AP Govt : బీసీల స్వయం ఉపాధి పథకాలు
ABN , Publish Date - Dec 27 , 2024 | 04:50 AM
బీసీల స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.

మహిళలకు టైలరింగ్ శిక్షణ
కుట్టు మిషన్ల పంపిణీకి ఏర్పాట్లు.. అర్హులైన బీసీ, ఈబీసీలకు జనరిక్ షాపులకు ఆర్థిక సాయం
అమరావతి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): బీసీల స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే పలు పథకాల అమలుకు ప్రణాళికలు రూపొందించి అనుమతి కోసం ముఖ్యమంత్రికి పంపించిన బీసీ సంక్షేమ శాఖ మొదటగా ఒకటి రెండు స్వయం ఉపాధి పథకాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. సుమారు 80 వేల మంది బీసీ, ఈబీసీ మహిళలకు టైలరింగ్పై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అన్ని మండల కేంద్రాల్లోను, నగరాల్లోను, పట్టణాల్లోను డిమాండ్ ఉన్న చోట జనరిక్ షాపులను నడిపేందుకు యువతకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి దరఖాస్తులు ఆన్లైన్లో చేసేందుకు ఓబీఎంఎస్ వెబ్సైట్నూ సిద్ధం చేస్తున్నారు. మరోవైపు శిక్షణ ఇచ్చేందుకు సంస్థలను ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచారు. ఒక్కో బీసీ, ఈబీసీ మహిళకు రోజుకు 4 గంటల చొప్పున 90 రోజుల పాటు టైలరింగ్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం మండల కేంద్రాల్లో శిక్షణ ఏర్పాట్లు చేయనున్నారు. శిక్షణ అనంతరం వారికి రూ.24,000 విలువ చేసే కుట్టు మిషన్లు అందించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్నారు.
ప్రతి మండల కేంద్రంలో ఒక జనరిక్ షాపును ఏర్పాటు చేయడం ద్వారా స్వయం ఉపాధి కల్పించవచ్చని భావిస్తున్నారు. డీ ఫార్మా, బీ ఫార్మసీ కోర్సు సర్టిఫికెట్ కలిగిన బీసీ, ఈబీసీ యువతను ప్రోత్సహించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఒక్కో షాపు అభివృద్ధి కోసం బీసీ సంక్షేమ ఆర్థిక సంస్థ రూ.8 లక్షలు అందించనుంది. అందులో రూ.4 లక్షలు సబ్సిడీగా ఇచ్చి, మిగిలిన రూ.4 లక్షలు రుణంగా ఇప్పించాలని నిర్ణయించారు. ఉపాధి పథకాల అమలు చేయాల్సిన పద్ధతులపై మంత్రి సవిత, డైరక్టర్ మల్లికార్జున్, ముఖ్య కార్యదర్శి పోలా భాస్కర్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ ఇప్పటికే పలు దఫాలు సమావేశమై చర్చించారు.