TSPSC: పేపర్ లీక్ కేసులో వెలుగులోకి కొత్త విషయాలు.. బోర్డు మెంబర్లను కూడా..

ABN , First Publish Date - 2023-03-31T16:51:05+05:30 IST

టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీక్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

TSPSC: పేపర్ లీక్ కేసులో వెలుగులోకి కొత్త విషయాలు.. బోర్డు మెంబర్లను కూడా..

హైదరాబాద్: టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీక్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. TSPSC బోర్డు మెంబర్లను కూడా విచారించాలని ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్‌) నిర్ణయించింది. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకంపై TSPSC బోర్డు మెంబర్లను సిట్ అధికారులు విచారించనున్నారు. TSPSCలో ఏడుగురు బోర్డు సభ్యుల స్టేట్‌మెంట్‌ను సిట్ అధికారులు రికార్డు చేయనున్నారు.

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ (TSPSC Question Paper Leakage)పై సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. గ్రూప్‌-1 ప్రశ్నపత్రం లీకేజీలో నిందితులుగా ఉన్న ఇద్దరు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు షమీమ్‌, రమేశ్‌తో పాటు మాజీ ఉద్యోగి సురేశ్‌లను విచారించి పేపర్‌ లీకేజీతో ఇంకా ఎంత మందికి సంబంధం ఉందనే విషయాన్ని తేల్చాలని సిట్‌ అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతితో నిందితులను 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు. బుధవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి ముగ్గురు నిందితులు షమీమ్‌, రమేశ్‌, సురేశ్‌లను సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి సిట్‌ కార్యాలయానికి తరలించారు. ముగ్గురు నిందితులపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. పేపర్‌ లీకైందని మీకు ఎవరి ద్వారా తెలిసింది? ప్రవీణ్‌, రాజశేఖర్‌ల వద్ద గ్రూప్‌-1 ప్రశ్నపత్రాలు ఉన్నట్లు ఎవరు చెప్పారు? గతంలో ఇలా ఏవైనా పేపర్లు లీక్‌ చేసినట్లు మీ దృష్టికి వచ్చిందా? ప్రవీణ్‌ (Praveen), రాజశేఖర్‌ (Rajasekhar) లు మీకు ప్రశ్నపత్రాన్ని ఫ్రీగా ఇచ్చారా? డబ్బులు తీసుకున్నారా? మీరు ప్రశ్నపత్రాన్ని ఎంతమందికి ఇచ్చారు? ఇలా అనేక కోణాల్లో సిట్‌ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. నిందితులు ఒకటి రెండు ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. తమతో ఉన్న పరిచయం కొద్దీ ప్రవీణ్‌ ప్రశ్నపత్రం ఇచ్చాడని, దాన్ని వాట్సా‌ప్‌లో షేర్‌ చేశాడని, తాము ఇతరులెవరికీ ఇవ్వలేదని షమీమ్‌, సురేశ్‌లు సమాధానం చెప్పినట్లు తెలిసింది. కాగా.. రాజశేఖర్‌తో ఉన్న స్నేహం కారణంగానే తనకు ప్రశ్నపత్రం ఇచ్చాడని రమేశ్‌ చెప్పినట్లు సమాచారం.

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై సిట్‌ అధికారులు చేసిన దర్యాప్తు ప్రకారం.. ఇప్పటి వరకు ఏఈ పేపర్లు 12 మందికి, గ్రూప్‌-1 పేపర్లు ఐదుగురికి లీకైనట్లు ప్రాథమికంగా నిర్థారించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు అరెస్టుల సంఖ్య 15కు చేరింది. న్యూజిలాండ్‌లో ఉన్న రాజశేఖర్‌రెడ్డి బావ ప్రశాంత్‌రెడ్డితో కలిసి నిందితుల సంఖ్య 16కు చేరింది. లీకేజీ విషయం టీఎస్‌పీఎస్సీ(TSPSC)లో ఇంకా ఎంతమంది ఉద్యోగులకు తెలుసన్న కోణంలో సిట్‌ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. కాగా, ఏఈ పేపర్‌ లీకేజీకి సంబంధించిన నలుగురు నిందితుల కస్టడీ మంగళవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. వారిని విచారించిన క్రమంలో పలు ఆసక్తికర విషయాలు తెలిసినట్లు సమాచారం. పేపర్‌ను కొన్న వారంతా అప్పులు చేసి, ఆస్తులు కుదువ పెట్టి.. రేణుక భర్త ఢాక్యా నాయక్‌, ఆమె తమ్ముడు రాజేశ్వర్‌కు డబ్బులిచ్చామని చెప్పినట్లు తెలిసింది.

Updated Date - 2023-03-31T16:55:32+05:30 IST