్తానంటూ మోదీ చేసిన ప్రకటన ఏమైంది’ అని ప్రశ్నలవర్షం కురిపించారు. జగన్‌ పాలనలో లిక్కర్‌, శాండ్‌, మైనింగ్‌ మాఫియా పేట్రేగిపోతున్నాయని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. మాఫియా గురించి కేంద్రంలోని వారందరికీ తెలుసని.. కానీ ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టడం లేదో అందరికీ అర్థమవుతోందన్నారు. జగన్‌ బీజేపీ నాయకుడు కాబట్టే ఆయనపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడం లేదని షర్మిల మండిపడ్డారు.

అభ్యర్థుల ఎంపికలో షర్మిల రెడ్డి

సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల వడబోతలో ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలరెడ్డి బుధవారమంతా బిజీగా ఉన్నారు. ఆంధ్రరత్నభవన్‌లో ఆమె కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసేందుకు దరఖాస్తులు చేసుకున్న ఆశావహులతో వ్యక్తిగతంగా మాట్లాడారు. ఏడు లోక్‌సభ స్థానాలు... నర్సాపురం, ఏలూరు, నరసారావుపేట, బాపట్ల, గుంటూరు, మచిలీపట్నం నియోజకవర్గాల దరఖాస్తుదారులతో మాట్లాడారు. అదేవిధంగా ఈ పార్లమెంటుస్థానాల పరిధిలోని 49 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు అప్లికేషన్‌ పెట్టుకున్న 280 మంది దరఖాస్తుదారులతో షర్మిలరెడ్డి చర్చించారు. ఈ వడబోత ప్రక్రియ రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది. కాగా, గురువారం మరో తొమ్మిది లోక్‌సభ స్థానాలకు దరఖాస్తు చేసిన నేతలు.. 63 అసెంబ్లీ నియోజకవర్గాల దరఖాస్తుదారుల అభ్యర్థిత్వాలను షర్మిలరెడ్డి పరిశీలిస్తారు.

Updated Date - Feb 29 , 2024 | 07:06 AM