Jupalli Krishnarao: పీఆర్‌ఎల్‌ఐను సందర్శించేందుకు వెళ్తున్నాం.. ధర్నాకు కాదు

ABN , First Publish Date - 2023-09-09T13:09:11+05:30 IST

పీఆర్‌ఎల్ఐ (పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం) సందర్శించడానికి వెళ్తున్నామని... ధర్నాకు.. రాస్తారోకోకు వెళ్లట్లేదని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Jupalli Krishnarao: పీఆర్‌ఎల్‌ఐను సందర్శించేందుకు వెళ్తున్నాం.. ధర్నాకు కాదు

మహబూబ్‌నగర్: పీఆర్‌ఎల్ఐ (పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం) సందర్శించడానికి వెళ్తున్నామని... ధర్నాకు.. రాస్తారోకోకు వెళ్లట్లేదని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Former Minister Jupalli Krishna Rao) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పీఆర్‌ఎల్‌ఐ పూర్తి చేశామని సీఎం కేసీఆర్.. మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారన్నారు. అయితే ఇది అవాస్తవం.. అది పూర్తి కాలేదని.. అందులో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇప్పటికీ ఖర్చు చేసింది కేవలం 26 వేల కోట్ల రూపాయలని చెప్పుకొచ్చారు. ఇక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీటిని పొలాలకు వదులుతున్నమని చెప్పడం బోగస్ అన్నారు. 12 లక్షల ఎకరాలకు నిరందాలంటే 60 - 70 వేల కోట్ల ఖర్చు అవుతుందన్నారు. మరి మీరు ఇంకా టెండర్లు పిలవలేదని.. కాల్వలకు భూ సేకరణ జరగలేదని... పనులకు ప్లాన్ లేదు నీళ్ళు ఎట్లా వస్తాయని ప్రశ్నించారు. ఇంకా కేఎల్‌ఐలోనే లక్షా నలభై నాలుగు వేల ఎకరాలకు సాగు నీరు రావాల్సి ఉందని లెక్కలే చెబుతున్నాయన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు 90 టీఎంసీల నీటికి కేంద్రం నుంచి అనుమతులు తేలేదన్నారు. మరి ఇది ప్రజలను మభ్య పెట్టేందుకు మాత్రమే అని ఆయన చెప్పుకొచ్చారు.


వట్టెం నుంచి లక్ష ఎకరాలకు సాగు నీటికోసం ఇప్పుడు టెండర్లు పిలిచారన్నారు. ఆంధ్రా ప్రాంత కాంట్రాక్టర్ల లబ్ధి కోసం.. ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పంపుల కోసం రూ.2,400 కోట్లు ప్రైవేటు కాంట్రాక్టర్లకు ఇస్తే.. బీహెచ్‌ఈఎల్ ఇదే పంపులను కేవలం రూ.800 కోట్లకు ఇస్తున్నారన్నారు. అంటే కేవలం పంపులు మోటార్ల వల్లనే రూ1600 కోట్ల అవినీతి జరిగిందన్నారు. దీన్ని నిరుపిస్తానని.. లేదంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. తాను ఆరు సార్లు పోటీ చేసినా.. ఏనాడూ కానీ పనులకు హామీ ఇవ్వలేదని.. కేవలం నీతివంతైన పాలన ఇస్తానని చెప్పానన్నారు. గూగుల్‌ను అడ్డుకుంటారా?.. గూగుల్ మ్యాప్‌లో తమ పతనం కనిపిస్తోందన్నారు. ఇదంతా కేవలం కాంగ్రెస్ బహిరంగ సభ ప్రాముఖ్యతను తగ్గించే కుట్ర అని ఆరోపించారు. ఈ సారి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధపడ్డారని జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.

Updated Date - 2023-09-09T13:09:11+05:30 IST