Share News

YS Jagan: దేశం దాటి దా‘రుణం’.. వైఎస్ జగన్‌ అప్పుల వెనుక..!

ABN , Publish Date - Apr 11 , 2024 | 07:37 AM

జగన్‌ రుణ దాహం ఖండాంతరాలను దాటుతోంది. దేశంలోని బ్యాంకులు, ఆర్బీఐ, ఇతర దేశీయ ఆర్థిక సంస్థలతో తెచ్చిన అప్పులు చాలక... ఏకంగా విదేశీ సంస్థల నుంచీ అప్పులు తెచ్చేస్తున్నారు. అదేదో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం జైకా, ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి తీసుకునే అప్పు కాదండోయ్‌! ప్రభుత్వ ఆస్తులు, భవిష్యత్‌ ఆదాయాన్ని తాకట్టుపెట్టి మరీ తెస్తున్న అప్పు!..

YS  Jagan: దేశం దాటి దా‘రుణం’.. వైఎస్ జగన్‌ అప్పుల వెనుక..!

  • వైఎస్ జగన్‌ అప్పుల వెనుక ‘విదేశీ’ హస్తం!

  • ఎండీసీ గనుల ఆదాయం తాకట్టు

  • విదేశీ సంస్థ ద్వారా 14 వేల కోట్ల అప్పు

  • సంస్థ పేరు బయటపెట్టని జగన్‌ సర్కారు

  • 8.7 శాతం వడ్డీతో ఎన్‌సీడీల కొనుగోలు

  • రిస్క్‌ ఎక్కువైనా అంత ఉదారత ఎందుకో?

  • అవి కష్టపడకుండా వచ్చిన సొమ్ములా?

  • ‘బ్లాక్‌’ను మార్చుకునే ప్రయత్నమా?

  • అప్పు ఇచ్చే సంస్థ పేరు బయటపెట్టరేం?

  • మార్చి 1నే వచ్చేసినరూ.7 వేల కోట్లు

  • మే 2వ తేదీన మరో 7 వేల కోట్లు జమ!

  • ఆపద్ధర్మ సర్కారుకు ఈ అధికారం ఉందా?

  • ఏపీ రాజధాని ఏదో తెలియదు!

  • అందుకే ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయలేదు: ఆర్‌బీఐ

బరితెగించిన బాలినేని వర్గం!



(అమరావతి – ఆంధ్రజ్యోతి):

