Palamuru Rangareddy Project: ఎన్జీటీ జరిమానాపై సుప్రీం స్టే

ABN , First Publish Date - 2023-02-17T13:00:57+05:30 IST

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

Palamuru Rangareddy Project: ఎన్జీటీ జరిమానాపై సుప్రీం స్టే

న్యూఢిల్లీ: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌ (Palamuru Rangareddy project)పై శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు (Supreme Court) లో విచారణ జరిగింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై ఎన్జీటీ (NGT) విధించిన రూ.500 కోట్ల జరిమానాపై సుప్రీం స్టే విధించింది. ఎన్జీటీ జరిమానా విధిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) సవాల్ చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిపింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజక్టులో పర్యావరణ అనుమతులు ఉన్న 7.15 టీఎంసీల వరకు పని కొనసాగించుకునేందుకు మాత్రమే ఉన్నతన్యాయస్థానం అనుమతించింది. కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకుకోవాలని స్పష్టం చేసింది.

తాగునీటి ఎద్దడిని ఎదుర్కోవద్దని, ప్రజలు ఇబ్బందులకు గురికాకూడదన్న ఉద్దేశ్యంతోనే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా (Justice Sanjeev Khanna), జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌ (Justice MM Sundaresh)ల ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ కేసులో మెరిట్స్‌ ఆధారంగానే తగిన నిర్ణయాలు ఉంటాయని ధర్మాసనం పేర్కొంది. ఈ ప్రాజక్టు నిర్మాణంలో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ విధించిన రూ.500 కోట్ల జరిమానాపై సుప్రీం స్టే విధించింది. ఈ కేసుకు సంబంధించి ప్రతివాదులందరికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో ప్రతివాదులు అంతా... కౌంటర్‌ అఫిడవిట్‌లు దాఖలు చేయాలని, ఆ తర్వాత ఆరు వారాల్లో వాటికి సమాధానంగా రిజాయిండర్‌లు దాఖలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఆగష్టులో చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.

Updated Date - 2023-02-17T13:00:58+05:30 IST