Etala Rajender: కేసీఆర్‌ను గద్దెదించేది బీజేపీనే: ఈటల

ABN , First Publish Date - 2023-05-04T21:23:15+05:30 IST

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ (CM KCR)ను గద్దెదించే శక్తిబీజేపీకే ఉందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (Etala Rajender) స్పష్టం చేశారు. బీజేపీ మాత్రమే బీఆర్‌ఎస్‌..

Etala Rajender: కేసీఆర్‌ను గద్దెదించేది బీజేపీనే: ఈటల

ఖమ్మం: రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ (CM KCR)ను గద్దెదించే శక్తిబీజేపీకే ఉందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (Etala Rajender) స్పష్టం చేశారు. బీజేపీ మాత్రమే బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ను ఎదుర్కొగలదన్నారు. బీజేపీలో చేరిక విషయమై గురువారం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy)తో బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్‌ ఈటల రాజేందర్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రఘునందనరావు (MLA Raghunandana Rao), మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వరరెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి చర్చలు జరిపారు. అనంతరం ఈటల రాజేందర్‌ మీడియాతో మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన 12మంది ఎమ్మెల్యేలను కేసీఆర్‌ చేర్చుకున్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీని ఖతం చేసే కార్యక్రమాన్ని కేసీఆర్‌ 2014నుంచే ప్రారంభించారని తెలిపారు. కేసీఆర్‌కు తన అధికార, ధన బలంతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లొంగదీసుకొని తమ పార్టీలో చేర్చుకునే శక్తి ఉందన్నారు. అయితే ఎవరికీ లొంగకుడా నిలబడి కలబడే పార్టీ బీజేపీ ఒక్కటేనని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్‌ (BRS)కు రాజీనామా చేసిన పొంగులేటి కేసీఆర్‌ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఆత్మీయ సమ్మేళనాలతో ప్రజలను సంఘటితం చేసి పోరాటం సాగిస్తున్నారని కొనియాడారు. పొంగులేటి లక్ష్యం, తమ పార్టీ లక్ష్యం కేసీఆర్‌ను గద్దెదించడమేనని పేర్కొన్నారు. పొంగులేటితో గతంలో తమందరికీ వ్యక్తిగతంగా సంబంధాలున్నందున ఆయను బీజేపీలోకి రావాలని ఆహ్వానించడానికి వచ్చామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో రాచరిక, నిరంకుశ పాలనను అంతమొందించాలని ప్రధాని మోదీ, అమిత్‌షాను ఆదేశించారని తెలిపారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులను కలిసినట్లు ఈటల రాజేందర్ తెలిపారు.

Updated Date - 2023-05-04T21:23:15+05:30 IST