జగన్‌ రుణ దాహం ఖండాంతరాలను దాటుతోంది. దేశంలోని బ్యాంకులు, ఆర్బీఐ, ఇతర దేశీయ ఆర్థిక సంస్థలతో తెచ్చిన అప్పులు చాలక... ఏకంగా విదేశీ సంస్థల నుంచీ అప్పులు తెచ్చేస్తున్నారు. అదేదో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం జైకా, ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి తీసుకునే అప్పు కాదండోయ్‌! ప్రభుత్వ ఆస్తులు, భవిష్యత్‌ ఆదాయాన్ని తాకట్టుపెట్టి మరీ తెస్తున్న అప్పు! ఈసారి గనుల శాఖ పరిధిలోని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆదాయాన్ని తాకట్టుపెట్టేశారు. ‘గుర్తు తెలియని’ విదేశీ సంస్థ నుంచి జగన్‌ సర్కారు ఏకంగా రూ.14వేల కోట్లు అప్పు తెస్తున్నారు. ఇందులో 7వేల కోట్లు మార్చి 1నే వచ్చేశాయి. మిగిలిన మొత్తం మే 2న అందనుంది. విదేశాల నుంచి బీఎస్‌ఈ ద్వారా అప్పులు వస్తున్నట్టు సెబీ, ఆర్‌బీఐకి ఏపీఎండీసీ సమాచారం ఇచ్చింది. జగన్‌ విదేశీ పెట్టుబడులు సాధించలేరు గానీ... విదేశాల అప్పులు తేవడంలో తన ప్రతిభ చాటుకుంటున్నారు. దేశంలో ఎక్కడా పైసా పుట్టకపోవడంతో సరిహద్దులు దాటుతున్నారు. అయితే... ఏపీఎండీసీని నమ్మి అన్ని వేల కోట్లు అప్పు ఇస్తున్న విదేశీ సంస్థ ఎవరదిన్నదే ఇక్కడ సస్పెన్స్‌! ఆ సంస్థ పేరు బయటికి పొక్కకుండా సర్కారు అత్యంత గోప్యత పాటిస్తోంది. ఫిబ్రవరి 27, 28, 29 తేదీల్లో ఏపీఎండీసీ విడుదల చేసిన ఎన్‌సీడీ (నాన్‌కన్వర్టబుల్‌ డిబెంచర్లు)లను రూ.7000 కోట్లతో ఆ విదేశీ ఇన్వెస్టర్‌ కొనుగోలు చేశారు. ఇందుకుగాను రాష్ట్రంలోని గనులు, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌లలో గనులను ఏపీఎండీసీ హామీగా చూపించింది. ఇంత విలువైన ఆస్తులను ‘ష్యూరిటీ’గా పెట్టిన తర్వాత కూడా... తీసుకున్న అప్పునకు ఏపీ ప్రభుత్వం ‘అన్‌కండిషనల్‌’ గ్యారెంటీ ఇచ్చేసింది. ఒకవేళ ఈ బాండ్ల అసలు, వడ్డీ, రాబడులు చెల్లించడంలో ఏపీఎడీసీ విఫలమైతే నేరుగా రాష్ట్ర ఖజానా నుంచి ఏపీఎండీసీ బాండ్‌ సర్వీసింగ్‌ అకౌంట్‌కు డబ్బులు వెళ్లిపోతాయి. అక్కడనుంచి ఆ ఇన్వెస్టర్‌కు ఎలాంటి అంతరాయాలు లేకుండా చెల్లింపులు జరిగిపోతాయి.

YS--Jagan.jpg

ఎంత ఉదార స్వభావం..

ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. ఆ విదేశీ ఇన్వెస్టర్‌ అత్యంత ఉదారంగా ఏపీఎండీసీ జారీ చేసిన ఎన్‌సీడీలు కొనడమే! ఎఫ్‌పీఐ(ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్‌) విధానంలో ఆ రూ.7,000 కోట్లను ఏపీఎండీసీకి చేర్చారు. ఈ ఎన్‌సీడీలకు ఎలాంటి రేటింగ్‌ లేదు. లిస్టింగ్‌ కూడా కాలేదు. అయినా సరే... 8.70శాతం వడ్డీకే అన్ని వేల కోట్లు ఇస్తుండటమే విచిత్రం! అన్‌రేటెడ్‌, అన్‌లిస్టెడ్‌ ఎన్‌సీడీలతో రిస్క్‌ ఎక్కువ. ఇలాంటివాటికి మార్కెట్‌లో 12శాతం పైనే వడ్డీ వసూలు చేస్తారు. అయినప్పటికీ ఆ రహస్య విదేశీ ఇన్వెస్టర్‌ 8.70 శాతంతోనే సరిపెట్టుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక 2022 జూన్‌లో బేవరేజెస్‌ కార్పొరేషన్‌ విడుదల చేసిన బాండ్లకు ’ఏఏ’ రేటింగ్‌ ఉన్నప్పటికీ వీటిపై 9.62% వడ్డీరేటు అమలవుతోంది. 2018 ఆగస్టులో సీఆర్‌డీఏ బాండ్లకు ’ఏ’ రేటింగ్‌ ఇచ్చారు. వీటిపై 10.32% వడ్డీరేటు అమలవుతోంది. 2022 జూన్‌లో 4.9% రెపో రేటు ఉంది. ప్రస్తుతం రెపో రేటు 6.50% ఉంది. అయినప్పటికీ ఆ ఇన్వెస్టర్‌ 8.7 శాతానికే వేల కోట్లు ఇస్తున్నారంటే... ఆ సొమ్ము కష్టపడి సంపాదించిందేనా? లేక... ఏపీఎండీసీని అడ్డంపెట్టుకుని బ్లాక్‌మనీని వైట్‌ చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఇతర పెట్టుబడి సాధనాలు, ప్రఖ్యాత సంస్థల షేర్లు, బాండ్లు అందుబాటులో ఉన్నా ఏరికోరి ఎండీసీకే ఎందుకు అప్పుగా ఇచ్చారో మరి.


