YCP : కొడుతున్నారు బాబోయ్..!
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:24 AM
అధికారం చేపట్టాక ఐదేళ్లపాటు అరాచకం సృష్టించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, మీడియా ప్రతినిధులు.. ఇలా అందరిపైనా దాడులకు తెగబడ్డారు. తమకు దాసోహమైన పోలీసు అధికారుల అండతో రెచ్చిపోయారు. రాప్తాడు ఎమ్మెల్యే సోదరుడు స్వయంగా పలుమార్లు హింసాత్మక ఘటనలలో పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలతోపాటు సామాన్యులపై సైతం దాడికి దిగారు. అధికారం చేతులు మారడంతో ఇప్పుడు తమపై ఎక్కడ ప్రతీకార దాడులు జరుగుతాయోనని...

నాటకాలు మొదలు పెట్టిన వైసీపీ నేతలు
కంటికి కన్ను.. పంటికి
పన్ను అని బెదిరింపులు
ఐదేళ్ల అరాచకాలను
మరిచిన తోపుదుర్తి, మాధవ్
అనంతపురం క్రైం, జూన 6: అధికారం చేపట్టాక ఐదేళ్లపాటు అరాచకం సృష్టించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, మీడియా ప్రతినిధులు.. ఇలా అందరిపైనా దాడులకు తెగబడ్డారు. తమకు దాసోహమైన పోలీసు అధికారుల అండతో రెచ్చిపోయారు. రాప్తాడు ఎమ్మెల్యే సోదరుడు స్వయంగా పలుమార్లు హింసాత్మక ఘటనలలో పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలతోపాటు సామాన్యులపై సైతం దాడికి దిగారు. అధికారం చేతులు మారడంతో ఇప్పుడు తమపై ఎక్కడ ప్రతీకార దాడులు జరుగుతాయోనని సీన క్రియేట్ చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాకనే ‘దాడులకు తెగబడుతున్నారు’ అని గగ్గోలు పెడుతున్నారు. నగరంలోని వైసీపీ జిల్లా
కార్యాలయంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్షరెడ్డి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వైసీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు చేస్తున్నారు, తమ ప్రాణాలను అడ్డుపెట్టి అయినా తమ పార్టీ కార్యకర్తల ప్రాణాలను కాపాడుకుంటామని అన్నారు. కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని, స్పందన లేకపోతే ఆత్మరక్షణకు కంటికి కన్ను.. పంటికి పన్ను నినాదంతో ముందుకుపోతామని బెదిరింపులకు దిగారు. టీడీపీ నాయకులు దాడులను నియంత్రించాలని నీతులు పలికారు. ‘వైసీపీ అధికారంలోకి రాగానే మా వాళ్లకు మెసేజ్ పెట్టాం. ఓటమి బాధతో టీడీపీ వర్గీయులు దాడులు చేసినా సహించాలని, దగ్గరకు తీసుకోవాలని సూచించాం. మూడు రోజులుగా దాడులు చేస్తున్నా ఎమ్మెల్యే (పరిటాల సునీత) స్పందించడం లేదు..’ అని తోపుదుర్తి ప్రకాశ రెడ్డి అన్నారు. మరి అప్పట్లో మెసేజ్ పెట్టుంటే.. విపక్ష శ్రేణులు, మీడియా ప్రతినిధులపై దాడులు ఎలా జరిగాయో..! బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు ఎందుకు స్పందించలేదో..!
ఇవి దాడులు కావా..?
- చెన్నేకొత్తపల్లిలో టీడీపీ నాయకుడు ఘంఠాపురం జగ్గుపై ఏడాది క్రితం వైసీపీ కనగానపల్లి మండల కన్వీనర్ అమరనాథ్రెడ్డి తదితరులు దాడి చేశారు. భూముల కోసం భయభ్రాంతులకు లోనుచేశారు.
- ఫిబ్రవరి 18న రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై విచక్షణారహితంగా దాడి చేశారు. వారిలో కనగానపల్లి మండలం కోనాపురానికి చెందిన బండి రవి కీలకం. ‘ఎమ్మెల్యే ఇంటివద్ద ఉన్నా.. రండి..’ అని పోలీసులకు సవాలు విసిరాడు. ప్రజాప్రతినిధిగా ఉండి.. రౌడీలను రక్షించి.. ఇప్పుడు నీతి వాక్యాలా..? బండి రవి వ్యవహారంలో పోలీసుల వైఖరి.. ఆ శాఖను నవ్వులపాలు చేసింది. హత్యాయత్నం కేసు నమోదైనా.. స్వగ్రామం కోనాపురంలోనే ఉంటూ ఎన్నికల ప్రచార సమయంలో టీడీపీ కార్యకర్తలపై బండి రవి దాడి చేశాడు. అయినా పట్టించుకోలేదు. ‘ఎందుకు అరెస్టు చేయలేదు?’ అని విలేకరులు అడిగితే.. ‘ఎక్కడున్నాడో చెప్పండి.. పట్టుకుంటాం..’ అని ఓ డీఎస్పీ అన్నారు. ఎవరి ఒత్తిళ్లతో నాటి పోలీసు అధికారులు వైసీపీ చొక్కాలు వేసుకున్నట్లు..?
- ఆత్మకూరు మండలంలో టీడీపీ కార్యకర్త వన్నూరుపై తోపుదుర్తి ప్రకాశ రెడ్డి సోదరుడు దాడికి దిగారు. అదే మండలంలో తోపుదుర్తి, రామగిరి మండలం పీఆర్ కొట్టాలలో టీడీపీలోకి చేరినవారిని భయభ్రాంతులకు గురిచేశారు.
అప్పుడేమయ్యారు మాజీ పోలీసూ..?
సొంతపార్టీవారు అరాచకాలకు పాల్పడుతున్నా.. పోలీసు శాఖలో పనిచేసిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పల్లెత్తు మాట అనలేదు. ఇప్పుడు శాంతి వచనాలు వల్లిస్తున్నారు. ఎవరూ ఏమీ అనకున్నా.. బెదిరింపులకు దిగుతున్నారు. ఐదేళ్లపాటు అరాచకాలకు పాల్పడినవారికి ఓటర్లు బుద్ధి చెప్పారు. బాధితులు ఎవకూ ప్రతీకారాలకు పోవాలని కోరుకోవడం లేదు. ఐదేళ్లపాటు వైసీపీ నాయకులు ఎలా వ్యవహరించారో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రజలు శాంతిభద్రతలే కోరుకుంటారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...