Share News

Weather Update: ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక.. ఐదు రోజులు మంటలే..!

ABN , Publish Date - Apr 27 , 2024 | 03:32 AM

మునుపెన్నడూ లేనంతగా ఎండ వేడి, తీవ్ర వడగాడ్పులతో దేశంలోని అనేక ప్రాంతాలు ఉడుకుతున్నాయి.

Weather Update: ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక.. ఐదు రోజులు మంటలే..!

  • తూర్పు, దక్షిణ భారతంలో తీవ్ర వడగాలులు

  • రాయలసీమ, తెలంగాణలోనూ గాల్పుల తీవ్రత

  • వచ్చే నెలలో మరింత వేడిగాలులు...

  • 45 డిగ్రీలు దాటి నమోదయ్యే అవకాశం

  • వాతావరణ నిపుణుల హెచ్చరిక

విశాఖపట్నం, అమరావతి, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): మునుపెన్నడూ లేనంతగా ఎండ వేడి, తీవ్ర వడగాడ్పులతో దేశంలోని అనేక ప్రాంతాలు ఉడుకుతున్నాయి. రోహిణి కార్తెకు మరో నెల రోజుల సమయం ఉండగానే రోళ్లు బద్ధలయ్యేలా కాస్తున్న ఎండలతో ప్రజలు ఠారెత్తిపోతున్నారు. ఈ ఏడాది వేసవి తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు ముందే హెచ్చరించారు. గతేడాది కంటే ప్రస్తుత ఏడాది రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని ఐఎండీ సీనియర్‌ అధికారి డీఎస్‌ పాయ్‌ శుక్రవారం పేర్కొన్నారు. ఇప్పటివరకు 2023 అత్యంత వేడి సంవత్సరంగా నమోదైందని, అయితే ఈ ఏడాది ఆ రికార్డును అధిగమిస్తుందని అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌లో తీవ్రమైన వడగాడ్పులు వీయడంతో కొద్దిరోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీలు, అక్కడక్కడా అంతకుమించి నమోదు కావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. కాగా, రానున్న ఐదు రోజుల్లో దక్షిణాదిలో ఏపీ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, వీటికి ఆనుకుని ఒడిశా, ఛత్తీ్‌సగఢ్‌, మధ్యప్రదేశ్‌, విదర్భ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలోని అనేక ప్రాంతాల్లో వేడి వాతావరణం కొనసాగడమే కాకుండా వడగాడ్పులు వీస్తాయని ఐఎండీ శుక్రవారం హెచ్చరించింది.

ఈ నెల 28 నుంచి 30 వరకు ఈశాన్య భారతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలావుండగా ఎల్‌నినో బలహీనపడినా ఇంకా దాని అవశేషాల ప్రభావంతో పసిఫిక్‌ మహాసముద్రం నుంచి వస్తున్న వేడి గాలులు భారత ఉపఖండంలో మరింత వేడిని పెంచుతున్నాయని సీనియర్‌ వాతావరణ శాస్త్రవేత్త ఒకరు పేర్కొన్నారు. దీని ప్రభావంతో దేశం మొత్తం నిప్పుల కుంపటిలా మారిందని, వచ్చేనెలలో మరింత వేడిగాలులు వీస్తాయని, పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటతాయని హెచ్చరించారు. వడగాడ్పుల ప్రభావం ఎన్నికల ప్రచారం, పోలింగ్‌పై పడనుందన్నారు.

నంద్యాలలో 45.5 డిగ్రీలు

రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45.5 డిగ్రీలకు చేరాయి. శుక్రవారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.5 డిగ్రీలు, కడప జిల్లా ఖాజీపేటలో 45.3, పల్నాడు జిల్లా మాచర్లలో 45.2, కర్నూలు రూరల్‌లో 44.9, అనంతపురం జిల్లా తాడిపత్రిలో 44.6, ప్రకాశం జిల్లా మార్కాపురం, విజయనగరం జిల్లా కొత్తవలసలో 44.2, మన్యం సాలూరులో 43.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 41 మండలాల్లో తీవ్రంగా, 116 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీచాయి. రానున్న రెండు రోజులు ఉష్ణోగ్రత 46 డిగ్రీలకు చేరనుంది. శనివారం.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని 64 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని, రాష్ట్రవ్యాప్తంగా 183 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

Updated Date - Apr 27 , 2024 | 08:07 AM