Share News

Malkajigiri: మల్కాజిగిరిపై ‘కమలం’ గురి.. టికెట్‌ కోసం ఇప్పటి నుంచే నేతల పోటీ

ABN , Publish Date - Dec 19 , 2023 | 10:11 AM

అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో బీజేపీ(BJP) పార్లమెంట్‌ ఎన్నికలపై దృష్టి సారించింది. గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాల్లో.. గోషామహల్‌లో

Malkajigiri: మల్కాజిగిరిపై ‘కమలం’ గురి.. టికెట్‌ కోసం ఇప్పటి నుంచే నేతల పోటీ

- రేసులో కూన శ్రీశైలం, మురళీధర్‌రావు, రామచందర్‌రావు

- పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానన్న ఈటల

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో బీజేపీ(BJP) పార్లమెంట్‌ ఎన్నికలపై దృష్టి సారించింది. గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాల్లో.. గోషామహల్‌లో విజయం సాధించిన పార్టీ పలుచోట్ల ఓట్ల శాతాన్ని పెంచుకుంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. గ్రేటర్‌ పరిధిలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, చేవెళ్ల(Hyderabad, Secunderabad, Chevella) లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో సికింద్రాబాద్‌ బీజేపీ ఖాతాలోనే ఉండగా.. ఆ స్థానాన్ని నిలుపుకోవడంతోపాటు ఈసారి మల్కాజిగిరి నుంచి జెండా ఎగురేయాలని కమలనాథులు పట్టుదలతో ఉన్నారు.

ఇప్పటి నుంచే కసరత్తు

హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో మజ్లిస్‌ ఆధిపత్యం ఉండడంతో మిగతా రెండు సికింద్రాబాద్‌, మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానాలు బీజేపీకి కీలకం. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మల్కాజిగిరి నుంచి గత లోక్‌సభ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచందర్‌రావు పోటీ చేసి ఓడిపోయారు. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ కంటే ఈసారి మల్కాజిగిరి పార్లమెంట్‌ టికెట్‌పై ఎక్కువ మంది అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే టికెట్‌పై కన్నేసిన నాయకులు ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

భారీగా పెరిగిన ఓటు బ్యాంక్‌

మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో బీజేపీ ఓటు బ్యాంక్‌ గణనీయంగా పెరిగింది. దీని పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు (మేడ్చల్‌, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, కంటోన్మెంట్‌, కూకట్‌పల్లి) ఉన్నాయి. కూకట్‌పల్లి మినహా మిగతా ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేసిన బీజేపీ మంచి ఓట్లు రాబట్టింది. ఉప్పల్‌లో 55,427, మేడ్చల్‌లో 50,535, మల్కాజిగిరిలో 47,332, కంటోన్మెంట్‌లో 41,888, ఎల్‌బీనగర్‌లో 89,075, కుత్బుల్లాపూర్‌లో 1,02,423 ఓట్లు బీజేపీ అభ్యర్థులకు వచ్చాయి. ఈ ఆరు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం ఓట్లు 3,86,680. గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే 82,398 ఓట్లు అదనం. ఇందులో బీజేపీ పొత్తుతో జనసేన పోటీ చేసిన కూకట్‌పల్లి కాకుండానే మంచి ఆధిక్యతను కనబర్చిచిందని నాయకులు భావిస్తున్నారు. కూకట్‌పల్లిలో జనసేన అభ్యర్థికి 39,830 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఈసారి మల్కాజిగిరిలో బలమైన అభ్యర్థిని బరిలోకి దించితే సులువుగా గెలుస్తామనే ధీమాతో పార్టీ ఉంది.

రేస్‌లో పలువురు..

మల్కాజిగిరి లోక్‌సభ టికెట్‌ కోసం కుత్బుల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ దృష్టి పెట్టారు. ఇటీవల ఆయన అగ్రనేతలను కలిసి మల్కాజిగిరి ఎంపీ టికెట్‌ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఆయన ఇటీవల కుత్బుల్లాపూర్‌ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచందర్‌రావు, బీజేపీ సీనియర్‌ నేత మురళీధర్‌రావు కూడా మల్కాజిగిరి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి నుంచి పార్లమెంట్‌కు పోటీ చేస్తానని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్‌ ప్రకటించారు.

Updated Date - Dec 19 , 2023 | 10:11 AM