Share News

Telugudesam: కీలక నియోజకవర్గాల్లో చంద్రబాబు మార్పులు, చేర్పులు.. ఫైనల్‌గా గంటాకు..!!

ABN , Publish Date - Mar 23 , 2024 | 02:45 AM

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కూటమి.. ఇందుకోసం అభ్యర్థులను మార్చడంలో కూడా టీడీపీ అధినేత వెనకాడట్లేదు. సర్వేలు, స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా మళ్లీ కసరత్తులు చేసి.. మార్పులు, చేర్పులు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Telugudesam: కీలక నియోజకవర్గాల్లో చంద్రబాబు మార్పులు, చేర్పులు.. ఫైనల్‌గా గంటాకు..!!

  • కళావెంకట్రావుకు గజపతినగరం?

  • టీడీపీ అధిష్ఠానం యోచన

  • బీజేపీకి ఆదోని బదులు ఆలూరు?

  • రెండు పార్టీల మధ్య చర్చ

  • ఒంగోలు లోక్‌సభ బరిలో మాగుంటే!

  • ఢిల్లీ లిక్కర్‌ స్కాం పరిణామాలతో ఆయన కుమారుడి పేరు వెనక్కి?

అమరావతి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections 2024) గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కూటమి.. ఇందుకోసం అభ్యర్థులను మార్చడంలో కూడా టీడీపీ అధినేత వెనకాడట్లేదు. సర్వేలు, స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా మళ్లీ కసరత్తులు చేసి.. మార్పులు, చేర్పులు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకట్రావును విజయనగరం జిల్లా గజపతినగరంలో నిలపాలని ఆ పార్టీ అధిష్ఠానం యోచిస్తోంది. ఆయన గతంలో ఎచ్చెర్లకు ప్రాతినిధ్యం వహించారు. మొదట శ్రీకాకుళం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చిన ఆ పార్టీ.. తర్వాత వెనక్కి తీసుకుని ఎచ్చెర్లను కేటాయించింది. దీంతో కళాను గజపతినగరానికి మార్చే విషయమై చర్చ నడుస్తోందంటున్నారు. కొద్ది రోజుల క్రితమే గజపతినగరానికి కొండపల్లి శ్రీనివాస్‌ను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఆయనకు అంత అనుకూలత రావడం లేదని ప్రచారం జరుగుతోంది.

మార్పులు, చేర్పులు!

చీపురుపల్లికి ప్రస్తుతం కిమిడి నాగార్జున ఇన్‌చార్జిగా ఉన్నారు. అక్కడ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును నిలపాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. విశాఖలోని భీమిలిపై ఇంకా తర్జనభర్జనలు సాగుతున్నాయి. ప్రకాశం జిల్లా దర్శిలో ప్రవాసాంధ్రుడు గరికపాటి వెంకట్‌, ప్రస్తుత ఇన్‌చార్జి గోరంట్ల రవికుమార్‌, గొట్టిపాటి లక్ష్మి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వెంకట్‌ కొంతకాలంగా ఆ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్‌, గుంతకల్లు, అన్నమయ్య జిల్లా రాజంపేట, కర్నూలు జిల్లా ఆలూరుపై టీడీపీ ఇంకా నిర్ణయానికి రాలేదు. కర్నూలు జిల్లా ఆదోని సీటును బీజేపీకి ఇచ్చారు. ఇప్పుడు దానిని వెనక్కి తీసుకుని ఆలూరు కేటాయించే ప్రతిపాదనపై మధ్య చర్చ నడుస్తోంది. లోక్‌సభ సీట్లలో ఇంకా ఒంగోలు, అనంతపురం, కడప, రాజంపేట అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇందులో ఒంగోలులో మాగుంట రాఘవరెడ్డిని నిలపాలని గతంలో అనుకున్నారు. కానీ ఢిల్లీ మద్యం కేసులో తాజా పరిణామాలతో రాఘవరెడ్డి స్థానంలో ఆయన తండ్రి, సిటింగ్‌ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు ముందుకొచ్చినట్లు చెబుతున్నారు.

Updated Date - Mar 23 , 2024 | 09:06 AM