Kishan Reddy: కేసీఆర్ టార్గెట్‌గా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కేంద్రమంత్రి

ABN , First Publish Date - 2023-05-27T12:08:43+05:30 IST

కేంద్రాన్ని, ప్రధానిని ఆడిపోసుకోవటం తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదు. మహారాష్ట్రలో తలకమాసిన వాళ్లు మాత్రమే బీఆర్ఎస్‌లో చేరుతున్నారు.

Kishan Reddy: కేసీఆర్ టార్గెట్‌గా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కేంద్రమంత్రి
Kishan Reddy

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) టార్గెట్‌గా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. 2014లో సీఎంగా ప్రమాణస్వీకారం చేయకముందే కేసీఆర్ తల నరుక్కోవాలని వ్యాఖ్యానించారు. దళిత సీఎం, మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్రూం ఇళ్లు సహా కొన్ని వందల సార్లు తెలంగాణ సీఎం కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం సాయంపై చర్చకు సిద్ధమని కేసీఆర్‌కు కిషన్ రెడ్డి సవాలు విసిరారు. తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కంపెనీగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా డబ్బులు పంచడం కోసమే 111 జీవో రద్దు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలకు 111 జోవో పరిధిలో వందలాది ఎకరాలున్నాయన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు కలసి మాట్లాడుకుని కార్యాలయాలకు భూములు తీసుకున్నారని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబానికి భూ దాహం, అప్పుల దాహం తీరటం లేదని ధ్వజమెత్తారు. నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం‌ కేసీఆర్ హాజరుకావపోవటం తెలంగాణకు తీవ్ర నష్టం అన్నారు. నీతి ఆయోగ్ సమావేశం కంటే కేసీఆర్‌కు ముఖ్యమైన పని ఏముందో చెప్పాలని డిమాండ్ చేశారు.

‘‘30 వేల ఎకరాలను అమ్మటానికి కేసీఆర్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 111 జీవో రద్దుతో ఎప్పటికైనా హైదారాబాద్‌కు ముప్పు తప్పదని హెచ్చరించారు. 111 జీవో ఎత్తివేస్తే హైదరాబాద్ ఏమైపోతుందో ప్రభుత్వం ఆలోచన చేయాలి. అప్పులపై తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి. 135 ఏళ్ల చరిత్ర కలిగిన వరంగల్ జైలు భూములు తాకట్టు పెట్టారని వార్తలొస్తున్నాయి. నీ తెలంగాణ.. నా తెలంగాణ కాదు.. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని కేసీఆర్ గుర్తుంచుకోవాలి. గుణాత్మకమైన మార్పు తీసుకొస్తానన్న కేసీఆర్ ఇంట్లో కూర్చున్నారు. కేంద్రాన్ని, ప్రధానిని ఆడిపోసుకోవటం తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదు. మహారాష్ట్రలో తలకమాసిన వాళ్లు మాత్రమే బీఆర్ఎస్‌లో చేరుతున్నారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం 50 వేల‌ కోట్లు బకాయిలు చెల్లించాలి. కేసీఆర్ హాయాంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. మోదీ (PM MODI) సమర్థ నాయకత్వం వలనే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడింది.’’ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-05-27T12:08:43+05:30 IST