Ponguleti Srinivasa Reddy: పొంగులేటి సంచలన ప్రకటన.. ఇదే గడ్డపై పోటీ చేస్తా..
ABN , First Publish Date - 2023-08-10T13:30:52+05:30 IST
ఖమ్మం జిల్లా ప్రజలు కోరిక మేరకు తాను ఇదే గడ్డపై పోటీ చేసి ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్న మంత్రిని ఇంటికి పంపిస్తానని,
రఘునాథపాలెం(ఖమ్మం): ఖమ్మం జిల్లా ప్రజలు కోరిక మేరకు తాను ఇదే గడ్డపై పోటీ చేసి ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్న మంత్రిని ఇంటికి పంపిస్తానని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తానని ఖమ్మం మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి ఖమ్మం(Khammam) జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడిలో సర్పంచ్ దేవ్సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనులు తమ సంప్రదాయ పద్ధతిలో పొంగులేటికి ఘన స్వాగతం పలకగా.. కోలాటం నడుమ గిరిజనులతో కలిసి పొంగులేటి గిరిజన సంప్రదాయ నృత్యాలు చేశారు. వారితో కలిసి గిరిజన వంటకాలను ఆరిగించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ప్రజలకు కనీసం నీడ లేకుండా చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందని మండిపడ్డారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంపై ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, గిరిజనుల సమస్యల పరిష్కారం బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు.
