AP Politics: సీఎం జగన్ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డికి పిలుపు.. ఎందుకంటే..?
ABN , Publish Date - Jan 17 , 2024 | 04:45 PM
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ( Balineni Srinivasa Reddy )కి సీఎం వైఎస్ జగన్ ( CM YS JAGAN ) నుంచి పిలుపు వచ్చింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి తనను కలవాలని బాలినేని శ్రీనివాసరెడ్డిని సీఎం ఆదేశించారు.
తాడేపల్లి: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ( Balineni Srinivasa Reddy )కి సీఎం వైఎస్ జగన్ ( CM YS JAGAN ) నుంచి పిలుపు వచ్చింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి తనను కలవాలని బాలినేని శ్రీనివాసరెడ్డిని సీఎం ఆదేశించారు. బాలినేనికి బుధవారం అపాయింట్మెంట్ ఇవ్వడంతో సీఎంవోకి వచ్చారు. సీఎం జగన్ తీరుతో కొంత కాలంగా బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ప్రకాశం జిల్లాలో పలు నియోజకవర్గాల ఇన్చార్జిల మార్పులపై ఆగ్రహంతో ఉన్నారు. తనతో కనీసం చర్చించకుండా మార్పులు చేస్తుండటంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గిద్దలూరు, దర్శి, కొండేపి అసెంబ్లీ ఇన్చార్జిల నియామకంలో తన మాట పట్టించుకోలేదని బాలినేని అసంతృప్తితో ఉన్నారు.
బాలినేని అలక అందుకోసమేనా..
ఒంగోలు ఎంపీ సీటు మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఇవ్వాలని బాలినేని పట్టుబడుతోన్నారు. తన నియోజకవర్గం ఒంగోలులో పేదల ఇళ్ల స్థలాల పంపిణీ కోసం నిధులు కేటాయిం చకపోవడంపైనా ఆయన అలక బూనినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా సీఎం జగన్ని కలిసేందుకు అవకాశం ఇవ్వక పోవడంతో బాలినేని అసంతృప్తిలో ఉన్నారు. కొద్ది రోజులుగా ఆయన ఎవరికీ అందుబాటులోకి లేకుండా ఉన్నారు. ప్రకాశం జిల్లాలో జరిగిన పలు కీలక సమావేశాలకూ కూడా బాలినేని, ఆయన అనుచరులు గైర్హాజరవుతున్నారు. సీఎంవో సహా ముఖ్యనేతల సంప్రదింపులతో బాలినేని తాడేపల్లికి వచ్చారు. బాలినేనితో సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ముఖ్యనేతలు చర్చిస్తున్నారు. కాసేపట్లో సీఎం జగన్ను బాలినేని శ్రీనివాసరెడ్డి కలిసి చర్చించే అవకాశాలు ఉన్నాయి.