Share News

Mallareddy: మంత్రి మల్లారెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్‏కు డిపాజిట్‌ దక్కదు.. ఎంపీగా మేడ్చల్‌ ముఖం చూడని రేవంత్‏రెడ్డి

ABN , First Publish Date - 2023-10-22T08:54:14+05:30 IST

కాంగ్రెస్‌ దొంగల ముఠాకు రేవంత్‌రెడ్డి నాయకుడని, ఇప్పుడు ఆ ముఠాలో మలిపెద్ది సుధీర్‌రెడ్డి కూడా చేరిపోయాడని మేడ్చల్‌

Mallareddy: మంత్రి మల్లారెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్‏కు డిపాజిట్‌ దక్కదు.. ఎంపీగా మేడ్చల్‌ ముఖం చూడని రేవంత్‏రెడ్డి

- కాంగ్రెస్‌ దొంగల ముఠాలో సుధీర్‌రెడ్డి చేరిండు

- పేర్లు మార్చుకునే వజ్రేష్‏ను ప్రజలు నమ్మరు

- బోడుప్పల్‌ సభలో మేడ్చల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మల్లారెడ్డి

ఉప్పల్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ దొంగల ముఠాకు రేవంత్‌రెడ్డి నాయకుడని, ఇప్పుడు ఆ ముఠాలో మలిపెద్ది సుధీర్‌రెడ్డి కూడా చేరిపోయాడని మేడ్చల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి(Chamakura Mallareddy) రేవంత్‌రెడ్డిపై ఘాటైన విమర్శలు చేశారు. అక్కడా ఇక్కడ పేదల పాట్లు కబ్జా చేసిన డబ్బులను రేవంత్‌రెడ్డికి ఇచ్చి తోటకూర వజ్రేష్ యాదవ్‌ టిక్కెట్‌ తెచ్చుకున్నాడని ఆరోపించారు. ఈ ముఠాను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, మేడ్చల్‌లో కాంగ్రెష్‏కు డిపాజిట్‌ గల్లంతవడం ఖాయమన్నారు. శనివారం బోడుప్పల్‌లో ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న ఆయన బోడుప్పల్‌ అంబేడ్కర్‌ చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభించి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎంత మంది కలిసినా, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మవద్దని, కేసీఆర్‌ సారథ్యంలోనే రాష్ట్రం దేశంలోనే అగ్రగామినిగా నిలుస్తుందన్నారు. దేశంలో ఎక్కడ లేని పథకాలను తెలంగాణ ప్రజల కోసం ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత కేవలం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రేవంత్‌రెడ్డి అప్పుడే సీఎం అయిపోయినట్లు పగటి కలలు కంటున్నాడని, అతన్ని ఎంపీగా గెలిపిస్తే నాలుగున్నరేళ్ళ పాటు మేడ్చల్‌ వైపు కన్నెత్తి చూడని ఆయన సీఎం ఎట్లా అవుతాడని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసిన రేవంత్‌రెడ్డిని, తోటకూర జంగయ్య నుంచి వజ్రేష్ యాదవ్‌గా పేర్లు మార్చుకున్న వారిని మేడ్చల్‌ ప్రజలు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. సుధీర్‌రెడ్డి, ఆయన కుమారుడు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డిలు దోపిడీ తప్ప మరొకటి లేదని విమర్శలు చేశారు. బోడుప్పల్‌లో మా మేయర్‌, కార్పొరేటర్లు ప్రజల కోసం సైనికుల్లా పనిచేస్తున్నారు. రూ. 30 కోట్లతో బోడుప్పల్‌ను ఎంతో చక్కగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. మేడ్చల్‌ ప్రజలు తన వెంటనే ఉన్నారని, మల్లారెడ్డి అంటే నమ్మకానికి, నాణ్యతకి, విశ్వాసానికి మారు పేరని ప్రజలకు తెలుసన్నారు. అందుకే ఈ కాంగ్రెస్‌ దొంగల ముఠాతో మేడ్చల్‌ ప్రజలు అప్రమత్తంగా ఉండి మేడ్చల్‌ను కాపాడుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో బోడుప్పల్‌ మేయర్‌ సామల బుచ్చిరెడ్డి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, పీర్జాడిగూడ మేయర్‌ జక్కా వెంకట్‌రెడ్డి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

malla.jpg

Updated Date - 2023-10-22T08:54:14+05:30 IST