Vijayashanthi: కేసీఆర్ పైనే ముందు కేసులు పెట్టాలన్న విజయశాంతి

ABN , First Publish Date - 2023-01-19T19:04:41+05:30 IST

సీఎం కేసీఆర్‌ను బీజేపీ నేత విజయశాంతి (Vijayashanti) సూటిగా ప్రశ్నించారు...

Vijayashanthi: కేసీఆర్ పైనే ముందు కేసులు పెట్టాలన్న విజయశాంతి

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ను బీజేపీ నేత విజయశాంతి (Vijayashanti) సూటిగా ప్రశ్నించారు. ‘‘కొన్నాళ్ల కిందట సీఎం కేసీఆర్ (CM KCR) మనవడిపై సోషల్ మీడియా (Social media)లో నెగెటివ్ వీడియోలు, ట్రోలింగ్స్ వచ్చినప్పుడు ఏమైందో అందరికీ తెలుసు. రాజకీయంగా పోరాడలేక తమ కుటుంబాన్ని టార్గెట్ చేసుకున్నారని గులాబీ నేతలు నానా గాయీ గత్తర చేశారు. మరిప్పుడు మా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడు, భగీరథ్ విషయంలో కేసీఆర్, ఆయన గులాబీ దళం చేసిందేమిటి? చేస్తోందేమిటి?... స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థుల మధ్య చిన్న చిన్న వివాదాలు చోటు చేసుకుంటాయి, వాళ్లే సర్దుకుంటారు, కలసిపోతారు. భగీరథ్ విషయంలో కూడా అదే జరిగింది. అవతలి విద్యార్థి కూడా అక్కడేం జరిగిందన్న వివరణ ఇచ్చి తామంతా కలసిపోయామని స్పష్టంగా చెప్పాడు. ఇలాంటి విషయాలపై బీఆర్‌ఎస్ (BRS) నేతలకు ఆ మాత్రం అవగాహన ఉండదని మేం అనుకోం. అయినప్పటికీ, విద్యార్థి భవిష్యత్తు అని చూడకుండా కేసులు పెట్టించి వేధించేందుకు బీఆర్‌ఎస్ నేతలు సిద్ధపడటం సిగ్గు చేటు. కేసీఆర్ మనుమడికి సంబంధించి కూడా గతంలో పలు విషయాలు బయటపడిన సంగతి ఆయన గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు విపక్షాలు ఇలాగే వ్యవహరించాయా? ఆ మాటకొస్తే అసలు తెలంగాణలో సర్కారీ బడులతో మొదలుపెట్టి దేశానికి ఇంజనీర్లని అందించే బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల వరకూ అందరీకీ సమస్యలే... పోషకాహారం, టాయ్‌లెట్లు లేక విద్యార్థులు, సక్రమంగా జీతాల చెల్లింపులు జరగని అధ్యాపకులు... ఇలా అందరినీ నానా విధాలుగా వేధిస్తున్న కేసీఆర్ పైనే ముందుగా కేసులు పెట్టాలి. రాష్ట్రాన్ని ఇంతగా అధోగతి పాలు చేసిన ఈ పెద్దమనిషి ఇప్పుడు బీఆరెస్ అంటూ దేశాన్ని ఉద్ధరిస్తాననడం వింతల్లోకెల్లా వింత’’ అని విజయశాంతి పేర్కొన్నారు.

Updated Date - 2023-01-19T22:01:32+05:30 IST