అరెస్టులు.. జైళ్లు కొత్త కాదు
ABN , First Publish Date - 2023-04-07T02:34:15+05:30 IST
అధికార పార్టీ కుట్రలు, కుతంత్రాల్లో భాగంగానే తనపై టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ కేసుని మోపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
అధికార పార్టీ కుట్రల్లో భాగంగానే నాపై కేసు పెట్టారు
కేసీఆర్ కుట్రలకు భయపడొద్దు.. అధిష్ఠానం అండగా ఉంది
పార్టీ కార్యకర్తలకు సంజయ్ లేఖ
కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 6: అధికార పార్టీ కుట్రలు, కుతంత్రాల్లో భాగంగానే తనపై టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ కేసుని మోపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. టీఎ్సపీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో ప్రభుత్వ తప్పిదాలను, సీఎం కేసీఆర్ కుమారుడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాత్రను ఎత్తిచూపుతూ ప్రశ్నించినందుకే తనను జైలుకు పంపారని మండిపడ్డారు. 30 లక్షల మంది నిరుద్యోగుల కుటుంబాల పక్షాన బీజేపీ చేస్తున్న ఉద్యమాలను నిలువరించేందుకు, కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే ఇదంతా చేశారని ఫైర్ అయ్యారు. తనకు కేసులు, అరెస్టులు, జైళ్లు కొత్తకాదని.. ప్రజల కోసం ఎన్నిసార్లయినా జైలుకు వెళ్లేందుకు సిద్ధమేనని పేర్కొన్నారు. బీజేపీ స్థాపించి 43 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కరీంనగర్ జిల్లా జైల్లో ఉన్న సంజయ్ పార్టీ శ్రేణులకు గురువారం ఓ లేఖ ద్వారా సందేశం పంపించారు. ‘మిగిలిన రాజకీయ పార్టీల మాదిరిగా బీజేపీకి అధికారం ఒక్కటే లక్ష్యం కాదు. మహోన్నతమైన భారతీయ సమాజ నిర్మాణమే అంతిమ లక్ష్యం. ఆ లక్ష్య సాధన కోసమే పనిచేద్దాం’ అని పార్టీ శ్రేణులకు లేఖలో పిలుపునిచ్చారు.
మోదీ సభను సక్సెస్ చేయండి..
తన బాధంతా నిరుద్యోగుల భవిష్యత్తు గురించేనని సంజయ్ అన్నారు. ‘‘30 లక్షల నిరుద్యోగుల జీవితాలతో వాళ్ల కుటుంబాలతో కేసీఆర్ ప్రభుత్వం చెలగాటమాడుతోంది. తమ కుటుంబ సభ్యులకు పార్టీ నేతల అనుచరులకు వందిమాగధులకు ఉద్యోగాలు కల్పిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలే రాకుండా చేస్తోంది. ఉద్యోగాలు రావనే నిరాశ, నిస్పృహల్లో యువత ఉంది. నాడు తమ స్వార్థం కోసం 27 మంది ఇంటర్ విద్యార్థులను బలి తీసుకుంది. ఈరోజు టెన్త్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. నాడు తెలంగాణ యువత బలిదానాలు చేసుకోవద్దని పార్లమెంట్ సాక్షిగా కొట్లాడింది బీజేపీయే. నేడు నిరుద్యోగులు, విద్యార్థుల పక్షాన ఉద్యమిస్తోంది కూడా బీజేపీయే. ఈ సమయంలో సీఎం కేసీఆర్ కుట్రలకు భయపడి వెనుకంజ వేయొద్దు. ఈ విషయంలో ప్రధాని మోదీ మనకు స్ఫూర్తి. గోద్రా అల్లర్ల ఘటనలో మోదీని దోషిగా చూపి బీజేపీని దెబ్బతీసేందుకు కాం గ్రెస్, కమ్యూనిస్టు పార్టీలతో కలిసి కుహనా శక్తులు మీ డియా ద్వారా విష ప్రచారాన్ని సాగించిన విషయాన్ని మనం మర్చిపోలేం. అయినా మోదీ ప్రజల్లోకి వెళ్లి మళ్లీ అధికారంలోకి వచ్చారు. అంతటి మహానేత ఈ నెల 8న హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో సభకు హాజరయ్యే అవకాశం నాకు కనిపించకపోవడం బాధగా ఉంది. మీరంతా మోదీ సభకు హాజరు కావడంతోపాటు నిరుద్యోగ యువతను సభకు తరలించి దిగ్విజయం చేయాలని కోరుతున్నాను. శ్యాంప్రసాద్, దీన్దయాల్ సిద్ధాంతాలు, వాజ్పేయి త్యాగం, మోదీ స్ఫూర్తితో ముందుకెళ్దాం’’ అని లేఖలో పేర్కొన్నారు.
కేసీఆర్ సర్కార్ను బొందపెట్టడమే లక్ష్యం
కేసీఆర్ పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు సహా సబ్బండవర్గాలు అనేక కష్టాలను అనుభవిస్తున్నాయని సంజయ్ అన్నారు. వాళ్లందరికి బీజేపీ ఆశాదీపమైందని పేర్కొన్నారు. వాళ్ల ఆశలను నెరవేర్చాలంటే పోరాటమే శరణ్యమని.. కేసీఆర్ సర్కార్ను బొందపెట్టడమే మన లక్ష్యమని వ్యాఖ్యానించారు. దొంగ సారా, డగ్ర్స్, పేపర్ లీకేజీ, భూదందాల స్కాంలకు వేల కోట్లు కూడగట్టి విర్రవీగుతున్న కేసీఆర్ మెడలు వంచే సమ యం ఆసన్నమైందన్నారు. బిడ్డ, కొడుకు చేసిన స్కాంలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతోనే తనను అరెస్టు చేసి జైలుకు పంపి ఉద్యమాలను అడ్డుకోవాలని చూస్తోందన్నారు. ‘‘ప్రతిపక్షాల కూటమికి చైర్మన్ను చేస్తే ఎన్నికలకు అయ్యే ఖర్చునంతా తానే భరిస్తానంటూ ప్రతిపక్ష పార్టీలకు ఆఫర్ చేసిన విషయాన్ని ప్రముఖ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ బయటపెట్టడంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ప్రజలే నా కుటుంబం. మీరే నా బలం. గడీల్లో బందీ అయి విలపిస్తున్న తెలంగాణ తల్లిని బంధవిముక్తి చేయడమే మనందరి లక్ష్యం. ఇందుకోసం తెగించి కొట్లాడుదాం. టీఎ్సపీఎస్సీ లీకేజీకి బాధ్యుడైన కేటీఆర్ను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసే వరకు, నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేవరకు, లీకేజీ వ్యవహారంపై సిటింగ్ జడ్జితో విచారణ జరిపించే వరకు ఐక్య పోరాటాలకు సిద్ధంకండి’’ అని పిలుపునిచ్చారు. ‘‘టెర్రరిస్టులకు మద్దతునిచ్చే మజ్లిస్తో.. తెలంగాణను వ్యతిరేకించి దేశ విచ్ఛిన్నానికి కుట్ర చేస్తున్న కమ్యూనిస్టులతో అంటకాగుతున్న కేసీఆర్ కుటుంబ, అవినీతి పాలనకు చరమగీతం పాడాలి. ఈ పోరాటంలో కార్యకర్తలందరికీ జాతీయ నాయకత్వం అండదండలు, ఆశీస్సులు ఉంటాయి.. ఎవరూ భయపడాల్సిన పనిలేదు’’ అని సంజయ్ భరోసానిచ్చారు.