Share News

JP KTR: ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసిన కేటీఆర్

ABN , First Publish Date - 2023-10-25T03:25:15+05:30 IST

రాజకీయ జీవితంలో తన సగం సమయం నేతల పంచాయితీలు తీర్చేందుకే సరిపోతోందని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు.

JP KTR: ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసిన కేటీఆర్

  • సగం శక్తి పంచాయితీలకే!

  • రాజకీయ జీవితంలో ఇది నిత్యకృత్యం

  • ఏపీ అభివృద్ధిపై మాట్లాడినా ట్రోల్‌ చేశారు

  • జేపీతో ఇష్టాగోష్ఠిలో కేటీఆర్‌ వ్యాఖ్యలు

హైదరాబాద్‌, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): రాజకీయ జీవితంలో తన సగం సమయం నేతల పంచాయితీలు తీర్చేందుకే సరిపోతోందని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఒక టీవీచానల్‌లో లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణతో ఇష్టాగోష్ఠిగా ఆయన మాట్లాడారు. నరకప్రాయమైన రాజకీయాలను ఎలా భరిస్తున్నారన్న జేపీ ప్రశ్నకు కేటీఆర్‌ స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు. ‘‘పంచాయతీలో సర్పంచి పక్కన సీటు ఇవ్వాలని ఎంపీటీసీ, మరోచోట ఎంపీడీవో పక్కన సీటు కావాలని జెడ్పీటీసీ అడుగుతారు. ఇద్దరినీ సంతృప్తి పరిచేలా మాట్లాడాలి. నిత్యం ఇలాంటి పంచాయితీలు ఎన్నో వస్తుంటాయి’’ అన్నారు. 2009లో ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైనప్పుడు ఉదయం 5 గంటలకు సిరిసిల్ల నుంచి కార్యకర్త ఫోన్‌ చేసి, నీళ్ల ట్యాంకర్‌ వచ్చింది... బిందెలు క్యూలో పెట్టి వరుసగా పట్టుకొనేట్లు చూడన్నా అని రిక్వెస్ట్‌ చేశాడని వెల్లడించారు.

అమెరికాలో ఐటీ కంపెనీ పెట్టిన ముగ్గురు తెలుగు యువకులు ఇటీవలే వరంగల్లో బ్రాంచ్‌ పెట్టుకున్నారని, అందులో ఇద్దరు ఏపీ వాళ్లు ఉండటంతో ఏపీలోని ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీకంపెనీ పెట్టాలని వారికి సూచించానని వెల్లడించారు. ‘‘అవసరమైతే అక్కడి సీఎం జగనన్నతో మాట్లాడి భూమి ఇప్పిస్తా’’ అన్న మాటను పట్టుకొని తనను సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేశారని ప్రస్తావించారు. అక్కడ కూడా అభివృద్ధి జరగాలన్నదే తన ఉద్దేశం అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనపై జేపీ స్పందిస్తూ,‘‘ఉద్యమ సమయంలో హైదరాబాద్‌ గురించి అనేక అనుమానాలుండేవి. ఇక్కడ ఉంటున్న ఇతర ప్రాంతాల వారి భద్రతపై ఆందోళన ఉండేది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత అలాంటి ప్రతికూల ఆలోచనలకు తావివ్వకుండా సమ దృష్టిలో చూసిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వెళుతుంది. దీనికి మీ ప్రభుత్వాన్ని వందశాతం అభినందిస్తున్నా’’ అన్నారు. సంక్షేమ పథకాలతో పాటు యువత ఉపాధిపై ప్రధానంగా దృష్టి సారించాలని కేటీఆర్‌కు సూచించారు. వరుస ఎన్నికల్లో మోదీ గెలుస్తుండటంతో అసహనంతోనే కాంగ్రెస్‌ అడ్డగోలుగా హామీలు ప్రకటిస్తోందని కేటీఆర్‌ ప్రస్తావించగా.... దేశ భవిష్యత్తునే ఫణంగా పెడుతోందని జేపీ దుయ్యబట్టారు.

Updated Date - 2023-10-25T11:15:58+05:30 IST