Share News

KTR: ప్రజల పక్షాన పోరాడుతూనే.. కలిసికట్టుగా ఎదుర్కోవాలి

ABN , Publish Date - Dec 22 , 2023 | 10:50 AM

ప్రజల పక్షాన పోరాడుతూనే.. పార్టీలోని ప్రజాప్రతినిధులు, నేతలను సర్కార్‌ ఇబ్బందులకు గురిచేస్తే కలిసికట్టుగా ఎదుర్కోవాలని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌(KTR) అన్నారు.

KTR: ప్రజల పక్షాన పోరాడుతూనే.. కలిసికట్టుగా ఎదుర్కోవాలి

- బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల సమావేశంలో కేటీఆర్‌

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): ప్రజల పక్షాన పోరాడుతూనే.. పార్టీలోని ప్రజాప్రతినిధులు, నేతలను సర్కార్‌ ఇబ్బందులకు గురిచేస్తే కలిసికట్టుగా ఎదుర్కోవాలని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌(KTR) అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మొదటిసారి గ్రేటర్‌లోని కార్పొరేటర్లతో గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ‘ప్రభుత్వం నుంచి మీపై కేసులు పెట్టడం, ఇతరత్రా ఇబ్బందులుంటే అందరూ సమష్టిగా పోరాడాలి. మేమూ మద్దతుగా ఉంటాం. ఎమ్మెల్యేల విషయంలోనూ పార్టీ ఇదే విధానం అవలంభిస్తుంది’ అని తెలిపారు. అసెంబ్లీలో పరిణామాలు చూస్తే ఎంఐఎం కాంగ్రెస్‏తో వెళ్తుందనుకోవడం లేదన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం సోనియాగాంధీని కలిసిన విషయం.. కాంగ్రెస్ లో టీఆర్‌ఎస్‌ విలీన ప్రతిపాదన.. ఆ క్రమంలో జరిగిన పరిణామాలనూ సమావేశంలో ప్రస్తావించారు. శాసనసభా స్థానాలు పెరిగితే కొందరికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలూ రావచ్చన్నారు. త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదు ఉంటుందని, కమిటీలు, పార్టీలో పదవుల విషయంపై అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ అలవికాని హామీలిచ్చిందని.. నిధుల లభ్యత చూస్తే.. అవన్నీ అమలు చేసే పరిస్థితి లేదన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ఓటమికి అనేక కారణాలుంటాయని, మున్ముందు ఏం చేయాలి..? ఎలా ముందుకు సాగాలి..? అన్న దానిపై దృష్టి సారించాలన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం కేటీఆర్‌ బుజ్జగింపు ధోరణిలో మాట్లాడారని పలువురు కార్పొరేటర్లు ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.

Updated Date - Dec 22 , 2023 | 10:50 AM