ఎవరి అనుమతి తీసుకున్నారు?

ఇప్పటికే అందిన రూ.7వేల కోట్ల విదేశీ రుణానికి మార్చి 15న కోడ్‌కు ఒక్కరోజు ముందు షార్ట్‌ సర్క్యులేషన్‌ విధానంలో కేబినెట్‌ ఆమోదం తీసుకున్నారు. మే 2న బీఎస్‌ఈ నుంచి తేబోతున్న రూ.7,000 కోట్ల అప్పునకు కేబినెట్‌ అనుమతి ఉందా? అన్నదే ప్రశ్న! కోడ్‌ అమలులోకి వచ్చినందున... కేబినెట్‌ అందుబాటులో ఉండదు. ఇప్పుడున్నది ఆపద్ధర్మ ప్రభుత్వం. రోజువారీ వ్యవహారాలు, అత్యవసర పరిస్థితులు చూసుకుంటే చాలు. అలాంటిది ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి వేల కోట్ల అప్పులు ఎలా తెస్తుంది? రాష్ట్ర వ్యవహారాలన్నీ చూసుకోవాల్సిన సీఎస్‌ జవహర్‌రెడ్డి ఏం చేస్తున్నారు?

3వ తేదీ నుంచి ఖాతాల్లోకి నిధులు

కోడ్‌ అమల్లోకి రావడానికి ముందువరకు జగన్‌ మూడు నాలుగు పథకాల బటన్లు నొక్కారు. కానీ, లబ్ధిదారుల ఖాతాల్లోకి ఇంకా డబ్బు జమకాలేదు. కానీ... కోడ్‌ వచ్చాక అస్మదీయులకు దాదాపు రూ.16,000కోట్ల బిల్లులు చెల్లించారు. ఇప్పుడు మే 2న రాబోయే రూ.7,000 కోట్లను పోలింగ్‌కు ముందు (మే 13) పథకాల లబ్ధిదారులకు జమ చేసి... రాజకీయ లబ్ధి పొందే ఆలోచనలో ఉన్నట్లు అనుమానాలున్నాయి. ఇలాచేయడం కచ్చితంగా కోడ్‌ను ఉల్లంఘించడమే!

ఎన్నికలముందు అన్ని వేల కోట్లు..!

మార్చి 1న తెచ్చిన రూ.7,000 కోట్లు కార్పొరేషన్‌ సొంత అవసరాల కోసమని రాశారు. మే 2న మరో రూ.7,000 కోట్లు తెస్తున్నారు. రెండు నెలల్లో రూ.14,000 కోట్లతో ఏం చేస్తున్నారు? ఇప్పటికే తెచ్చిన రూ.7,000 కోట్లు ఏం చేశారు. ఐదేళ్లలో లేనిది ఈ రెండు నెలల్లోనే ఆ రూ.14,000 కోట్లతో చేస్తున్న అభివృద్ధి ఏమిటో గనుల శాఖ గాని, సీఎస్‌ జవహర్‌ రెడ్డి గాని చెప్పగలరా? పైగా ఫిబ్రవరి 27, 28, 29 తేదీల్లో బీఎస్‌ఈలో ఎన్‌సీడీలు ఆఫర్‌ చేస్తే కేవలం ఆ రహస్య ఇన్వెస్టర్‌ ఒక్కరే కొనుగోలుకు ముందుకొచ్చారా? ఇంకెవరైనా కూడా వచ్చారా? ఈ ప్రశ్నల్లో దేనికీ సమాధానం లేదు. మార్చి 1న ఎండీసీకి రూ.7,000 కోట్లు రాగా... 4వ తేదీన బీఎస్‌ఈలో ఈ మేరకు అప్‌డేట్‌ చేశారు.

Updated Date - Apr 11 , 2024 | 09:22 AM