Share News

kA PAul, Babu Mohan: విశాఖలో బాబు మోహన్, పాల్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 29 , 2024 | 07:18 PM

ఈ ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా బరిలో దిగుతున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పష్టం చేశారు. అయితే తనను ఓడించడానికి బీజేపీ, టీడీపీ, జనసేన కలిశాయని ఆయన ఆరోపించారు.

kA PAul, Babu Mohan: విశాఖలో బాబు మోహన్, పాల్ కీలక వ్యాఖ్యలు

విశాఖపట్నం, మార్చి 29: ఈ ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా బరిలో దిగుతున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు (praja shanthi party) కేఏ పాల్ (Ka paul) స్పష్టం చేశారు. అయితే తనను ఓడించడానికి బీజేపీ, టీడీపీ, జనసేన కలిశాయని ఆయన ఆరోపించారు. ప్రజా సేవ కోసమే ప్రజాశాంతి పార్టీ స్థాపించానని కేఏ పాల్ తెలిపారు. శుక్రవారం విశాఖపట్నంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు బాబు మోహన్‌తో కలిసి కేఏ పాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్బంగా బాబు మోహన్ (Babu Mohan) మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో వరంగల్ నుంచి ప్రజా శాంతి పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు మరోసారి ప్రకటించారు. అయితే తాను వరంగల్ నుంచి బీఆర్ఎస్ ఎంపీగా బరిలో దిగుతున్నట్లు కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ.. ఆ వార్తలను ఆయన ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌తో తాను మాట్లాడి సుమారు అయిదేళ్లు అయిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అదీకాక ఎన్నికల వేళ.. తాను పార్టీల మారాల్సిన అవసరం లేదన్నారు.

విశాఖలో కేఏ పాల్ గెలుపు కోసం ప్రచారం చేస్తానని.. ఆయన గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. ఇటీవల బాబు మోహన్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. అయితే తనకు జన్మనిచ్చిన గడ్డ వరంగల్ నగరానికి ఏమైనా చేయాలనే ఆలోచన ఉందన్నారు. ఆ క్రమంలో దీనిపై త్వరలో ఓ ప్రకటన చేస్తానన్నారు. ఆ కొద్ది రోజులకే ప్రజా శాంతి పార్టీలో బాబు మోహన్ చేరారు. ప్రజాశాంతి పార్టీ తరపున తాను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు నాడే ఆయన ప్రకటించారు.

మరోవైపు వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. అయితే తాను బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయనని.. పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు కేసీఆర్‌కు ఆమె లేఖ రాశారు. అంతేకాదు.. బీఆర్ఎస్‌ పార్టీలో ఇటీవల చోటు చేసుకున్న వరుస పరిణామాలు ఫోన్ ట్యాపింగ్, పార్టీ నుంచి వలసలు, అవినీతి ఆరోపణలు, లిక్కర్ స్కాం తదితర కారణాల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు లేఖలో ఆమె వివరించింది. దాంతో వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బాబు మోహన్‌ను బరిలో దింపుతున్నట్లు ఓ ప్రచారం సైతం వైరల్ అయింది. దీంతో తాజాగా ఈ ప్రచారాన్ని బాబు మోహన్ ఖండించారు.

Updated Date - Mar 29 , 2024 | 07:18 PM